చమురుకు మరింత డిమాండ్‌ | India emerging as driving force for global oil demand growth S P Global | Sakshi
Sakshi News home page

చమురుకు మరింత డిమాండ్‌

May 22 2025 1:47 PM | Updated on May 22 2025 2:23 PM

India emerging as driving force for global oil demand growth S P Global

న్యూఢిల్లీ: దేశీయంగా చమురు వినియోగం వచ్చే దశాబ్ద కాలం పాటు గణనీయంగా పెరగనుంది. వార్షికంగా 4 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌లో భాగమైన ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ కమోడిటీ ఇన్‌సైట్స్‌ ఈ మేరకు అంచనాలు వెలువరించింది. దీని ప్రకారం 2025లో ఇప్పటివరకు ఆయిల్‌ వినియోగం రోజుకు 4.8 మిలియన్‌ బ్యారెళ్లుగా (ఎంబీపీడీ) ఉంది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4.3 శాతం పెరిగింది.

చమురు ఎగుమతి దేశాల నుంచి సరఫరా పెరగడం, అంతర్జాతీయంగా డిమాండ్‌ కాస్త మందగించడం వంటి అంశాల కారణంగా ఈ ఏడాది చమురు రేట్లు కొంత నెమ్మదించినట్లు సంస్థ హెడ్‌ ఆఫ్‌ ఇండియా కంటెంట్‌ (క్రాస్‌ కమోడిటీస్‌) పులకిత్‌ అగర్వాల్‌ తెలిపారు. మెరుగైన ఆర్థిక వృద్ధి వంటి సానుకూలాంశాలతో భారత్‌లో ఆయిల్‌కు డిమాండ్‌ పెరుగుతోందన్నారు. అంతర్జాతీయంగా భారత్‌కి మరింత ప్రాధాన్యం లభిస్తోందని వివరించారు. రష్యా నుంచి వరుసగా నాలుగో ఏడాది కూడా నిరాటంకంగా సరఫరా కొనసాగుతున్న నేపథ్యంలో ముడి చమురు కొనుగోళ్లకు మనకు మరిన్ని వనరులు అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు.  

పర్యావరణహిత ఇంధనాల వ్యయాలు తగ్గాలి.. 
పర్యావరణహిత ఇంధనాల వ్యయాలు ఎంత తక్కువగా ఉంటే అంత వేగంగా వాటి వైపు మళ్లడం ఉంటుందని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గౌరి జోహర్‌ చెప్పారు. ఈ విషయంలో వివిధ టెక్నాలజీలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వ విధానాలు, నియంత్రణ సంస్థల నిబంధనలు, కార్పొరేట్ల చొరవ మొదలైన అంశాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అయితే, హరిత ఇంధనాల వైపు మళ్లినంత మాత్రాన పాత ఇంధనాల వినియోగం పూర్తిగా నిల్చిపోతుందనడానికి లేదని తెలిపారు. బొగ్గు నుంచి చమురుకు మారినప్పటికీ ప్రపంచంలో బొగ్గు వినియోగం ఆగిపోలేదన్నారు. 

వాస్తవానికి గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత పెరిగిందని గౌరి తెలిపారు. మరోవైపు, టారిఫ్‌లపై ఆందోళనలతో దేశీ మార్కెట్లలో నిల్వలు పెరగడం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ పడిపోవడం వంటి అంశాలపై ఆందోళన నెలకొన్నప్పటికీ 2025–26లో జీడీపీ వృద్ధికి మించి పెట్రోకెమికల్స్‌కు డిమాండ్‌ ఉంటుందని అసోసియేట్‌ డైరెక్టర్‌ స్తుతి చావ్లా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ నెమ్మదిస్తుండటం, టారిఫ్‌లపై అనిశ్చితి, మార్జిన్లు తగ్గడం, ఉత్పత్తి సామర్థ్యాలు పెరిగిపోవడంలాంటి అంశాలతో సతమతమవుతున్న అంతర్జాతీయ పెట్రోకెమికల్‌ ఉత్పత్తిదారులు భారత్‌పై ఆశలు పెట్టున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement