
శిడి మహోత్సవం ఆదాయం రూ.4.37 లక్షలు
వేటపాలెం: రామన్నపేట శివారులో వేంచేసియున్న కనక నాగవరపమ్మ అమ్మవారి శిడిమహోత్సవం సందర్భంగా ఆలయానికి రూ. 4.37 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఈఓ పోతిన శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. విరాళాల ద్వారా రూ. 49,700, సాధారణ దర్శనం రూ.33,600, ప్రత్యేక దర్శనాలు రూ. 48,260, షాపులు రూ.81,800, కానుకల హుండీ ద్వారా రూ. 2,24,012 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. మొత్తం రూ.4,37,372 లక్షలు ఆదాయం వచ్చినట్లు చెప్పారు.
డ్రెయిన్లో పడి మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యం
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు వద్ద కొద్ది రోజుల క్రితం డ్రెయిన్లో పడి మృతి చెందిన వ్యక్తి ఆచూకీని పోలీసులు బుధవారం గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం వంకాయలపాడు గ్రామానికి చెందిన తుమ్మిడిపాటి శివ (44) పెళ్లి పనుల కోసం ఈ నెల ఆరో తేదీన విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు వచ్చాడు. అదే రోజు రాత్రి అతను మద్యం మత్తులో నడుచుకుంటూ కానూరు పీవీఆర్ఐకాన్ బిల్డింగ్ వద్దకు చేరుకున్నాక డ్రెయిన్లో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలతో ‘సాక్షి’లో మృతుడి ఫొటోతో ఈ నెల ఎనిమిదో తేదీన వార్త ప్రచురితమైంది. ఈ సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీస్స్టేషన్కు వచ్చారు. వారి నుంచి పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించారు.
వృద్ధురాలి నేత్రదానం
ప్రత్తిపాడు: తాను మరణించినా నేత్రాలు మూతపడకూడదని భావించిన ఓ వృద్ధురాలు వాటిని దానం చేశారు. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు గ్రామానికి చెందిన వృద్ధురాలు మండెపూడి హేమలత (66) నేత్ర దానం చేసి మరణానంతరం మరరొకరికి ఈ లోకాన్ని చూసే అవకాశాన్ని కల్పించారు. హేమలత బుధవారం గొట్టిపాడులోని స్వగృహంలో మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె కోరిక మేరకు నేత్రాలను శంకర కంటి ఆస్పత్రి డాక్టర్ శ్రీనిజ బృందం సేకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారికి గ్రామస్తులు, పెద్దలు అభినందనలు తెలిపారు.

శిడి మహోత్సవం ఆదాయం రూ.4.37 లక్షలు