
మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి
చీరాల రూరల్: కేంద్ర ప్రభుత్వం–మావోయిస్టులు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలకు సంకేతాలు ఇవ్వాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివాసీలతో బుధవారం పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత జనసమాఖ్య వ్యవస్థాపకుడు డాక్టర్ మాచర్ల మోహనరావు మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఖనిజ సంపదను విదేశీ సంస్థలు కొల్లగొట్టకుండా అడ్డుకుంటున్న ఆదివాసీలను, వారికి మద్దతిస్తున్న మావోయిస్టులపై కేంద్రం దాడులను కొనసాగించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్కుమార్ ధర్మ మాట్లాడుతూ ఆదివాసీలను కేంద్రం శత్రువులుగా భావిస్తోందన్నారు. చీరాల అభివృద్ధి సాధన సమితి నాయకులు శీలం రవికుమార్ మాట్లాడుతూ దేశంలో అంతర్గత భద్రత కూడా ముఖ్యమన్నారు. బీసీ ఫెడరేషన్ నాయకుడు ఊటుకూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆదివాసీలతోపాటు మైనారిటీలకు రక్షణ కరవైందన్నారు. నాయకులు గాదె హరిహరరావు, చుండూరి వాసు, షేక్ బషీర్, అబ్దుల్లా, దేవన వీరనాగేశ్వరరావు, మేడిన వెంకటరెడ్డి, గుంటూరు మల్లికార్జునరావు, షేక్ జిలాని, యానాది సంఘాల నాయకులు మానికల పౌలస్, పద్మ, ఏలియ, కనకయ్య, జి. అశోక్, సత్యానందం, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.