బాపట్ల: చిన్నగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహించిన పీ–4 కార్యక్రమంలో భాగంగా ఎంపికై న చిన్నగంజాం మండలం కొత్తగొల్లపాలెం గ్రామానికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆ గ్రామంలో ప్రజలు కోరిన సదుపాయాల గురించి వాటి పురోగతిపై ఆరా తీశారు. గృహ నిర్మాణాల కోసం 42 మంది, ఇళ్ల స్థలాల కోసం 13 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికి పొజిషన్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్లు చిన్నగంజాం తహసీల్దార్ జిల్లా కలెక్టర్కు వివరించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్ చేసినట్లు గృహ నిర్మాణ సంస్థ అధికారి కలెక్టర్కు వివరించారు. గ్రామంలో 17 మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని వాటిలో రెండు పూర్తి చేశామని, మిగిలిన పనులు జరుగుతున్నాయని, 304 ట్యాప్ కనెక్షన్లను జలజీవన్ మిషన్ పథకం ద్వారా పూర్తికి చర్యలు తీసుకోవడమైనదని, గ్రామంలో 131 సోక్ పిట్స్ మంజూరయ్యాయని, ఆ పనులన్నీ జరుగుతున్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వివరించారు. గ్రామంలో 4.48 కిలోమీటర్ల అంతర్గత సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు కోసం నిధులు మంజూరయ్యాయని, ఈ పనులను త్వరలో ప్రారంభిస్తామని పంచాయతీరాజ్ ఎస్ఈ కలెక్టర్కు వివరించారు. పర్చూరు నియోజకవర్గంలో ఆరు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి రూ.25 కోట్లు ఖర్చు అవుతుందని, ప్రతిపాదనలు సమర్పించడమైనదని ఏపీ ఎస్పీడీసీఎల్ ఈఈ వివరించారు. బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న నూతన భవన పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని సర్వ శిక్ష అభియాన్ అధికారి వివరించారు. కొత్త గొల్లపాలెం అభివృద్ధి పనులను అధికారులందరూ చిత్తశుద్ధితో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, డ్వామా పీడీ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.విజయమ్మ, ఏపీ సీపీడీసీఎల్ ఈఈ మల్లికార్జునరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి విలియమ్స్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దెబోరా, చిన్నగంజాం తహసీల్దార్ ప్రభాకర్, సర్వ శిక్ష అభియాన్ అధికారి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి కొత్తగొల్లపాలెం అభివృద్ధిపై సమీక్ష