
దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలి
బాపట్ల: అనాధ శిశువుల దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. బాలల సంక్షేమ కమిటీ సమావేశం బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగింది. అనాధ శిశువులను దత్తతతో తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని కలెక్టర్ చెప్పారు. చెత్త కుండీల వద్ద, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్టాండ్ల వద్ద వదిలేసిన శిశువులు మహిళ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే శిశు గృహ, బాల సధన్లలో ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. అలాంటి శిశువులు, బాలలు ఏడుగురు ప్రభుత్వ సంరక్షణలోని శిశు గృహంలో ఉన్నారన్నారు. శిశు గృహానికి వచ్చిన వారందరికీ తల్లిదండ్రుల ప్రేమ అందించాలన్నారు. మొదటిసారిగా బాపట్ల జిల్లా నుంచి దత్తత ఇవ్వడానికి అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. కారా (చైల్డ్ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) ద్వారా ఈ ప్రక్రియ జరగనుందన్నారు. ప్రస్తుతం ఇరువురికి దత్తత ఇవ్వడానికి జిల్లాస్థాయి కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. కారా నిబంధనలను అనుసరించి బాలిక లావణ్య, బాలుడు కార్తీక్లకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి ఫోన్లోనే కలెక్టర్ ఆదేశాలిచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధా మాధవి, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, జువైనెల్ వెల్ఫేర్ కమిటీ ప్రొబిషన్ అధికారి సౌందర్య, ఐసీడీఎస్ డీసీపీఓ పురుషోత్తమరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
యోగాంధ్ర సభ్యుల నమోదు వేగవంతం..
బాపట్ల: యోగాంధ్రలో సభ్యుల పేర్ల నమోదును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. బుధవారం, స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఎంపీడీఓలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా నుంచి 6,31,435 మంది సభ్యులను నమోదు చేసేందుకు లక్ష్యాలను నిర్దేశించామన్నారు. అందులో ఇప్పటివరకు 5,55,218 మంది సభ్యులు పేర్లు నమోదు చేశారన్నారు. మండలాల వారీగా ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయడంలో వెనుకబడిన మండల ఎంపీడీఓలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల నమోదులో సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు యోగా గ్రూప్ని తయారు చేయాలని, నిర్దేశించిన లక్ష్యాల పురోగతిపై పర్యవేక్షణ చేయాలని డీఆర్డీడీఏ పీడీకి సూచించారు.
చెత్త నుంచి సంపద సృష్టించాలి
జిల్లాలో ప్రతి గ్రామంలో నూరుశాతం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోనికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గ్రామంలో చెత్తను డోర్ మిత్ర, క్లాప్ మిత్ర సభ్యులచే ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాలని ఆయన తెలిపారు. సేకరించిన చెత్తను రెండు భాగాలుగా విడగొట్టి వాటిని ఎస్డబ్ల్యూపీసీ కేంద్రాలకు తరలించాలని ఆయన తెలిపారు. డీఈఓ పురుషోత్తం, డీపీఓ ప్రభాకర్, బాపట్ల డీఎల్డీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి