
వైకుంఠపురం కొండకు అపచారం
అమరావతి: పవిత్ర పుణ్యక్షేత్రమైన వైకుంఠపురంలో స్వయంభూగా వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి కొండకు అపచారం జరుగుతోంది. కూటమి నేతల అండదండలతో కొందరు అక్రమంగా గ్రావెల్ కోసం కొండను తవ్వేస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. వివరాల్లోకెళితే.. రాజధాని అమరావతికి సమీపాన ఎంతో చారిత్రక నేపధ్యం కలిగిన వైకుంఠపురం కొండపై వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈకొండ పక్కనుంచే పవిత్ర కృష్ణానది ఉత్తర దిక్కుగా ప్రవహించి ఉత్తరవాహినిగా పేరుగాంచింది. ఈకొండ చుట్టూ అష్టదిగ్బంధనంలాగా ఎనిమిది ఆంజనేయస్వామి వారి విగ్రహాలు ప్రతిష్టించి ఉన్నాయని గ్రామస్తులు నమ్మకం. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన కొండను కూటమి నేతల అండదండలతో పలువురు ఉత్తరవాహిని సమీపంలో తవ్వి గ్రావెల్ తరలిస్తున్నారు. రోజుకు వందలాది ట్రక్కులకు పైగా భారీ పొక్లెయిన్లతో మట్టి తవ్వి తరలిస్తున్నారు. దీనిపై స్థానిక రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈకొండను తాము ఎంతో పవిత్రంగా పూజిస్తామని అటువంటి కొండను తవ్వడం అపచారమంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు అక్రమ గ్రావెల్ తవ్వకాలపై దృష్టిసారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు.
కూటమి నేతల అండతో తవ్వి తరలింపు