
ప్రైమరీ హెచ్ఎం పోస్టులను ఎస్జీటీలతో భర్తీ చేయాలి
చిలకలూరిపేట: ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో సంఘ సభ్యుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల పోస్టులన్నీ ఎస్జీటీలతోనే భర్తీ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ, సదరు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కేటాయిస్తున్నారనే సమాచారం రావడం బాధాకరమన్నారు. అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలలకు కేటాయించిన హెచ్ఎం పోస్టులను 100 శాతం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని కోరారు. అలాకాకుండా స్కూల్ అసిస్టెంట్ల స్థాయిని తగ్గిస్తూ వారిని తాత్కాలిక ప్రాతిపదికన ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా నియమించటం సరికాదన్నారు. ఈ చర్యను ఉపాధ్యాయ లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టేలోగా దీనిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్కూల్ అసిస్టెంట్ల సేవలను ఉన్నత పాఠశాలల్లో మాత్రమే ఉపయోగించుకోవాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ నాయకులు వినుకొండ అక్కయ్య, మేకల కోటేశ్వరరావు, వి.జయప్రకాశ్, షేక్ మగ్బూల్ బాష, బొంతా రవి, షేక్ మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు