గిరిజన బాలిక అనుమానాస్పద మృతి | Suspicious death of tribal girl | Sakshi
Sakshi News home page

గిరిజన బాలిక అనుమానాస్పద మృతి

Mar 26 2026 3:27 AM | Updated on Mar 26 2026 3:27 AM

Suspicious death of tribal girl

సామూహిక అత్యాచారం జరిగి ఉండవచ్చని అనుమానం

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు

పోలీసుల అదుపులో అనుమానితుడు 

మృతురాలిది శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన 17 ఏళ్ల గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక తల్లితండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు ఊరూరా వెళ్లి సర్కస్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల కిందట విజయనగరం జిల్లా ఎస్‌.కోటకు వెళ్లగా అక్కడ వెంకట్రావు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వెంకట్రావు తరచూ బాలిక ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను ఒప్పించి బాలికను విజయనగరం జిల్లా ఎస్‌.కోట ప్రాంతంలో ఓ కాలేజీలో ఇంటర్‌లో చేర్పించాడు. 

ఇటీవల పరీక్షలు పూర్తి కావడంతో బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. మరుసటి రోజునే వెంకట్రావు ఫోన్‌ చేసి బాలికను పంపించాలని కోరగా.. అప్పటికే నీరసంగా ఉండడంతో కొద్ది రోజుల తర్వాత పంపిస్తామని తల్లిదండ్రులు చెప్పారు. వెంకట్రావు ససేమిరా అంటూ ఇంగ్లిష్‌ నేర్పించేందుకు ప్రైవేట్‌ పెట్టిస్తానని, ఆదివారం వస్తున్నానని బాలికను అప్పగించాలని చెప్పాడు. ఆ ప్రకారమే వెంకట్రావుకు బాలికను అప్పగించారు. మరుసటి రోజు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఇంటి పై నుంచి మీ పాప పడిపోయి మృతి చెందిందని చెప్పాడు. 

మీరు ఎస్‌.కోట రావా ల్సిన అవసరం లేదని వంగరాడమెట్ట సమీపంలోకి వస్తే అక్కడే ఖననం చేసేద్దామని చెప్పాడు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఎస్‌.కోట బయలుదేరగా మధ్యలోనే వారిని ఆపి అంత్యక్రియలు జరిపించేందుకు ఒప్పించాడు. ఇంతలో బాలికలో కదలికలు కనిపించడంతో తల్లిదండ్రులు హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా రాగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తుండగా బాలిక మృతి చెందింది.

బాలిక శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నాయని, అత్యాచారం తర్వాత హత్య చేసి ఉండవచ్చని అక్కడివారు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. వెంకట్రావు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ వివేకానంద నేతృత్వంలో విచారణ ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement