వైఎస్సార్సీపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: వచ్చే నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రారంభమవుతోందని, అత్యంత కీలకమైన దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డీనేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ఆ పార్టీ రాష్ట్ర కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆదివారం ఆయన వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమగ్ర, పారదర్శక ఓటరు జాబితాల రూపకల్పన కోసం ఎస్ఐఆర్ అంటూ తమిళనాడులో ఏకంగా కోటి 40 లక్షల ఓట్లు, పశ్చిమబెంగాల్, బిహార్లో 40–50 లక్షల వరకు ఓట్లు తీసేశారని తెలుస్తోందన్నారు.
ఎస్ఐఆర్ రాక ముందు కూడా మన రాష్ట్రంలో లక్షల ఓట్లు తీసేశారని.. 2019లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గట్టిగా పోరాడితే కొంత వరకు తగ్గారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎస్ఐఆర్కు అందరూ సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లో సమావేశాలు పెట్టుకుని చర్చించాలన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేసుకుని, ప్రతి బూత్కు కచ్చితంగా క్రియాశీలకంగా ఉన్న వారిని ఎంపిక చేయాలని సూచించారు. మన ఓట్లు తీయించే ప్రయత్నం చేసేందుకు అవకాశం ఉన్నందున.. ఓటర్లను గుర్తించడం, మ్యాపింగ్ చేసుకోవడం వెంటనే జరగాలన్నారు. బీఎల్ఓల ద్వారా మనకు తెలియకుండానే ఫామ్ 6, 7 తెచ్చి పెడతారని.. సాంకేతికంగా అవగాహన పెంచుకోవాలన్నారు.
కమిటీల్లో వీలైనంత ఎక్కువ మందిని చేర్చాలి
‘కమిటీల నియామకం వేగంగా పూర్తయింది. ఈ కమిటీల్లో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలన్నది వైఎస్ జగన్ ఆలోచన. క్రియాశీలకంగా ఉన్న చోట, బలం ఉన్న చోట వీలైనంత ఎక్కువ మందిని తీసుకోవాలి. అప్పుడే మనం బలంగా తయారవుతాం. పార్లమెంటు పరిశీలకులు క్షేత్ర స్థాయిలో బలమైన నాయకత్వం తయారు చేయడానికి ఇది దోహదం చేస్తుంది. సెంట్రల్ ఆఫీసుకు, మీకు సమన్వయం చేస్తూ సెక్రటరీలు పని చేస్తారు. 12 లక్షలకు పైగా డిజిటలైజేషన్ లక్ష్యంగా పెట్టుకున్నాం. పార్టీ కార్యక్రమాల్లో క్షేత్ర స్థాయిలో అందరూ క్రియాశీలకంగా పాల్గొనాలి’ అని సజ్జల సూచించారు.


