టాప్ స్కోర్ సాధించిన 16 మంది విద్యార్థులు
వీరిలో 9 మంది పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్–2026లో 91.37 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాలను మంగళవారం రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ సంస్థ చైర్మన్, ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా విడుదల చేశారు. పరీక్షకు 1,63,008 మంది హాజరు కాగా 1,48,950 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 93.57 శాతం, బాలురు 89.88 శాతం ఉత్తీర్ణత వచ్చింది.
16 మంది విద్యార్థులు 120/120 మార్కులు సాధించి టాప్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. వీరిలో 9 మంది పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన విద్యార్థులు ఉండడం విశేషం. రాష్ట్రంలోని 265 పాలిటెక్నిక్ కాలేజీల్లో 87 ప్రభుత్వ, మరో 178 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. వీటిలో 84 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. త్వరలో 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.


