
Plastic use can lead to fines గాజువాక : ప్లాస్టిక్ అమ్మకాలపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న దుకాణాలపై దాడి చేసి భారీ ఎత్తున పాలిథిన్ సంచులను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారుల నుంచి అపరాధ రుసుం కూడా పెద్ద మొత్తంలో వసూలు చేశారు.
టాస్క్ఫోర్స్ ఏర్పాటు
గాజువాకలో ప్లాస్టిక్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నట్టు ఇటీవల జీవీఎంసీ కమిషనర్కు ఫిర్యాదులు అందడంతో ఆయన స్పందించారు. ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని జోనల్ అధికారులను ఆదేశించడంతో పాటు గాజువాక జోనల్ కమిషనర్ డి.శ్రీధర్ నేతృత్వంలో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ప్రజారోగ్య విభాగం అధికారులు గాజువాక మార్కెట్లో ప్లాస్టిక్ సంచులను విక్రయిస్తున్న ఐదు దుకాణాలపై దాడి చేసి 500 కేజీల ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారులనుంచి రూ.75వేల అపరాధ రుసుం వసూలు చేశారు. ప్లాస్టిక్ ఎవరు విక్రయించినా చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్–2022లో భాగంగా స్వచ్ఛ నగరాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జోనల్ కమిషనర్ కోరారు. ప్లాస్టిక్ వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు.
చదవండి: Omicron: జనవరి మూడో వారం నాటికి 2 లక్షల యాక్టివ్ కేసులు!