కడప కలెక్టరేట్లో బైఠాయించిన జనసేన కార్యకర్త వెంకటయ్య
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జనసేన కార్యకర్త
అధికారుల తీరుకు నిరసనగా బైఠాయింపు
బయటకు పంపేసిన పోలీసులు
కడప (సెవెన్ రోడ్స్): ‘గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే నయం. అన్నమయ్య డ్యామ్ తెగిపోయి తీవ్రంగా నష్టపోతే మా పక్క గ్రామమైన పులపత్తూరు రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. మేట వేసిన ఇసుకను తోలుకోవడానికి పర్మీషన్ ఇచ్చారు. టీడీపీ కూటమి ఏదో ఒరగబెడుతుందని నమ్మి ఓట్లువేస్తే.. రెండున్నర సంవత్సరాలైనా మా పొలంలో ఇసుక మేటలు తొలగించలేదు.
కలెక్టరేట్కు తిరుగుతూనే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలం చింతలకోన గ్రామ రైతు, జనసేన కార్యకర్త కూటాలగారి వెంకటయ్య అధికారుల ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం కడప కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల తీరును ఎండగడుతూ బైఠాయించారు. పోలీసులు హుటాహుటిన వచ్చి కలెక్టర్ వచ్చాక తామే ఆయన వద్దకు తీసుకెళ్లి మాట్లాడిస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. వెంకటయ్య వినలేదు. దీంతో పోలీసులు అతడిని బయటకు పంపించివేశారు.


