ట్రాకింగ్‌ మెకానిజం పటిష్టంగా ఉండాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Launches New Spandana Web Portal | Sakshi
Sakshi News home page

నూతన స్పందన పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

Mar 26 2021 5:40 PM | Updated on Mar 26 2021 6:26 PM

CM YS Jagan Launches New Spandana Web Portal - Sakshi

తీసుకున్న వినతులు అత్యంత తీవ్రమైనవి, తీవ్రమైనవి, సాధారణమైనవిగా వర్గీకరిస్తారు...

సాక్షి, అమరావతి :  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో మరింత ఆధునీకరించిన నూతన స్పందన పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..  ‘‘ పౌరుడు వినతిపత్రం ఇచ్చాక అది పరిష్కారం అయ్యే తీరును నేరుగా అధికారులు, ఉన్నతాధికారులు ట్రాక్‌ చేయాలి. ఈ ట్రాకింగ్‌ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలి.  పౌరులనుంచి గ్రీవెన్స్‌లను పరిష్కరించకుండా పక్కనపడేసే పరిస్థితి ఉండకూడదు. నేరుగా సీఎం కార్యాలయ అధికారులు కూడా గ్రీవెన్స్‌ల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పరిశీలన, సమీక్ష చేయాలి.

గ్రీవెన్స్‌ను తిరస్కరిస్తున్నప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారో కచ్చితంగా చెప్పగలగాలి. అలాగే పౌరుడి నుంచి వచ్చిన  గ్రీవెన్స్‌ పరిష్కారానికి అర్హమైనదిగా గుర్తించిన తర్వాత తప్పకుండా దాన్ని పరిష్కరించాలి. నిర్ణీత సమయంలోగా గ్రీవెన్స్‌ పరిష్కారం కాకపోతే అది ఏ స్థాయిలో నిలిచిపోయింది అన్నది తెలియాలి. సంబంధిత సిబ్బంది, అధికారికి అలర్ట్స్‌ వెళ్లాలి. స్పందన వినతుల పరిష్కారమనేది కలెక్టర్ల పనితీరుకు ప్రమాణంగా భావిస్తాం’’ అని అన్నారు.

పటిష్టంగా నవరత్నాల అమలు
నవరత్నాల్లో ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. నవరత్న పథకాల సోషల్‌ ఆడిట్‌ సమయంలోనే అర్హులైన వారి పేర్లు రాలేదని తెలిసిన వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. అయినప్పటికీ ఎవరైనా మిగిలిపోయిన పక్షంలో పథకం అమలు చేసిన తేదీ నుంచి నెలరోజుల పాటు వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలి. తర్వాత నెలలో వెరిఫికేషన్‌ చేయాలి. వాటిని వెంటనే పరిష్కరించి.. మూడో నెలలో వారికి నిధులు విడుదల చేయాలి. అప్పటితో ఆ స్కీం సంపూర్ణంగా ముగిసినట్టు అవుతుంది.

అర్హులందరికీ ఇళ్ల పట్టా
దరఖాస్తు చేసిన 90 రోజుల్లో ఇంటి పట్టా అందాలి. కచ్చితంగా 90 రోజుల్లో ఇంటి పట్టా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.నిర్ణీత సమయంలోగా ఇంటిపట్టా అందించాల్సిన బాధ్యత అధికారులదే. దరఖాస్తు చేసిన 90 రోజుల్లోగా ఇంటి పట్టా అందించాలన్నది ప్రభుత్వ కృతనిశ్చయం

కాగా, పాత స్పందన పోర్టల్‌లో 2677 సబ్జెక్టులు, 27,919 సబ్‌ సబ్జెక్టులు ఉండేవి. అప్‌డేషన్‌ చేసిన పోర్ట్‌ల్‌లో 858 సబ్జెక్టులు,  3758 సబ్‌ సబ్జెక్టులు ఉన్నాయి. దీనివల్ల చాలావరకూ సమయం ఆదా అవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాలు లక్ష్యంగా కొత్త స్పందన పోర్టల్‌లో పౌరులు నేరుగా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. గ్రామ సచివాలయాల ద్వారా కాని, కాల్‌ సెంటర్‌ ద్వారా కాని, వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా కాని, మొబైల్‌ యాప్‌ ద్వారా కాని, ప్రజా దర్బార్ల ద్వారా కాని వినతులు ఇచ్చే అవకాశం ఉంది. తీసుకున్న వినతులు అత్యంత తీవ్రమైనవి, తీవ్రమైనవి, సాధారణమైనవిగా వర్గీకరిస్తారు. తాము ఇచ్చిన వినతి లేదా, దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మూడు ఆప్షన్స్‌ ఉంటాయి.

వెబ్‌ లింక్‌ ద్వారా లేదా 1902కు కాల్‌చేసి లేదా, గ్రామ సచివాలయాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తాము చేసిన వినతి పరిష్కారం పట్ల పౌరుడు సంతృప్తి చెందకపోతే తిరిగి మళ్లీ అదే ఫిర్యాదును ఓపెన్‌ చేసి జిల్లాస్థాయిలో లేదా విభాగాధిపతిస్థాయిలో మళ్లీ విజ్ఞాపన చేయవచ్చు. సేవలపట్ల పౌరుడు నుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటారు. వినతుల పరిష్కారంలో నాణ్యత ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో సర్వేలు థర్డ్‌ పార్టీ ఆడిట్‌కూడా జరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement