‘ఏపీ సెట్స్’కు తగ్గుతున్న దరఖాస్తులు రెండేళ్లతో పోలిస్తే భారీగా క్షీణత
ఉన్నత విద్యావిధానంపై సన్నగిల్లుతున్న నమ్మకం
ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలు చేయకపోవడంతో ఆందోళన
పొరుగు రాష్ట్రాలతో పాటు డీమ్డ్, ప్రైవేట్ వర్సిటీల వైపు విద్యార్థుల అడుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యావిధానంపై విద్యార్థుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్లక్ష్యపూరిత, అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల భవితవ్యాన్ని గందరగోళంలో పడేస్తున్నాయి. కష్టపడి చదివి ప్రవేశ పరీక్ష(ఎంట్రన్స్ టెస్ట్)ల్లో విజయం సాధించి ఏపీలోని ఏదైనా వర్సిటీ, వర్సిటీ పరిధిలోని కళాశాలలో సీటు సంపాదించినా ప్రశాంతంగా చదువుకోలేమనే భావన విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. ఫలితంగా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ‘మేమిక్కడ చదవలేం’ అంటూ పొరుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలను ఎంపిక చేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ముఖ్యంగా ఏటా వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ‘సెట్స్’కు 2026–27లో దరఖాస్తులు భారీగా క్షీణించడం చూస్తుంటే ఉన్నత విద్యలో తిరోగమనం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈఏపీ సెట్లోనూ తగ్గుదలే!
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశాలకు నిర్దేశించిన ఈఏపీసెట్లో ఈ ఏడాది దరఖాస్తులు క్షీణించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఏటా 1.20 లక్షలకుపైగా కనీ్వనర్ కోటాలో ఇంజినీరింగ్ ప్రవేశాలు పొందే విద్యార్థులు ఈఏపీసెట్ను పోటీపడి రాస్తారు. కానీ, ఏపీలో ఇంజినీరింగ్ కళాశాలల్లో నెలకొన్న అనిశి్చతి, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు నిలిచిపోవడంతో విద్యా నాణ్యత తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు విద్యార్థి చదువుకంటే నిత్యం ఫీజుల చెల్లింపులపై కళాశాలలు ప్రశి్నస్తుండటం మానసికంగా కుంగదీస్తోంది.
పోనీ, చివరికైనా ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందా? అంటే గ్యారంటీ ఉండట్లేదు. విద్యార్థుల తల్లిదండ్రులే అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. ఇక్కడ ఉచిత విద్య మిథ్యగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఏపీలో చదివే బదులు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వర్సిటీలు, కళాశాలల వైపు విద్యార్థులు చూస్తున్నారు. ఏపీలోని కొన్ని ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లోనూ చేరికలకు ప్రయతి్నస్తున్నారు. ఫార్మసీ, అగ్రి విభాగాల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. దీని ఫలితంగానే ఈ ఏడాది ఈఏపీ సెట్ దరఖాస్తుల్లో 7వేలకు పైగా తగ్గాయి.

ఎంబీఏ, ఎంసీఏ కల్లే!
ఏపీ విద్యారంగం గడచిన రెండేళ్లుగా తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతోంది. ముఖ్యంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యలో చేరికలు గణనీయంగా పడిపోతున్నాయి. ప్రైవేటు పీజీ విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టిన చంద్రబాబు కుతంత్రానికి ఎంబీఏ, ఎంసీఏ విద్య బలైపోతోంది. రెండేళ్ల కింద ఐసెట్కు 48,828 దరఖాస్తులు వస్తే ఈ ఏడాది ఆ సంఖ్య 26,219 దరఖాస్తులకు పడిపోవడం గమనార్హం. యూనివర్సిటీల్లో ఎంబీఏ, ఎంసీఏలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండగా అక్కడ విద్య నాణ్యత దెబ్బతినడంతో చేరికలు క్షీణించాయి. ఇదే తరహాలో సంప్రదాయ పీజీ కోర్సులైన ఎంకామ్, ఎంఏ, ఎమెస్సీ వంటి కోర్సులు నిరీ్వర్యం అయిపోతున్నాయి. పీజీ సెట్లో ఒకప్పుడు 34వేలకుపైగా దరఖాస్తులు వస్తే.. ఇప్పుడు 18 వేలకు పడిపోయాయి. చివరికి ఈసెట్ (ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం) పరిస్థితి కూడా ఇలానే తయారైంది.
ఎడ్ సెట్, లాసెట్లో పెరుగుదల?
చంద్రబాబు ఏలుబడిలో ఉన్నత విద్య ఎంతలా దిగజారిందో ఎడ్ సెట్, లాసెట్ దరఖాస్తులు చూస్తే అర్థమవుతుంది. బీఈడీ, న్యాయ విద్యను వ్యాపారం చేస్తూ టీడీపీ అనుకూల కళాశాలలు రెచి్చపోతున్నాయి. 450కిపైగా బీఈడీ కళాశాలల్లో కనీసం అధ్యాపకులు లేకుండా, విద్యార్థులు కళాశాలలకు రాకపోయినా రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసి సరి్టఫికెట్లు అంగడి సరుకులుగా అమ్మేస్తుండటం నిత్యకృత్యంగా మారింది. దీనిపై ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవట్లేదు. న్యాయ విద్యను సైతం వ్యాపారంగానే మార్చేసింది. తరగతులు, హాజరుతో పని లేనప్పుడు సరి్టఫికెట్లు మాత్రమే కోరుకునేలా విద్యార్థులను దారి మళ్లించి రూ.కోట్లు గడిస్తున్నాయి. ఈ ఏడాది ఎడ్సెట్కు, లాసెట్కు భారీగా దరఖాస్తులు పెరగడం విద్యావేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


