నేడు విచారిస్తామన్న హైకోర్టు
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలో రామాలయ నిర్మాణానికి అధికారులు అనుమతులు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ స్థానికులు వంగా జ్యోత్స్న, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని, అయినా అధికారులు రామాలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని వివరించారు.
ఈ వ్యాజ్యం గురించి పిటిషనర్ల తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ సోమవారం ఉదయం న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ముందు ప్రస్తావించారు. లంచ్మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. స్పందించిన న్యాయమూర్తి మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.


