ఏఎస్పీ ఆదేశాలు బేఖాతర్‌ | - | Sakshi
Sakshi News home page

ఏఎస్పీ ఆదేశాలు బేఖాతర్‌

Jun 14 2025 7:23 AM | Updated on Jun 14 2025 7:23 AM

ఏఎస్ప

ఏఎస్పీ ఆదేశాలు బేఖాతర్‌

తాడిపత్రి పోలీసుల తీరుతో విసిగిపోయిన జనం

తాడిపత్రి టౌన్‌: ‘కేసు నమోదు చేయాలంటే టీడీపీ నేతల సిఫారసు ఉండాలి. లేకపోతే ఎవరూ చెప్పినా వినేది లేదు’ అంటూ తాడిపత్రి పోలీసులు బాహటంగానే చెబుతుండడంతో పట్టణ ప్రజలు విసిగిపోయారు. ఇంట్లో చోరీ జరిగి 30 రోజులు గడిచినా కేసు నమోదు చేయని ఘటననే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే..

టైలర్స్‌ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్న హరికృష్ణ, అశ్వని దంపతులు గత నెల 13న ఇంట్లో లేని సమయంలో దుండగులు చొరబడి బీరువాలోని 12 తులాల బంగారు నగలు అపహరించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. అయినా నేటికీ కేసు నమోదు చేయడంలో పోలీసులు ఉదాసీనత కనబరుస్తున్నారు. నెల రోజులుగా ప్రతి రోజూ పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోక పోగా ఇటీవల బెదిరింపు ధోరణితో దుర్భాషలాడుతుండడంతో బాధితుల ఆవేదనకు అంతు లేకుండాపోయింది. ఇదే అంశంపై రెండు సార్లు ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ను కలిసి విన్నవిస్తే కేసు నమోదు చేయాలని ఆయన స్వయంగా పట్టణ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. అయినా కేసు నమోదులో పోలీసులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రిలో ఈ అంశమే హాట్‌ టాపిక్‌గా మారింది.

సర్వజనాస్పత్రిలో భద్రతా ప్రమాణాలు నిల్‌

తేల్చి చెప్పిన భద్రతా కమిటీ సభ్యులు

అనంతపురం మెడికల్‌: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం లేవని, అత్యంత కీలకమైన ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టమ్‌ వృథాగా ఉందని, సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో పాటు సెక్యూరిటీ అంతంత మాత్రంగానే ఉందని సెక్యూరిటీ వింగ్‌ ఆడిట్‌ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం సెక్యూరిటీ వింగ్‌ ఆడిట్‌ కమిటీ సభ్యులైన డీఎస్పీ సాయిరాం (విజయవాడ), ఏఆర్‌ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, డిప్యూటీ ఫైర్‌ ఆఫీసర్‌ లింగమయ్య, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్‌ శాఖాధికారులు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో భద్రతా ప్రమాణాలపై తనిఖీ చేశారు. రూ.2.2 కోట్లతో ఏర్పాటు చేసిన ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టమ్‌ నిరుపయోగంగా ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో అగ్రిప్రమాదం జరిగితే ప్రస్తుతం ఉన్న ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టమ్‌తో ఎలాంటి ఉపయోగమూ ఉండదనే నిర్ధారణకు వచ్చారు. అలాగే ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పూర్తిగా లేవని తెలుసుకున్నారు. వివిధ వార్డులకు సెక్యూరిటీ లేకపోవడాన్ని గమనించారు. పార్కింగ్‌కు స్థలం లేదని, బైక్‌లు, కార్లు, అంబులెన్స్‌ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని గుర్తించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి, వైద్య కళాశాల చుట్టూ ప్రహరీని పకడ్బందీగా ఉంచేలా చూడాలన్నారు. అనంతరం డీఎస్పీలు సాయిరాం, నీలకంఠేశ్వర రెడ్డి సూపరింటెండెంట్‌ను కలిశారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీసీ కెమెరాలు అదనంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాయిస్‌ సీసీ కెమెరాలను అందుబాటులో తేవాలన్నారు. అదేవిధంగా వైద్యులపై దాడులకు పాల్పడితే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసేలా చట్టాలున్నాయన్న బోర్డులను వివిధ వార్డుల్లో ఏర్పాటు చేయాలన్నారు.

ఏఎస్పీ ఆదేశాలు బేఖాతర్‌1
1/1

ఏఎస్పీ ఆదేశాలు బేఖాతర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement