అటవీ భూమిపై అక్రమార్కుల కన్ను | - | Sakshi
Sakshi News home page

అటవీ భూమిపై అక్రమార్కుల కన్ను

Jun 14 2025 7:23 AM | Updated on Jun 14 2025 7:23 AM

అటవీ

అటవీ భూమిపై అక్రమార్కుల కన్ను

ప్రభుత్వ అటవీ భూములపై కన్నేసిన స్వార్థపరులు ఎడారి నివారణలో భాగంగా 15 ఏళ్లుగా పెంచుతున్న పచ్చని చెట్లను కూకటి వేళ్లతో సహా పెకలించేస్తున్నారు. ఈ దౌర్జన్యంపై గత సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గ్రామస్తులు ఫిర్యాదు చేయడం గమనార్హం.

కణేకల్లు: బొమ్మనహాళ్‌, కణేకల్లు మండలాల్లో వేదవతి హగరి పరివాహక ప్రాంతంలోని అటవీ శాఖ పరిధిలో ఉన్న వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు విస్తరించి ఎడారిని తలపిస్తున్నాయి. ఆషాడంలో గాలులకు ఈ ఇసుక తెరలు తెరలుగా ఎగిసి మేటలు మరింత విస్తరిస్తూ వచ్చాయి. దీంతో 15 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఎడారి నివారణలో భాగంగా కళేకుర్తి, మాల్యం, తుంబిగనూరు, మీన్లహళ్లి, బిదరకుంతంతో పాటు వివిధ గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలై కనుచూపు మేర పచ్చదనం నిండుకుంది. ఈ చెట్లతో ఇసుక దిబ్బలు ముందుకు కదలడం లేదు.

టీడీపీ కార్యకర్తల బరితెగింపు

కళేకుర్తి గ్రామ శివారులో హెచ్చెల్సీ అక్విడెక్ట్‌ కుడివైపున వేదవతి హగిరి ఒడ్డు ఉన్న ఎడారి ప్రాంతంపై కళేకుర్తి గ్రామానికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తల కన్నుపడింది. ఈ భూమి పంటల సాగుకు చాలా అనువుగా ఉండటంతో ఎలాగైనా కబ్జా చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఐదారు రోజుల క్రితం సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలోని భారీ వృక్షాలను కూకటి వేళ్లతో సహా పెకలించి జేసీబీ సాయంతో వాటి ఆనవాళ్లు లేకుండా మాయం చేస్తూ భూమిని చదును చేసి సాగుభూమిగా మార్చుకున్నారు. ఈ దుశ్చర్యపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెరవెనుక అటవీ అధికారి?

అటవీ శాఖ పరిధిలోని భూముల్లో పచ్చని చెట్లను నరికివేత వెనుక స్థానిక ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ హస్తమున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజర్వ్‌ ఫారెస్ట్‌లో కొందరు చెట్లను రెండేళ్ల క్రితం నరికేసి సాగుభూమిగా మార్చుకుని పంటలు పండిస్తున్నారు. తాజాగా మరో 10 ఎకరాల్లోని రిజర్వ్‌ ఫారెస్ట్‌ కబ్జాకు గురైంది. ఈ అక్రమాల వెనుక సదరు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌కు పెద్ద మొత్తంలో లెక్క ముట్టినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.

సాగు ముసుగులో వ్యాపారం

వేదవతి హగిరి ఒడ్డున ఉన్న ఇసుక భూములు ప్రస్తుతం సారవంతమైన భూములుగా మారాయి. ఒకప్పుడు దేనికి పనికిరాని ఈ భూముల్లో వేరుశనగ, వరి పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి సాధ్యమని ఇటీవల రైతులు నిరూపించారు. దీంతో ఈ భూమికి భారీగా డిమాండ్‌ నెలకొంది. ఎకరా భూమి రూ.12లక్షల వరకు ధర పలుకుతున్నట్లు సమాచారం. ఈ వేదవతి హగిరి ఒడ్డున ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను ఇప్పటికే చాలా మంది కబ్జా చేసి సాగు భూమిగా మార్చేసుకున్నారు. పంటల సాగు ముసుగులో అనధికారిక అగ్రిమెంట్లతో భూమి విక్రయాలూ ఊపందుకున్నాయి.

పట్టించుకోకపోతే అడవులు మాయం

ఎడారి నివారణలో భాగంగా ఓ వైపు అధికారులు విస్తారంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తుంటే.. మరో వైపు కొందరు తమ స్వార్థం కోసం భారీ చెట్లను నరికేస్తున్నారు. పట్టపగలే రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలో చెట్ల నరికేస్తున్నా అటవీ, రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో అడవి మాయమై కళేకుర్తి ప్రాంతం ఎడారిగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు

రిజర్వ్‌ ఫారెస్ట్‌లో భారీ వృక్షాల నరికివేత అంశం, పరోక్షంగా సహకరిస్తున్న ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ తీరుపై గత సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారుల ద్వారా కలెక్టర్‌ దృష్టికి కళేకుర్తి వాసులు తీసుకెళ్లారు. తక్షణమే ఈ అంశంపై స్పందించి అటవీ ప్రాంత పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎంతటి వారినైనా ఉపేక్షించబోం

కళేకుర్తి గ్రామంలో కొందరు స్వార్థపరులు పోటీ పడి రాత్రికిరాత్రే చెట్లు నరికేస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టి చెట్లను నరికేస్తున్న వారిని గుర్తించాం. ఫారెస్ట్‌ యాక్ట్‌ 1967 ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బీట్‌ ఆఫీసర్‌పై వచ్చిన ఆరోపణలు పూర్తి అవాస్తవం. పచ్చని చెట్లను పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది. చెట్లను నరికేసి ఎడారిగా మార్చొద్దని ప్రజలకు మనవి చేస్తున్నాం.

– దామోదరరెడ్డి, డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌, రాయదుర్గం

ఎడారి నివారణలో భాగంగా

15 ఏళ్లుగా పెంచుతున్న చెట్లు

టీడీపీ కార్యకర్త దుశ్చర్యకు మాయమైన 10 ఎకరాల్లోని పచ్చని చెట్లు

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

అటవీ భూమిపై అక్రమార్కుల కన్ను 1
1/1

అటవీ భూమిపై అక్రమార్కుల కన్ను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement