ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..! | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..!

Jun 29 2025 2:39 AM | Updated on Jun 29 2025 2:39 AM

ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..!

ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..!

● వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన షురూ ● అభ్యంతరాల కోసం జూలై 17 వరకు గడువు పొడిగింపు ● వాటిపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సమక్షంలోనే పరిశీలన ● ఈ నెల 30 నుంచి జూలై 17 వరకు సమీక్షలు ● కూటమి నేతలకు లబ్ధి చేకూరేలా ప్లాన్‌లో మార్పులకు కసరత్తు

విశాఖ సిటీ : అంతా అనుకున్నట్లే చేస్తున్నారు. విశాఖ బృహత్తర ప్రణాళిక–2041లో మార్పులు, చేర్పులకు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ఈ తంతు పూర్తి చేసేందుకు ముహూర్తం పెట్టేశారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల పరిశీలన పేరుతో తమ వారికి లబ్ధి చేకూర్చేందుకు పూనుకుంటున్నారు. ఇందుకోసం ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు నియోజకవర్గాల వారీ ఆయా ఎమ్మెల్యేల సమక్షంలోనే అభ్యంతరాలపై సమీక్షించాలని నిర్ణయించారు. ఒకవైపు ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు తేదీలు ఖరారు చేసినప్పటికీ.. అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించడం విశేషం. ఇందులో కూటమి ‘రియల్‌ వ్యాపారానికి’ అనుగుణంగా ప్లాన్‌లో సవరణలు చేసే అవకాశం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తోంది.

అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగింపు

వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌–2041లో పునఃపరిశీలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మే 22వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో కేవలం 755 మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. వాస్తవానికి వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తాయని కూటమి ప్రజాప్రతినిధులు భావించారు. ఆ సంఖ్యను అడ్డుపెట్టుకుని ఇప్పటికే సిద్ధమైన మాస్టర్‌ప్లాన్‌–2041పై ఆరోపణలు గుప్పించాలని నిర్ణయించారు. కానీ నామమాత్రంగానే అభ్యంతరాలు రావడంతో కూటమి నేతలు కంగుతిన్నారు. దీంతో ఈ అభ్యంతరాల స్వీకరణ గడువు మరోసారి పొడిగించారు. జూలై 17వ తేదీ వరకు ఫిర్యాదులు చేయవచ్చని తాజాగా ప్రకటించారు. వీఎంఆర్‌డీఏ కార్యాలయానికి, ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు ఎక్కువగా రాకపోవడంతో ఆయా జిల్లాల రెవెన్యూ కార్యాలయాల్లో కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట తదితర ప్రాంతాల వారి సౌలభ్యం కోసమంటూ అనకాపల్లి ఆర్డీవో కార్యాలయంలో అభ్యంతరాలను ఈ నెల 30, జూలై 1వ తేదీల్లో స్వీకరించనున్నారు. అలాగే ఎస్‌.కోట, చీపురుపల్లి, విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల ప్రాంతాల వారు విజయనగరం కలెక్టర్‌ కార్యాలయంలో జూలై 14, 15 తేదీల్లో ఫిర్యాదులను అందించే అవకాశం కల్పించారు.

పరిశీలనలో సిఫార్సులకే పెద్ద పీట?

మాస్టర్‌ప్లాన్‌ కోసం వచ్చిన అభ్యంతరాల పరిశీలనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేల సమక్షంలోనే వీటి పరిశీలనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా అభ్యంతరాలను పరిశీలించనున్నారు. నిర్ణీత తేదీ, సమయాల్లో ఎమ్మెల్యేలతో పాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ.. ఆ పరిస్థితి ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూలై 16, 17 తేదీల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీఎంఆర్‌డీఏ కార్యాలయం 3వ అంతస్తులో మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌ అభ్యంతరాలను స్వీకరించనున్నారు. కేవలం కూటమి ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల రియల్‌ వ్యాపారానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంతో మాస్టర్‌ప్లాన్‌లో సవరణకు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అభ్యంతరాల పరిశీలన ఇలా..

తేదీ నియోజకవర్గాలు సమయం వేదిక

జూన్‌ 30, జూలై 1 అనకాపల్లి, పాయకరావుపేట, యలమంచిలి 11 నుంచి 5 వరకు అనకాపల్లి ఆర్డీఓ ఆఫీస్‌

జూలై 3, 4 పెందుర్తి గాజువాక 11 నుంచి 5 వరకు వీఎంఆర్‌డీఏ ఆఫీస్‌

జూలై 7, 8 విశాఖ ఉత్తర, పశ్చిమ, దక్షిణ 11 నుంచి 5 వరకు వీఎంఆర్‌డీఏ ఆఫీస్‌

జూలై 10,11 విశాఖ తూర్పు, భీమిలి 11 నుంచి 5 వరకు వీఎంఆర్‌డీఏ ఆఫీస్‌

జూలై 14, 15 ఎస్‌.కోట, విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి 11 నుంచి 5 వరకు విజయనగరం కలెక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement