
జగన్నాథుని ఉచిత దర్శనం గంటసేపే
అనకాపల్లి టౌన్: పట్టణంలోని గూడ్స్రోడ్లోని ఇంద్రద్యుమ్న హాల్లో కొలువుదీరిన జగన్నాథ స్వామి దర్శనాన్ని భక్తులకు కల్పించే విషయంలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తుండగా ఇందులో కేవలం గంటసేపు ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల వరకూ మాత్రమే ఉచిత దర్శనం కల్పించి, మిగతా రోజంతా రుసుం వసూలు చేస్తుండడంతో అధికారులపై భక్తులు మండిపడుతున్నారు. రూ.20, రూ.30 టిక్కెట్పై దర్శకల్పిస్తుండడంతో పేద భక్తులు ఇబ్బందులకు గురతున్నారు. ఏటా తొమ్మిది రోజుల పాటు జగన్నాథ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. గవరపాలెం అగ్గిమర్రి చెట్టు వద్ద ఉన్న జగన్నాథ స్వామి దేవస్థానంలో వేంచేసిన జగన్నాథస్వామి, బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి ఏటా ఉత్సవాల సందర్భంగా గూడ్స్ రోడ్ వద్ద ఇంద్రద్యుమ్న హాల్లో దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయం ప్రాంగణంలో పలు చిరువ్యాపారులు వివిధ ఆట బొమ్మల షాపులను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. జగన్నాథుని దర్శించుకోవడానికి పట్టణం నుంచే కాకుండా వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కుటుంబ సమేతంగా భక్తులు వస్తుంటారు. దీంతో ఆలయానికి భారీగానే ఆదాయం సమకూరుతుంది. పెద్ద ఆలయాల్లో సైతం వీఐపీ దర్శనం, ప్రత్యేక దర్శనాలతో పాటూ రోజంతా ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తారు. కానీ అందుకు భిన్నంగా పెద్దగా భక్తులు రాని సమయంలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఉచిత దర్శనం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

జగన్నాథుని ఉచిత దర్శనం గంటసేపే