
16న అంగన్వాడీ కార్యకర్తల ధర్నా
అనకాపల్లి టౌన్: అంగన్వాడీ వర్కర్ల పిల్లలకు తల్లికి వందనంతో పాటు పలు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఈ నెల 16న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగశేషు, జిల్లా అధ్యక్షురాలు ఎం.దుర్గారాణి కోరారు. స్థానికంగా ప్రైవేట్ హాల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో అంగన్వాడీలందరూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలు పెంచాలన్నారు. స్కీం వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు కోత పెట్టడం దారుణమన్నారు. నెలకు రూ.12 వేలు ఆదానం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న ప్రభుత్వం.. రూ.11.500 తీసుకుంటున్న అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ధర్నాకు పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.