
భర్త కిరాతకం
దేవరాపల్లి: భార్యపై భర్త అతి కిరాతకంగా హత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. స్థానిక రామాలయం వీధిలో శుక్రవారం వేకువజామున జరిగిన ఈ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎస్ఐ టి.మల్లేశ్వరరావు కథనం ప్రకారం.. దేవరాపల్లికి చెందిన కోన రాము తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతనికి 16 ఏళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన దేవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు కుటుంబ పెద్దలు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. వీరిద్దరి మధ్య గురువారం రాత్రి మళ్లీ ఘర్షణ జరిగింది. భార్య గదిలో నిద్రపోగా భర్త ఇంటి వరండాలో పడుకున్నాడు. భార్యపై కక్ష పెంచుకున్న రాము శుక్రవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్య దేవిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఉలిక్కిపడి మేల్కొన్న దేవి తన భర్త దాడి నుంచి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ఎడమ చేతి వేళ్లు కొన్ని తెగి పడిపోగా మెడ, కాళ్లు, పొట్ట తదితర శరీర భాగాలపై కత్తి గాట్లు ఉన్నాయి. భర్త కత్తితో దాడి చేసిన విషయాన్ని సోదరుడు కృష్ణకు ఫోన్ ద్వారా దేవి చెప్పడంతో వెంటనే వారి నివాసానికి వెళ్లాడు. రక్తపు మడుగులో ఉన్న అక్క దేవిని 108 వాహనంలో కె.కోటపాడు కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం, కేజీహెచ్కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం దేవి కేజీహెచ్లో చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కోన దేవి నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మల్లేశ్వరరావు తెలిపారు. భర్త రాము పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు.
భార్యపై కత్తితో హత్యాయత్నం
తెగిపడిన చేతి వేళ్లు.. శరీరంపై
తీవ్ర గాయాలు
ప్రాణాపాయ స్థితిలో కేజీహెచ్లో
చికిత్స పొందుతున్న మహిళ
పరారీలో భర్త రాము.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు