
కె.జె.పురం జంక్షన్లో ఆక్రమణల తొలగింపు
మాడుగుల రూరల్ : మండలంలో కె.జె.పురం జంక్షన్లో ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధం చేశారు. రహదారి కిరువైపులా గల ఆక్రమణలు తొలగించి, డ్రైనేజిలను నిర్మించాలని కోరుతూ విశ్రాంత ఉపాధ్యాయుడు, స్థానిక కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రాపేట రామకొండలరావు, స్థానికులు తాకాశి శ్రీను తదితరులు ఈ ఏడాది మార్చి 10 న అనకాపల్లి జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మార్చి 19న ఆర్అండ్బీ, స్థానిక పంచాయతీ అధికారులు సర్వే చేసి ఆక్రమణల తొలగింపునకు మార్కింగ్ చేశారు. తర్వాత పొక్లెయిన్తో ఆక్రమణల తొలగించే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ బుధవారం మాడుగుల ఆర్అండ్బీ జేఈ సాయి శ్రీనివాస్, వారి సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శి నవీన్దొర, సిబ్బంది, ఎస్ఐ నారాయణరావు, హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య, తదితర పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో రోడ్డు మధ్య భాగం నుంచి 11 మీటర్లు అటు, ఇటు వైపునా ఆక్రమణలు తొలగించారు. జంక్షన్లో నిర్మించిన 33 మీటర్ల వరకు ఉన్న ఈ ఆక్రమణలను తొలగించారు. దీనిలో భాగంగా సంతోషిమాత ఆలయం అన్నదాన సత్రం ముందు భాగంలో గల అరుగును, బాత్రూమ్, వంటశాల, సంతోషిమాత ముందు భాగంలో తొలగించారు. ఈ ఆక్రమణలు తొలగింపు విషయంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ జి. నారాయణరావు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. వీఆర్వో నాగప్పారావు, సర్వేయరు రాజేష్ పాల్గొన్నారు.
అన్నదాన సత్రం కూల్చివేతకు కుట్ర : ఆలయ కమిటీ చైర్మన్ ధ్వజం
అన్నదాన సత్రం కూల్చివేయడానికి కొంత మంది వ్యక్తులు కుట్ర చేసి సత్రం ముందు భాగం కూల్చివేశారని, ఇది అన్యాయమని సంతోషిమాత ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ల అమ్మతల్లినాయుడు ఆరోపించారు. ఎంతో మందికి మధ్యాహ్నం సమయంలో అన్నదానం చేస్తున్న సత్రంను ఎంతో మంది దాతల సహకారంతో నిర్మించామని తెలిపారు. ఆలయం ముందు భాగంలో విగ్రహాలను కూడా తొలగించారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని అమ్మతల్లినాయుడు పేర్కొన్నారు.

కె.జె.పురం జంక్షన్లో ఆక్రమణల తొలగింపు