మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు ఇచ్చే పరిహారాన్ని నేరుగా అకౌంట్లో జమ చేయాలని కోరుతూ మునగపాక రెవెన్యూ కార్యాలయం వద్ద మంగళవారం ఽఆందోళన నిర్వహించారు. విస్తరణ బాధితులతో కలిసి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ పూడిమడక రోడ్డు విస్తరణ ఎంతో అవసరమన్నారు. అయితే భూములు, గృహాలు కోల్పోతున్న బాధితులకు మెరుగైన పరిహారం ఇస్తామని పాలకులు, అధికారులు చెప్పిన విషయాన్ని విస్మరించరాదన్నారు. గ్రామసభలు నిర్వహించిన అధికారులు ప్రతి బాధితుని బ్యాంక్ అకౌంట్లో పరిహారం వేస్తామని చెప్పారన్నారు. ఇప్పుడు టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. బాండ్లను మార్చుకోవడం బాధితులకు తెలియదన్నారు. రహదారి విస్తరణను వైఎస్సార్సీపీ స్వాగతిస్తుందని అయితే పరిహారం అందించే విషయంలో టీడీఆర్ బాండ్లు కాకుండా నేరుగా అకౌంట్లో నగదు జమ జరిగేలా చూడాల్సి ఉందన్నారు. శంకుస్థాపనకు ముందుగానే ప్రభుత్వం పరిహారం ఎలా ఇస్తుందో తెలియజేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాక అఖిలపక్ష సమావేశం నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం డీటీ శేషుబాబుకు వినతి పత్రం అందజేశారు. మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, సర్పంచ్లు బొడ్డేడ శ్రీనివాసరావు, సుందరపు తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
పూడిమడక రోడ్డు విస్తరణ బాధితుల అకౌంట్లో నగదు జమ చేయాలి
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన