
మృత్యు మలుపు
● ప్రమాదకరంగా కప్పకొండ మలుపు
● పెరుగుతున్న యాక్సిడెంట్లు
● ఆందోళనలో స్థానికులు
వై.రామవరం: మండలంలోని ప్రధాన మార్గంలో పలుచోట్ల ఉన్న మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పనసలపాలెం, చవిటిదిబ్బల గ్రామాల మధ్య ఉన్న కప్పకొండ టర్నింగువద్ద వాహనాలపై ప్రయాణించేదుకు మండలవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మలుపు వద్ద ఎన్నో వాహనాలు ఢీకొని దశాబ్ధాలుగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడి మృత్యువాతకు గురువుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో సరైన విధంగా డిజైన్ చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్టు పలువురు చెబుతున్నారు. ఈ మలుపును ఆనుకొని ఉన్న ఎత్తుగా ఉన్న గుట్టను తొలగించి, నేరుగా రోడ్డు నిర్మించి ఉంటే ప్రమాదాలకు తావు ఉండేది కాదన్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యమేనని విమర్శిస్తున్నారు.
అతివేగమే కారణం
అంతేకాకుండా ఈ మలుపు వద్ద జరిగిన ఎన్నో ప్రమాదాల మృత్యువాతలు వెలుగులోకి రాలేదు. ఇంత జరుగుతున్న ఇంజనీరింగు అధికారులు ఈ మలుపును సరిచేయడంలో విఫలమైనట్టు మండల వాసులు విమర్శిస్తున్నారు. ఓ వైపు పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రతీ గ్రామంలోను అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ యువత అతివేగంగా ఈ మలుపు వద్ద వాహనాలు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రధాన రహదారిలోని ప్రతీ ప్రమాదకరమైన టర్నింగులోను హెచ్చరిక బోర్డులు, డ్రమ్ములు ఏర్పాటుచేసినప్పటికీ వాహనచోదకుల నిర్లక్ష్యం, వేగం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఆర్అండ్బీ ఇంజినీరింగు అధికారులు స్పందించి, ఈ మలుపు వద్దు ఉన్న చిన్నకొండను తొలగించి ప్రమాదాల జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రమాదాలను అరికట్టాలి
ఈ మార్గంలో మలుపు లేకుండా రోడ్డు నిర్మించడంలో అప్పటి ఇంజనీరింగు అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందంచి ఈ మార్గంలో ఉన్న చిన్నకొండను (గుట్ట ను) తొలగించి రోడ్డు నిర్మించి ప్రమాదాలను అరికట్టాలి. – కడబాల ఆనందరావు, ఎంపీపీ
అధికారులు స్పందించాలి
ఈ ప్రమాదకర మలుపు వద్ద దశాబ్దాలుగా జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది మృతి చెందుతున్నారు. దీన్ని అరికట్టడానికి తక్షణమే ఇంజనీరింగు అధికారులు చర్యలు తీసుకోవాలి.ఈ మేరకు ఈ ప్రాంతంలో మార్పులు చేసి రహదారి నిర్మించాలి.
– వీరమళ్ళ సుబ్బలక్ష్మి,
ఎంపీటీసీ సభ్యురాలు, వై.రామవరం
ప్రమాదాలవీ...
● ఈ మలుపు వద్ద సుమారు 30 ఏళ్ల క్రితం విధి నిర్వహణలో వై.రామవరం నుంచి అడ్డతీగల వెళ్తున్న సత్యనారాయణ అనే పోలీసు కానిస్టేబుల్ బైక్ ప్రమాదంలో మృతి చెందారు.
● 20 ఏళ్ల క్రితం మండలంలోని చవిటిదిబ్బలు గ్రామానికి చెందిన గొర్లె కృపానంద మృతి చెందారు.
● పదేళ్ల క్రితం పులుసుమామిడి గ్రామానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి ఈ మలుపు వద్ద బైక్ అదుపు తప్పిన ప్రమాదంలో మృతి చెందారు.
● ఈ ఏడాది జూన్21న స్థానిక వీఆర్ఓ కాంతమ్మ భర్త చోడే సీతారామయ్య మృతి చెందారు.
● జూన్ 28న కిచ్చల రామకృష్ణారెడ్డి, పల్లాల శ్రీనివాసురెడ్డిలు మృతి చెందారు.
– జూన్ 25న పల్లాల నాగిరెడ్డి అనే వ్యక్తి ఈ మలుపు వద్ద బైక్తో ఆర్టీసీ బస్సు కింద పడి, చికిత్స పొందుతూ మృతి చెందారు.
చర్యలు తీసుకుంటాం
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతీ గ్రామంలోను అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రతి మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు, వేగాన్ని అదుపుచేయడానికి స్పీడ్ స్టాపర్లు ఏర్పాటు చేశాం. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.
– బి రామకృష్ణ, ఎస్ఐ, వై.రామవరం

మృత్యు మలుపు

మృత్యు మలుపు

మృత్యు మలుపు

మృత్యు మలుపు