
కమలతోటలో జ్వరాల విజృంభణ
సాక్షి,పాడేరు: అరకులోయ మండలం మారుమూల మాదల పంచాయతీ, కమలతోట గ్రామంలో జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఇంటిలోను చిన్నారులతో పాటు గిరిజనులు జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన చిట్టన్న, కన్నయ్య, పొట్టమ్మ, బొంజమ్మ, లచ్చమ్మ, బాలన్న, మత్తులమ్మ, అఖిల, గాయత్రి, గౌతమి, మత్స్యరాజు, శ్రీదేవి, చిన్న, బోడమ్మ, టింగన, మహేష్, సీతమ్మ, వెన్నెల, లక్ష్మి, సింహాద్రమ్మ, అనిత, లచ్చన్న, సింహాద్రి, లక్ష్మి, జ్యోతి, నందిని, రాములమ్మ, చిన్న తదితరులు జ్వరాలు, అనారోగ్య సమస్యలతో ఇళ్లకు పరిమితం అయ్యారు. ఒడిశా సరిహద్దు మారుమూల గ్రామం కావడం వల్ల సకాలంలో వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది.
కలుషిత గెడ్డ నీరే ఆధారం
కమలతోటలో గిరిజనులకు సమీపంలోని పెద్ద గెడ్డ నీరే ఆధారమవుతోంది.ఈ నీరు కలుషితంగా ఉంటునప్పటికీ గిరిజనులంతా ఈనీటినే తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తూ తరచూ రోగాల బారిన పడుతున్నారు.సురక్షిత తాగునీరు గిరిజనులకు కరువైంది.
ౖవెద్యశిబిరం నిర్వహించాలి: సీపీఎం నేత రామన్న
మారుమూల కమలతోట గ్రామంలో చిన్నారులు, గిరిజనులు నెలరోజుల నుంచి జ్వరాలతో బాధపడుతున్నా వైద్యసేవలు కల్పించకపోవడం దారుణమని అరకులోయ సీపీఎం మండల నాయకుడు పి.రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. జ్వరాల సమాచారం తెలుసుకున్న ఆయన ఆదివారం కమలతోట గ్రామాన్ని సందర్శించారు. తీవ్ర జ్వరాలతో బాధపడుతున్న గిరిజనులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు వైద్యసేవలు కల్పనలో వైద్యసిబ్బంది, సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యం తగదన్నారు. గిరిజనులకు సురక్షిత తాగునీరు లేకపోవడంతో పెద్దగెడ్డలోని బురదనీటిని సేవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే ఈ మారుమూల గ్రామాన్ని అధికారులు సందర్శించి, ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
నెలరోజులుగా బాధపడుతున్నా
అందని వైద్యసేవలు

కమలతోటలో జ్వరాల విజృంభణ