
రోడ్డు నిర్మించకపోతే గోడ కట్టేస్తాం
అడ్డతీగల: గోతులమయంగా మారిన అడ్డతీగల–ఏలేశ్వరం రోడ్డును జూన్ 1వ తేదీ నాటికి నిర్మించకపోతే అడ్డంగా గోడ కట్టేస్తామని సీపీఐ ఎంఎల్ వినోద్మిశ్రా బృందం సభ్యులు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు అన్నారు. పాలకులు,అధికారుల వైఖరిని నిరసస్తూ పలు ప్రజాసంఘాల నేతలు, ప్రజలతో కలిసి బుధవారం గొంటువానిపాలెం వద్ద రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. గణేశ్వరరావు మాట్లాడుతూ ఆరు నెలల కిందట రోడ్డు దుస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్,విద్యాశాఖ మంత్రి లోకేష్లకు లిఖితపూర్వకంగా తెలియజేశామన్నారు.కానీ నెలలు గడు స్తున్నా రోడ్డు నిర్మించలేదన్నారు.చిన్న చిన్న పనులు చేస్తూ ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు.ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుంచి అడ్డతీగల మండలం గొంటువానిపాలెం వరకూ 15 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా తయారైందన్నారు.యుద్ధప్రాతిపదికన రోడ్డు నిర్మించకపోతే జూన్ 1వ తేదీన రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి తీరుతామన్నారు.
అడ్డతీగల–ఏలేశ్వరం రహదారిపై నిరసన