breaking news
Widower
-
71వ ఏట రెండో పెళ్లి.. కూతురు కామెంట్స్ వైరల్
ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో.. తోడుగా మరో మనిషి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ముఖ్యంగా జీవిత చరమాంకంలో మనిషికి తోడు ఎంతో అవసరం. బాధ్యతలు తీరి.. సంతానం వారి జీవితాల్లో బిజీగా ఉన్న వేళ భార్యభర్తలిద్దరు ఒకరికి ఒకరు తోడునీడగా నిలుస్తారు. మలి సంధ్యవేళ దంపతుల్లో ఎవరు ముందుగా ఈ లోకం వీడినా మిగతా వారి జీవితం శూన్యం అయిపోతుంది. ఆ వెలితిని ఎవరూ పూడ్చలేరు.. ఒక్క జీవిత భాగస్వామి తప్ప. ఒకప్పుడు అంటే మధ్యవయసులో పునర్వివాహం గురించి ఆలోచించాలంటే సమాజానికి జడిసి ఊరుకునేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. వయసుతో సంబంధం లేకుండా రెండో వివాహానికి సిద్ధపడుతున్నారు. సమాజం సంగతి ఎలా ఉన్న కుటుంబ సభ్యులు మాత్రం వీరికి మద్దతిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. భార్య చనిపోయిన 71 ఏళ్ల వృద్ధుడు.. ఓ వితంతు మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని సదరు వృద్దుడి కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది. నెటిజనులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సదరు వృద్ధుడి భార్య ఐదు సంవత్సరాల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి అతడు ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఈ క్రమంలో వృద్ధుడి కుమార్తె అదితి తన తండ్రిని మళ్లీ పెళ్లి చేసుకోమని చాలా సార్లు కోరింది. మొదట్లో దాటవేస్తూ వచ్చిన సదరు వృద్ధుడు చివరకు ఐదు సంవత్సరాల తర్వాత రెండో వివాహానికి అంగీకరించాడు. మరో వితంతు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 27న వీరి వివాహం జరిగింది. ఈ సందర్భంగా అదితి తన తండ్రి రెండో వివాహానికి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. ‘‘ఇది చాలా క్లిష్టమైన అంశం. పునర్విహానికి సంబంధించి మన దేశంలో నిర్దుష్ట చట్టాలు ఏం లేవు. కొందరు మహిళలు మా నాన్న వెంట పడి డబ్బు కోసం దెయ్యాలాగా పీడించడం చూశాను. చివరకు ఆయన పునర్వివాహం చేసుకున్నారు. సమాజం వారిని ఆశీర్వదించి.. అక్కున చేర్చుకుంటుందా.. లేదా అనేది తెలియదు. కానీ నా తండ్రి ఒంటరిగా ఉండటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు’’ అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజనలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చివరి దశలో ఉన్నప్పుడు తోడు చాలా అవసరం. మీరు చాలా మంచి పని చేశారు. కంగ్రాట్స్’’.. ‘‘ఇంత మంచి న్యూస్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు’’.. ‘‘కొత్త ఇంటికి మీ అమ్మను ఆహ్వానించండి. వారిద్దరు ఒకరికొకరు కొత్త జీవితాన్ని ఇచ్చుకున్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రకారం వివాహం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు.. అంతకు మించి ఎంతో విలువైనది. వీరిద్దరు ఒకరినొకరు చూసుకుంటారు.. తోడు, నీడగా నిలుస్తారు’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: తండ్రి రెండో పెళ్లిని కూతురు ప్రశ్నించొచ్చు: హై కోర్టు -
వంటగ్యాస్ కోసం మళ్లీ పెళ్లా?
45 ఏళ్ల పుత్తిలాల్ గౌతం నిరుపేద దళితుడు. భార్య చనిపోయింది. నలుగురు పిల్లలు ఉన్నారు. రెక్కల కష్టం మీద బతికే దినసరి కూలీ అయిన పుత్తిలాల్ కు ఇప్పుడో వింత కష్టం వచ్చి పడింది. ఇన్నాళ్లు పుత్తిలాల్ ఇంట్లో ఉన్నది కట్టెలపొయ్యి మాత్రమే. ఇప్పుడు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ పొందాలంటే ఆయన మరో పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ కోసం మాకు సవతి తల్లిని తీసుకొస్తావా? అంటూ పిల్లలు తండ్రి రెండోపెళ్లికి నిరాకరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తోచక పుత్తిలాల్ డైలామాలో పడిపోయారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందాలంటే ప్రభుత్వ నిబంధనలప్రకారం పుత్తిలాల్ కు భార్య ఉండాలి. అతని కూతుళ్లు చిన్నవారు కావడంతో వారు గ్యాస్ కనెక్షన్ కు దరఖాస్తు చేసుకునే వయస్సు రాలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలోని జుధువురా గ్రామానికి చెందిన పుత్తిలాల్ ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం స్థానిక ఎల్పీజీ డీలర్ చుట్టు కాళ్లు అరిగేలా తిరుగుతున్నాడు. అయినా స్థానిక డీలర్ నిబంధనలు అనుమతించవంటూ అతన్ని తిప్పి పంపుతున్నాడు. 'సరైన ధ్రువపత్రాలను మీ భార్యకు ఇచ్చి పంపండి. అప్పుడు గ్యాస్ కనెక్షన్ ఇస్తామని వారు చెప్తున్నారు. నా భార్య చనిపోయింది. నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారి బాగోగులు నేను చూసుకోవాలి అని చెప్పినా వారు వినిపించుకోవడం లేదు. నిబంధనలు ఒప్పుకోవాలని తేల్చిచెప్తున్నారు' అని పుత్తిలాల్ 'హిందూస్థాన్ టైమ్స్' పత్రికకు తెలిపారు.