breaking news
vepaku
-
వేపాకు మందు
బౌద్ధ వాణి వారణాసి రాజు బ్రహ్మదత్తునికి లేకలేక కొడుకు పుట్టాడు. దాంతో అతణ్ణి అతి గారాబంగా పెంచారు. అలా అబ్బరంగా పెంచడంతో అన్నీ అవలక్షణాలే అలవర్చుకున్నాడు. ప్రతివారినీ కొట్టేవాడు. ప్రతిదానికీ తిట్టేవాడు. దాంతో అందరూ అతణ్ణి ‘‘దుష్టకుమారుడు’’ అని పిలిచేవారు. తన కొడుకు ఇలా అవలక్షణాలతో పెరిగి పెద్దవాడైతే, తన రాజ్యాన్ని సరిగా పాలించలేడనీ, తను వంశగౌరవం మంట కలుపుతాడనీ బ్రహ్మదత్తుడు భయపడ్డాడు. ఎందరో గురువుల దగ్గరకు పంపాడు. అతగాణ్ణి సరైన దారిలో పెట్టడం ఏ ఒక్కడి వల్లా కాలేదు. చివరికి గురుకులాలే దెబ్బతిన్నాయి. ఇక, తన కుమారుణ్ణి చక్కదిద్దే శక్తి ఒక్క బుద్ధునికే ఉందని నమ్మాడు - బ్రహ్మదత్తుడు. మహాశక్తి (మహాగురువు)గా పేరు పొందిన బుద్ధుడే తన బిడ్డకు తగిన గురువు అని భావించి, ఒక రోజున తన బిడ్డను తీసుకొని వెళ్లి, నమ స్కరించి విషయం చెప్పాడు. ‘‘సరే! నా దగ్గర ఉంచి వెళ్లు’’ అని చెప్పాడు. రాకుమారుణ్ణి తనతో వాహ్యాళికి తీసుకుపోయాడు బుద్ధుడు. దారిలో ఒక చిన్న వేప మొక్క కనిపించింది. ‘‘నాయనా! ఎంతో అందంగా ఉన్నాయి. ఆ లేత ఆకుల్ని తీసుకుని తిను’’ అన్నాడు. దుష్టకుమారుడు రెండు ఆకులు కోసుకుని, నమిలి, ఖాండ్రించి ఉమ్మాడు. వెంటనే కోపంతో ఆ చుట్టుపక్కల కనిపించిన వేప మొక్కల్ని పీకేయడం మొదలుపెట్టాడు. ‘‘నాయనా! ఆగు! ఎందుకు పీకుతున్నావు?’’ అని అడిగాడు బుద్ధుడు. ‘‘ఛీఛీ! ఇవి కటిక చేదు. ఇవి పనికిరావు. వీటిని పీకి, మంచి మొక్కలు నాటిస్తాను’’ అన్నాడు. ‘‘మరి, నీకు నచ్చకపోతే వీటిని పీకేస్తున్నావు. అలాగే నీ ప్రవర్తన కూడా అంతకంటే చేదుగా ఉంటుంది కదా! అప్పుడు నీ తోటివారు నిన్ను ఎలా చూడాలి? ఏం చెయ్యాలి? తమ రాజు చెడ్డవాడని భావించిన ప్రజలు, రేపు నిన్ను సింహాసనం నుండి పీకేసి, మరో మంచి రాజును తెచ్చుకుంటారు గదా!’’ అన్నాడు. ఆ మాటలతో అతనికి జ్ఞానోదయం కలిగింది. ఇక ఆ రోజు నుండి మంచి నడవడిక నేర్చుకున్నాడు. తండ్రికి తగిన రాజుగా పేరు పొందాడు. - బొర్రా గోవర్ధన్ -
ఓటర్లతో ఒట్టు పోలింగ్ కేంద్రాల చుట్టూ ఆవాలు
♦ ‘ఖేడ్’లో విచిత్ర పోకడ ♦ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న మంత్రగాళ్లు ♦ మూఢనమ్మకాల ఉచ్చులో జనం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ కల్హేర్: ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆఖరి అస్త్రంగా మద్యం, డబ్బుతో ఆకట్టుకుంటారని అందరూ అనుకంటే.. విచిత్రంగా ఆవాలు, వేపాకు, మంత్రాలపై ఆశలు పెట్టుకోవడం గమనార్హం. నిజానికి ఖేడ్లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల నుంచి ఒట్టు పెట్టించి ఓట్లు రాబట్టారు. నియోజకవర్గంలో 168 గ్రామాలు ఉండగా దాదాపు 70 శాతం గ్రామాలు నిరక్షరాస్యత అధికంగా ఉన్న గ్రామాలే. మూఢ నమ్మకాలు ఎక్కువే. గ్రామీణ జనం గ్రామ దేవతను, క్షుద్ర శక్తులను బలంగా నమ్ముతారు. ఈ బలహీనతలను ఆసరా చేసుకున్న రాజకీయ నాయకులు.. కులాలు, తెగల వారీగా ఓటర్లను సమీకరించి చేతితో వేపాకు, పసుపు పట్టించి వారి వారి కుల దేవతల మీద ప్రమాణం చేయిస్తున్నారు. హన్మండ్ల కట్ట మీద ఒట్లు పెట్టిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచే ఈ తంతు ప్రారంభమైంది. కంగ్టి, మనూరు, కల్హేర్,నారాయణఖేడ్ మండలాల్లో ఈ రకమైన క్షుద్ర ఒత్తిడి ఎక్కువగా ఉంది. తాజాగా శనివారం నాటి పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రంలో అడుగు పెట్టిన వెంటనే ఓటర్లను కట్టడి చేసేందుకు ఓ పార్టీ నాయకులు మంత్రశక్తులు ప్రయోగించారని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కల్హేర్ మండలంలోని రాపర్తి, మీర్ఖాన్పేట, అలీఖాన్పల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల చుట్టూ దుండగులు ఆవాలు చల్లారు. ఓటరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఏ పార్టీకి ఓటు వేద్దామనుకున్నా వారికి కావాల్సిన గుర్తు మీదే ఓటు వేస్తారనేది వారి నమ్మకం. ఓటును తమకు అనుగుణంగా వేయకుంటే క్షుద్రశక్తులు దాడి చేస్తాయనే ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఓడిపోతామనే నిర్ణయానికి వచ్చిన ఓ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపు కోసం మంత్రాలు చేసిన ఆవాలు బూత్ల వద్ద పారబోశారనే విషయం ఆయా గ్రామాల్లో చర్చనీయంశమైంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఓటర్లు తమకు అనుకులంగా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ప్రచారానికి ఆయా గ్రామాల్లోని ప్రజలు భయపడి పోతున్నారు. పోలింగ్ నాటికి ఈ వదంతులు మరెంతగా వ్యాపిస్తాయోనని జనం చర్చించుకుంటున్నారు.