వడదెబ్బతో ఇద్దరు మృతి
అవుకు/పత్తికొండటౌన్: ఎండలు ప్రాణాలు తీస్తున్నాయి. పెరుగుతున్న ఎండలతో జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన మారెమడుగల పెద్ద రాముడు చిన్న కూమారుడు కార్తీక్(10) 4 తరగతి చదువుతున్నాడు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో చుట్టు పక్కల ఉన్న పిల్లలతో కలసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో ఆడుకున్నాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు, విరోచనాలై సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబీకులు స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో రాత్రి కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిలసేలా రోదిస్తున్నారు.
పందికోనలో..
పత్తికొండ మండలం పందికోన గ్రామంలో సోమవారం వడదెబ్బతో గువ్వలరాముడు(52) మృతి చెందాడు. గత రెండురోజులుగా గొర్రెలు మేపేందుకు వెళ్లి తీవ్రమైన ఎండలకు అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు ఆదివారం రాత్రి అతడిని పత్తికొండలోని ఒక ప్రైవేటు నర్సింగ్హోంలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య నాగవేణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.