breaking news
Telangana state cabinet
-
నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం .. ఇంకా ఇతర అప్డేట్స్
-
30న మంత్రివర్గ విస్తరణ!
-
30న మంత్రివర్గ విస్తరణ!
ఆరుగురిని తీసుకునే వీలున్నా.. ఐదుగురితోనే సరిపెట్టనున్న సీఎం కేసీఆర్ ఈ సారి జూపల్లికి కచ్చితంగా స్థానం! విస్తరణలో ఎస్టీ సామాజిక వర్గానికి అవకాశం మహిళల్లో చోటు ఒకరికా.. ఇద్దరికా? హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని ఈ నెల 30వ తేదీన విస్తరించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల చివరివారంతో ఆషాఢ మాసం పూర్తవుతుందని.. ఆ తరువాత ఒకటిరెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణను చేపట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సన్నిహితులు వెల్లడించారు. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది ఉన్నారు. మరో ఆరుగురిని కేబినెట్లోకి తీసుకోవడానికి వీలుంది. ఐదుగురితోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని, కొంతకాలం తర్వాత మరొకరికి మంత్రిగా అవకాశమివ్వాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా వారు చెబుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇద్దరిని కేబినెట్లోకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లా విషయంలో సీఎం కేసీఆర్ మదిలో ఉన్నదేమిటో ఎవరికీ తెలియ డంలేదు. ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్కు జలగం వెంకట్రావు ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు సామాజిక వర్గం ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ఇప్పటికే ఆ సామాజికవర్గం నుంచి సీఎం కేసీఆర్ సహా హరీశ్రావు, కేటీఆర్ మంత్రివర్గంలో ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి మాత్రం అదే సామాజికవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావుకు మంత్రివర్గంలో కచ్చితంగా అవకాశం దక్కనుంది. తొలి మంత్రివర్గ ఏర్పాటులోనే జూపల్లికి అవకాశం వస్తుం దని అంచనా వేసినా... ఆ సామాజికవర్గం నుంచి ఎక్కువమంది అవుతున్నారనే ఏకైక కారణంతో అప్పుడు వాయిదా వేశారు. దాంతో.. ‘ఉద్యమంలో ఉన్నప్పుడు అవరోధం కాని కులం మంత్రివర్గంలో స్థానం అనే సరికి అవరోధం అవుతుందా? మంత్రి పదవిని, కాంగ్రెస్ని వదిలిపెట్టి ఉద్యమంలోకి వచ్చిన నాకు తెలంగాణ రాష్ట్రంలో లభిస్తున్న గౌరవం ఇదేనా?’ అని జూపల్లి ఇప్పటికే తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. మహబూబ్నగర్ జిల్లా నుంచి సి.లక్ష్మారెడ్డికి కూడా మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది. పెరుగుతున్న ఆశావహుల జాబితా.. మంత్రివర్గం విస్తరణలో జాప్యం పెరుగుతున్న కొద్దీ ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రెండు, మూడేళ్లు నిరీక్షించి ఆ తర్వాత మంత్రివర్గంలో చోటు కోరుదామనుకున్నవారు కూడా ఈ విస్తరణలోనే అవకాశం కోరుతున్నారు. బీఎస్పీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్రెడ్డి కూడా కేబినెట్లో చోటు కోరుతున్నారు. టీఆర్ఎస్లో చేరడానికి ముందుగానే ఇంద్రకరణ్కు ఈ మేరకు హామీ లభించినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదే జిల్లా నుంచి సీనియర్గా ఉన్న నల్లాల ఓదెలుకు చీఫ్ విప్గా అవకాశం రానుంది. ఎస్టీ వర్గం నుంచి కోవ లక్ష్మికి మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా నుంచి కూడా ఎ.చందూలాల్తో పాటు కొండా సురేఖ, డి.వినయ్భాస్కర్ మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. ఎస్టీ కోటాలో స్థానం కోసం ఎ.చందూలాల్, రాములు నాయక్, కోవ లక్ష్మి ఎదురుచూస్తున్నారు. సీనియర్గా ఉన్న చందూలాల్కు అవకాశం దక్కుతుందని నేతలు చెబుతున్నా.. రాములు నాయక్ను ఎమ్మెల్సీగా తీసుకోవడానికి ముందుగానే మంత్రివర్గంలోకి తీసుకుంటామనే హామీని కేసీఆర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కోవ లక్ష్మికి అవకాశమిస్తే ఎస్టీ కోటాతోపాటు మహిళకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినట్టు అవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కనీసం ఇద్దరు మహిళలకైనా చోటివ్వకపోతే వారికి తగిన ప్రాతినిధ్యం లేదనే విమర్శలు వస్తాయనే చర్చ టీఆర్ఎస్లో ఉంది. మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏను గు రవీందర్రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. -
సీఎం వరాల జల్లుపై సందేహాలెన్నో
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల పట్ల జిల్లా ప్రజల్లో ఆనందోత్సాహాలతో పాటు సందేహాలు, కొంతమేర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రుణమాఫీపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ రైతన్నల్లో భరోసా కలిగిస్తుండగా, మాఫీ అమలు చేయాల్సిన ఆర్బీఐ మార్గదర్శకాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక తుపాను పీడిత మండలాలకు రుణాల రీషెడ్యూల్ అవకాశం ఉండడం జిల్లా రైతులకు కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ.. కౌలు రైతుల రుణాలపై స్పష్టత లేకపోవడంతో ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రుణమాఫీ ఎలా చేస్తారో ఆర్బీఐకి ప్రభుత్వం చెప్పేంతవరకు ఈ ఉత్కంఠ తప్పదని రైతు సంఘాలంటున్నాయి. ఇక, ఇంక్రిమెంట్ ప్రకటనతో తెలంగాణ ఉద్యోగులు హ ర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, సకలజనుల సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్ అమలవుతుందా? గతంలో ఆర్జిత సెలవు (ఈఎల్) కింద పరిగణించిన వేతనాన్ని తిరిగి చెల్లిస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 1956కు ముందున్న విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని కేబినెట్లో నిర్ణయించడం జిల్లాలోని వేలాది మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గందరగోళంలో పడేసింది. ఉద్యోగాల నిమిత్తం పొరుగున ఉన్న ఉభయ గోదావరి, కృష్ణా తదితర జిల్లాలకు వెళ్లి, 1956 తర్వాత తిరిగి వచ్చి స్థిరపడ్డ వారి పిల్లలు, ముఖ్యంగా 1959లో తెలంగాణలో కలిసిన భద్రాచలం డివిజన్లోని చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, వాజేడు, భద్రాచలం పట్టణానికి చెందిన విద్యార్థులకు సంబంధించి కూడా స్పష్టత రాలేదు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక వస్తేనే వీరికి ఫీజులొచ్చేది లేనిది తేలుతుంది. అలాగే ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వారి పిల్లలు చాలా మంది ఇక్కడే చదువుకుంటున్నారు. వారి పరిస్థితేంటో అర్థం కావడం లేదని, అక్కడి ప్రభుత్వమయినా వీరికి ఫీజులిస్తుందో, ఇవ్వదో స్పష్టత ఇవ్వాలని సంఘాల నాయకులంటున్నారు. ఇక, 500 పైబడి జనాభా ఉన్న తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలన్న నిర్ణయంతో జిల్లాలో గ్రామపంచాయతీల సంఖ్య పెరగనుంది. ఆటోలు, ట్రాక్టర్లు, ట్రాలీలకు రవాణా పన్ను ఎత్తివేత, ఆర్ఎంపీ, పీఎంపీలకు సర్టిఫికెట్లు, కల్యాణ లక్ష్మి ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోని యువతుల పెళ్లిళ్లకు రూ.50 వేలు ఆర్థికసాయం, సామాజిక పింఛన్ల పెంపు లాంటి అంశాలు జిల్లా వాసులకు మేలు చేయనున్నాయి. ఇక తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు సాయం, ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత నిర్ణయాలు కూడా జిల్లాలోని వందలాది మందికి లబ్ధి చేకూర్చనున్నాయి. రుణమాఫీ ఏ మేరకు... మంత్రివర్గ నిర్ణయం మేరకు జిల్లాలో ఇప్పటివరకు రైతులు తీసుకున్న రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలన్నీ రద్దవుతాయి. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు, పాత బకాయిలూ కూడా రద్దవుతాయి. అలా రద్దు చేస్తే జిల్లాలోని 4.6 లక్షల రైతులకు చెందిన రూ.3,200 కోట్ల వరకు మాఫీ చేయాల్సి ఉంటుంది. ఇందులో 3 లక్షల మంది రైతులు దాదాపు రూ. 1600 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారు. బంగారం పెట్టి తీసుకున్న రైతులు 55 వేల మంది ఉండగా, వీరికి రూ.486 కోట్లు మాఫీ అవుతుంది. మిగిలిన దీర్ఘకాలిక రుణాల్లో వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల కొనుగోలు నిమిత్తం తీసుకున్న రుణాల్లో లక్ష లోపు ఉంటేనే మాఫీ అవుతాయి. స్వల్పకాలిక రుణంతో పాటు దీర్ఘకాలిక రుణం తీసుకుని ఉంటే అది రూ.లక్ష దాటితే మాఫీ కాదని, ఏదో ఒకటే మాఫీ చేసుకోవాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెపుతున్నారు. మరోవైపు జిల్లాలోని 2,554 మంది కౌలురైతులు దాదాపు రూ. 11.2 కోట్ల రుణం తీసుకున్నారు. వీరి విషయంలో మంత్రివర్గం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇక గత సంవత్సరానికి మాత్రమే మాఫీ వర్తిస్తే 2.36 లక్షల మంది రైతులకు చెందిన రూ.1266 కోట్లు మాత్రమే మాఫీ అవుతాయి. అదే ఏప్రిల్ 2013 నుంచి అక్టోబర్ 27 వరకు మాత్రమే తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేస్తే కొంతమేర తగ్గనుంది. మొత్తంమీద ఆర్బీఐకి ప్రభుత్వం లేఖ రాస్తే కానీ పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం లేదు. తండాలు పంచాయతీలయితే... మంత్రివర్గ నిర్ణయం మేరకు జిల్లాలోని 500పైగా జనాభా ఉన్న 1,046 తండాలను గ్రామపంచాయతీలుగా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 758 పంచాయతీలుండగా, అందులో పోలవరం ముంపు కింద 334 గ్రామాలు ఆంధ్రప్రదేశ్కు వెళ్తాయి. అవి వెళ్లినా ఈ 1046 పంచాయతీలు కలిస్తే జిల్లాలో 1470 పంచాయతీలవుతాయి. పింఛన్దారులకు దసరా, దీపావళే.. జిల్లాలోని దాదాపు 2.5 లక్షల మంది పింఛన్దారులకు దసరా-దీపావళి మధ్యలో పెన్షన్లను భారీగా పెంచాలన్న మంత్రివర్గం నిర్ణయం వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతోంది. ఇప్పటివరకు జిల్లాలో 1,09,213 మంది వృద్ధాప్య , 93,100 మంది వితంతు, 24,583 మంది వికలాంగ పింఛన్లు పొందుతున్నారు. వీరికి పింఛన్ పెంపు అమలయితే వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున అందుతాయి. రవాణా పన్ను రద్దుతో 34వేల మందికి ఊరట ఆటోలు, ట్రాక్టర్లు, ట్రాలీల రవాణా పన్ను రద్దుతో దాదాపు 34వేల మందికి ఊరట కలగనుంది. ప్రస్తుతం జిల్లాలో రవాణా పన్ను కడుతున్న ఆటోలు 23,489 ఉండగా, రూ.1.3 కోట్లు వసూలవుతున్నాయి. 3,774 ట్రాలీలకు గాను రూ.80 లక్షల పైన, 7,269 ట్రాక్టర్లకు గాను రూ.87లక్షల పైన రవాణా పన్ను కింద వస్తోంది. ఈ పన్ను రద్దయితే రవాణా శాఖకు ఏడాదికి రూ.2.7 కోట్ల ఆదాయం తగ్గనుంది. ఇంక్రిమెంటు ఓకే... కానీ.. తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ అమలు చేయాలన్న నిర్ణయంపై జిల్లాలోని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలోని అన్ని శాఖల్లో కలిపి దాదాపు 27,287 మంది ఉద్యోగులుండగా, వీరికి నెలకు వేతనాల కింద రూ.108.53 కోట్లు చెల్లిస్తున్నారు. అయితే, ఈ ఇంక్రిమెంట్లు అమలు సకల జనుల సమ్మెలో పాల్గొనని వారికి కూడా ఇస్తారా అనే సందేహాన్ని ఉద్యోగ సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సకలజనుల సమ్మె జరిగిన 42 రోజులను ఆర్జిత సెలవుగా పరిగణించి వేతనాన్ని ఇచ్చే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మరి ఇంక్రిమెంట్తో పాటు ఆ వేతనం కూడా ఇస్తారా లేక ఇంక్రిమెంట్తోనే సరిపెడతారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. 59 కేసులు... 264 మంది తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలన్న మంత్రివర్గ నిర్ణయం మేరకు జిల్లాలో పెండింగ్లో ఉన్న 59 కేసులు ఎత్తివేయనున్నారు. వీటిలో నిందితులుగా పేర్కొన్న 264 మందికి ఊరట కలగనుంది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సాయం చేస్తామన్న నిర్ణయంతో జిల్లాలో దాదాపు 10 మంది అమరవీరుల కుటుంబాలకు మేలు చేకూరనుంది. ఆర్ఎంపీలు, పీఎంపీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు కూడా ఇవ్వాలన్న నిర్ణయం జిల్లాలోని దాదాపు 5వేల మంది ఆర్ఎంపీ, పీఎంపీలకు సంతోషాన్ని కలిగిస్తోంది. అదే విధంగా కల్యాణలక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోని వధువులకు రూ.50వేల ఆర్థిక సాయం పథకాన్ని దళిత, గిరిజనులతో పాటు అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. ‘ఫీజు’కు తిప్పలే... ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద లబ్ధి పొందాలంటే 1956కు ముందునుంచే తెలంగాణలో ఉండాలన్న నిర్ణయం జిల్లా వాసుల్లో కొందరికి ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. ఉద్యోగాల కోసం 1956 తర్వాత వచ్చి ఇక్కడ స్థిరపడినవారు, ఇతర జిల్లాల నుంచి వలస వచ్చి జీవిస్తున్న వారి పిల్లలకు ప్రభుత్వ సాయం అందే పరిస్థితి ఉండదు. వీరి సంఖ్య వేలల్లోనే ఉంటుందని అంచనా. మరోవైపు 1959లో తెలంగాణ ప్రాంతంలో కలిసిన భద్రాచలం డివిజన్ పరిధిలోని విద్యార్థుల పట్ల ఎలాంటి నిబంధనలు విధిస్తారన్నది వేచి చూడాల్సిందే. -
గవర్నర్ అనుమతితో పీఎస్యూలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్యూ)లను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశించింది. ఈ మేరకు ప్రతీ పీఎస్యూ వెంటనే బోర్డు సమావేశం ఏర్పాటు చేసుకుని విభజన తీర్మానం చేసి గవర్నరుకు పంపాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ కేబినెట్ అనుమతి తప్పనిసరి అని మొదట్లో ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఏర్పడిన తర్వాతే ప్రత్యేకంగా పీఎస్యూలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని భావించింది. అయితే, గవర్నరుకు ప్రభుత్వానికి ఉన్న అన్ని అధికారాలు ఉన్న నేపథ్యంలో కేవలం ఆయన ఆమోదం సరిపోతుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మే 15 నాటికి అన్ని పీఎస్యూ బోర్డులు విభజన తీర్మానాన్ని ఆమోదిస్తూ గవర్నరు నుంచి అనుమతి తీసుకోవాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేయనున్నారు. గవర్నరు నుంచి అనుమతి లభించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర పీఎస్యూను ఏర్పాటు చేస్తూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కు దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వం సూచించినట్టు సమాచారం. ఉదాహరణకు తెలంగాణ ట్రాన్స్కో, తెలంగాణ జెన్కో, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) మొదలైన పీఎస్యూలను ఏర్పాటు చేయాల్సిఉంది.