breaking news
sujith Reddy
-
'సాహో' సుజీత్.. డబురువారిపల్లి బుల్లోడు
కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టాడాయన. తండ్రికి వారసునిగా చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకున్న ఆయన అనూహ్యంగా సినీ రంగంవైపు మళ్లీ హాలీవుడ్ స్థాయి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆయనే రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ‘సాహో’ సినిమాకు దర్శకత్వం వహించిన ఎద్దుల సుజీత్ రెడ్డి.సుజీత్ సినీ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కుగ్రామం నుంచి... అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన పుట్టపర్తి నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతంలో డబురువారిపల్లి ఓ కుగ్రామం. ఇక్కడ 150 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ మొత్తం జనాభా 350. ఈ గ్రామంలో ఎద్దుల వారి కుటుంబానికి చెందిన వారే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నింటా ఉన్నత స్థానంలో ఉన్నారు. సాహో చిత్ర దర్శకుడు సుజీత్రెడ్డి తండ్రి ఎద్దుల గోపీనాథ్రెడ్డి వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. అనంతపురం, ఆ తర్వాత హైదరాబాద్లో పనిచేసి అక్కడే స్థిరపడ్డారు. గోపీనాథ్రెడ్డి, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు వినీత్రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. అనూహ్యంగా సినీరంగంవైపు సుజీత్రెడ్డి 1990, అక్టోబర్ 10న జన్మించారు. అప్పట్లో వారి కుటుంబం అనంతపురంలో ఉండేది. అక్కడే ఎల్ఆర్జీ స్కూల్లో 1 నుంచి 3వ తరగతి వరకూ చదువు. ఇంతలో తండ్రికి బదిలీ కావడంతో చెన్నైలో 4 నుంచి పదో తరగతి వరకు చదివి, ఇంటర్మీడియట్ కోసం తిరిగి అనంతపురానికి వచ్చారు. తన తండ్రి బాటలోనే తాను కూడా సీఏ చేయాలని భావించి ఇంటర్లో ఎంఈసీ పూర్తి చేశారు. తర్వాత విజయవాడ సూపర్విజ్ కళాశాలలో సీఏ విద్య కోసం చేరారు. దాన్ని వదిలి బీకాం ఆనర్స్ పూర్తి చేసి, తల్లిదండ్రుల అనుమతితో 2012–13లో చెన్నైలోని ఎల్వీ ప్రసాద్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో పీజీడీఎఫ్టీ (పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫిలిం టెక్నాలజీ) చేశారు. తల్లిదండ్రులు ఎద్దుల గోపీనాథ్రెడ్డి, నాగమణి,అన్న వినీత్రెడ్డిలతో సుజీత్ లఘు చిత్రాల ద్వారా తొలి అడుగు పీజీడీఎఫ్టీ పూర్తి చేసిన తర్వాత 2014 నుంచి షార్ట్ ఫిలిమ్స్(లఘు చిత్రాలు)పై సుజీత్ దృష్టిసారించారు. లఘు చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే ప్రముఖ సినీ హీరోలతో పరిచయాలు పెంచుకున్నారు. 23ఏళ్ల వయస్సులోనే ‘రన్ రాజా రన్’ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ నవ్వులు పూయించిన ఆ చిత్రం సుజీత్కు మంచి పేరు తెచ్చింది. ప్రభాస్ ఆశీస్సులతో... సుజీత్ వయస్సు ఇప్పుడు 28 ఏళ్లు. అతనిలోని దర్శకత్వ ప్రతిభను యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ గుర్తించారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో మూడు భాషల్లో తీసిన ‘సాహో’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించారు. హాలీవుడ్ చిత్రాలను మరిపించేలా చిత్రాన్ని రూపొందించి యావత్ ప్రపంచ దృష్టిని సుజీత్ ఆకర్షించారు. అందరి అంచనాలను మించి చిత్రం విజయవంతమవుతుందని ఇప్పటికే ‘సాహో’ టీజర్లు చూసిన నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇంతటి ఖ్యాతి గడించిన సుజీత్ తమ గ్రామ వాసి కావడంతో డబురువారిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 30 సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. సుజీత్ స్వగ్రామం ఇదే -
స్వచ్ఛభారత్ కోసం ఉద్యోగాన్నే వదిలేశాడు..!
23 ఏళ్ల యువకుడు... చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాడు. దేశానికి వెన్నెముకగా నిలిచే రైతులపై దృష్టి సారించాడు. రైతులు సేంద్రియ పద్ధతిలో తామే ఎరువులను తయారు చేసుకునేలా, విద్యుత్ను ఉత్పత్తి చేసుకునేలా చేయాలని సంకల్పించాడు. భారత ప్రధాని నరేంద్రమోడి స్వచ్ఛభారత్ అభియాన్ను ఎందుకు ప్రారంభించారు అంటూ చాలామంది తమ పరిసరాలను గమనించడం మొదలుపెట్టారు. అయితే హైదరాబాద్ వాస్తవ్యులైన సుజిత్రెడ్డి మాత్రం తను చేస్తున్న బి.పి.ఓ. ఉద్యోగానికి రాజీనామా చేసి, 150 కి.మీ. స్వచ్ఛభారత్ క్యాంపెయిన్ని నగరంలో నిర్వహించి మరో అడుగు ముందుకు వేశారు. పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నాందిగా నిలిచిన విషయం చెబుతూ -‘‘మూడు నెలల క్రితం, కరీంనగర్ జిల్లాలోని మా తాతగారి ఊరైన వేములవాడలో ఓ రైతు పంటనష్టం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త విని చాలా బాధపడ్డాను. గడచిన పదేళ్ళలో మన దేశంలో 3 లక్షల 50 వేల మంది రైతులు పంటనష్టం, అప్పుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాను. వారికోసం ఏదైనా చేయాలనిపించింది. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో వ్యర్థపదార్థాల నుంచి తయారు చేసిన విద్యుత్, బయోగ్యాస్ వంటివి రైతులకు ఎంతో ఉపయోగడుతున్నాయి. మన దేశంలోని ఒక రోజు చెత్తనంతా సేకరించి బయోగ్యాస్గా మారిస్తే కనీసం 2 లక్షల సిలిండర్లను నింపవచ్చు అని అర్థమైంది’’ అని తెలిపారు ఈ పట్టభద్రుడు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఆచరణలో పెట్టాలనుకున్నారు. రైతుల క్షేమం కోసం పోరాడాలనుకున్నారు. చెత్తను సేకరించి దానిని విద్యుత్తుగానూ, ఎరువులుగానూ మార్చి స్వచ్ఛభారత్ కార్యక్రమానికి మొదటి అడుగు అవ్వాలని నిశ్చయించుకున్నారు. ‘‘మొదటిరోజు చెత్తను సేకరించడానికి శస్త్రచికిత్స సమయంలో వైద్యులు వాడే గ్లౌజులను ఇచ్చి మా కజిన్ మనోజ్రెడ్డి మద్దతు తెలిపారు. ఆ తర్వాత రోజుకు నలుగురు, ఐదుగురు చొప్పున ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది’’ అని తెలిపారు సుజిత్. వీరంతా బస్టాప్లు, స్కూళ్లు, కళాశాలలు, షాప్లు సందర్శిస్తారు. అలాగే ప్రతి ఇంటి నుంచి, షాపుల నుంచి తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి, సేకరించడానికి పూనుకున్నారు. సేకరించిన చేత్తను మున్సిపాలిటీ కుండీలకు చేరుస్తారు. నిండిన కుండీల గురించి మున్సిపాలిటీ వారికి సమాచారం ఇస్తారు. డంప్యార్డ్ వద్ద విద్యుదుత్పాదన చేయవచ్చని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనితో పాటు పరి శుభ్రత గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు పూను కున్నారు. చెత్తను వీధుల్లో కాకుండా కుండీలలోనే వేస్తున్నారా అంటూ ప్రతి దుకాణదారుడి దగ్గరకు వెళ్లి అడుగుతున్నారు.అంతేకాదు వారు తాము చెప్పిన విధంగా చేస్తున్నారా, లేదా? అనేదీ పరిశీలిస్తున్నారు. తొంభై శాతం దుకాణదారులు చెప్పినట్టుగా చేయడం గర్వంగా ఉంటోంది అంటున్నారు సుజిత్. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. అయితే, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు చేయి కలిపితే మరిన్ని మెరుగైన ఫలితాలను తీసుకురావచ్చు అంటున్న సుజిత్ తన కార్యక్రమానికి ‘వి ఆర్ ఫౌడ్ టు బి ఎ హైదరాబాదీ’ అని ప్రింట్ చేసిన యూనిఫామ్ను రూపొందించారు. ‘‘మేం బేగంపేటలోని ట్రాఫిక్ పోలీస్లను కలిశాం. వారు చాలా సంతోషంగా, ఈ కార్యక్రమానికి ప్రోత్సహమిచ్చారు. ముక్కుకు అడ్డుగా కట్టుకోవడానికి మాకు పొల్యూషన్ మాస్క్లను ఇచ్చి, మరీ ప్రోత్సహించారు. ఎవరికైనా మంచి పని చేయాలని ఉంటే, అందుకు తప్పక మరికొంతమంది సాయపడతారు’’ అని నవ్వుతూ తెలిపారు సుజిత్. మరో ముందడుగు గురించి సుజిత్ చెబుతూ- ‘‘త్వరలో గ్రామాలకు వెళ్లి, రైతులతో మాట్లాడతాను. వారికి సేంద్రియ ఎరువులను సొంతంగా ఎలా తయారుచేసుకోవచ్చో, చెత్త నుంచి వంట గ్యాస్ను ఎలా తయారుచేసుకోవచ్చో తెలియజేస్తాను. ఇదే నా కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం’’ అంటున్నారు. త్వరలోనే సుజిత్ దాన్ని సాధిస్తారు. అతనికళ్లలో, మాటల్లో కనిపిస్తోన్న ఆత్మవిశ్వాసమే అందుకు సాక్ష్యం! - నిర్మలారెడ్డి ఈ కార్యక్రమంలో మీరూ పాల్గొనాలనుకుంటే... facebook:sujithreddyswachhbarath, we are proud to be a hyderabadi కు వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. స్ఫూర్తిమంతమైన ఇటువంటి కథనాలను మాతో పంచుకోవాలనుకుంటున్నారా? మేము సైతం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34. email:swachhbharat.sakshi@gmail.com, swachhbharat@sakshi.com కు పంపండి. బాగున్న వాటిని ప్రచురిస్తాం.