breaking news
srirangapatna
-
ఆదిశ్రీరంగ క్షేత్రం శ్రీరంగపట్నం
పవిత్ర కావేరీ తీరంలో వెలసిన మూడు శ్రీరంగనాథ క్షేత్రాలలో మొదటిది శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథ ఆలయం. కావేరీ నది మొదట్లో వెలసిన శ్రీరంగపట్నం క్షేత్రాన్ని ఆది శ్రీరంగంగా, కావేరీ ప్రవాహానికి కాస్త ముందుకు వెళితే శివసముద్రం వద్ద వెలసినది మధ్య శ్రీరంగ క్షేత్రంగా, తమిళనాడులోని శ్రీరంగంలో వెలసినది అంత్య శ్రీరంగ క్షేత్రంగా విరాజిల్లుతున్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకం, పురాతనం. శ్రీరంగపట్నంలో వెలసిన క్షేత్రం ఏనాటికి చెందినదో తెలిపే కచ్చితమైన ఆధారాలేవీ లేవు. అయితే, అంబ అనే భక్తురాలు క్రీస్తుపూర్వం 3600 సంవత్సరంలో ఇక్కడ శ్రీరంగనాథునికి చిన్న గుడి కట్టించినట్లు ప్రతీతి. తర్వాతి కాలంలో గంగ, హొయసల, విజయనగర రాజుల కాలంలో ఆలయం వివిధ కళారీతుల్లో విస్తరించింది. తొలుత చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని తొమ్మిదో శతాబ్దిలో గంగ వంశపు రాజులు భారీ స్థాయిలో పునర్నిర్మించారు. తర్వాత హొయసల, విజయనగర రాజులు అభివృద్ధిపరచారు. ఇక్కడి గర్భగుడి గంగవంశీయుల నాటి శిల్పశైలిలోను, ఆలయ అంతర్నిర్మాణాలు హొయసల శైలిలోను, ఆలయంలోని రంగమండపం, గోపురం విజయనగర శైలిలోను కనువిందు చేస్తాయి. -
భూలోక వైకుంఠం... శ్రీరంగపట్నం
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు అతి సమీపంలో మాండ్యాజిల్లాలో ఉన్న ఈ ఆలయానికి చారిత్రకంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా కూడా ఎంతో పేరున్నది. మైసూరు రాజులు శ్రీరంగపట్టణాన్నే రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు. రంగరాయను ఓడించి వడయార్ రాజు 1614లో శ్రీరంగపట్టణాన్ని వశపరచుకున్నాడు. మైసూర్ పులి టిప్పుసుల్తాన్కి శ్రీరంగనాథుడంటే ఎనలేని భక్తి. టిప్పుసుల్తాన్ తండ్రి హైదరాలీ మైసూరును పాలించిన కాలంలో ఆయన రంగనాథుని ప్రార్థించిన తర్వాతనే యుద్ధభూమిలోకి అడుగు పెట్టేవాడట. శ్రీరంగపట్టణం చుట్టూతా కావేరీ నది ఆవరించి ఉంటుంది. అందువల్ల ఇది ఒక ద్వీపంలా కనిపిస్తుంది. ఎల్తైన ఆలయ గోపురం, రెండు సువిశాలమైన ప్రాకారాలు, ఆలయ మంటపం, ఉన్నతమైన ముఖమంటపంతో అలరారుతుంటుంది. ఆలయ ముఖద్వారం పైకప్పు చిన్న చిన్న శిఖరాలన్నీ కలిసి గుచ్చిన పుష్పమాలాలంకృతమై ఉంటుంది. గర్భగుడిలోకి అడుగుపెట్టగానే ఏడుతలల ఆదిశేషువుపై శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువు, ఆయన పాదాలు వత్తుతున్న లక్ష్మీదేవి దర్శనమిస్తారు. ఆలయంలో నరసింహస్వామి, గోపాలకృష్ణుడు, శ్రీనివాసుడు, హనుమంతుడు, గరుడుడు, పన్నిద్దరు ఆళ్వారుల సన్నిధులు కూడా కనిపిస్తాయి. కావేరీ నీరు వైకుంఠంలోని విరజానదితో సరితూగగలిగేంత పవిత్రమైనవని విశ్వాసం. గంగ కూడా కావేరీలో స్నానం చేసి తన పాపాలను పోగొట్టుకుంటుందని పురాణ కథనాలున్నాయి. అంతేకాదు, కావేరీ నది కోరికమేరకే శ్రీరంగనాథుడు ఇక్కడ కొలువయ్యాడని, బ్రహ్మ, రుద్రుడు కూడా దివినుంచి భువికి దిగివచ్చి రంగనాథుని పూజిస్తారని ప్రతీతి. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన విష్ణువర్థనుడనే రాజు ఎంతో ధనాన్ని వెచ్చించి ఆలయ అభివృద్ధికి పాటుపడ్డాడు. ఆయన భార్య అలమేలమ్మ ప్రతి మంగళ, శుక్రవారాలలో దేవేరులకు అమూల్యమైన ఆభరణాలు తయారు చేయించి అలంకరింపజేసేది. ఆ తర్వాత వచ్చిన విజయనగర రాజులు, అనంతర కాలంలో మైసూరు మహారాజులు ఆలయానికి మరింత శోభను చేకూర్చారు. అంగరంగవైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. సేవలు, ఉత్సవాలు: మకర సంక్రాంతినాడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముక్కోటి ఏకాదశినాడు స్వామివారి ఉత్తరద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈరోజున స్వామివారిని వెన్నతో అలంకరిస్తారు. సాయంత్రం కిరీటాలంకరణ చేస్తారు. ఆ తర్వాత రథసప్తమికి కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మాఘ పూర్ణిమనాడు స్వామివారికి కావేరీనదిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఈ పర్వదినాన వేలాది భక్తులు స్వామిని సేవించుకుంటారు. వైశాఖ శుద్ధ సప్తమినాడు శ్రీరంగ జయంతి ఉత్సవాలు జరుపుతారు. ఆ తర్వాత వచ్చే పున్నమినాడు బంగారు గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఇంకా ఏమేమి చూడవచ్చు? టిప్పుసుల్తాన్ కోట, శ్రీరంగనాథిట్టులోని బర్డ్ శాంక్చువరీ, నిమిషాంబ ఆలయం, దొడ్డ ఘోశాయ్ ఘాట్, కరిఘట్ట కొండలు, సంగమ, గుంబాజ్, జామా మసీద్ వంటివాటిని సందర్శించవచ్చు. ఎలా వెళ్లాలి? దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి శ్రీరంగపట్నానికి నేరుగా రైళ్లు, బస్సులు ఉన్నాయి. విమానాశ్రయం మాత్రం మైసూరులో ఉంది. అక్కడినుంచి శ్రీరంగపట్నం కేవలం పదహారు కిలోమీటర్లే. విశాఖపట్నంలోని గాజువాక నుంచి శ్రీరంగపట్నానికి నేరుగా రైలుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
తిరిగి జైలు తలుపులు తట్టిన తాజ్
సత్ప్రవర్తన జాబితాలో మైసూరు జైలు నుంచి విడుదలైన తాజ్ శిరిన్ సొంత ఊళ్లో నా అన్న వాళ్లు కనిపించని వైనం తిరిగి జైలు తలుపులు తట్టిన తాజ్ మైసూరు : జైలు నుంచి విడుదలైన ఓ మహిళ 24 గంటల్లోనే మళ్లీ జై లు తలుపులు తట్టడంతో అధికారులు విస్తుపోయిన ఘటన బుధవారం మైసూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మైసూరు జిల్లా శ్రీరంగ పట్టణానికి చెందిన తాజ్ శిరిన్ (44)కు 2002లో భర్తను హత్య చేసిన ఘటనలో న్యాయస్థానం కారాగార శిక్ష విధించింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాలో తాజ్ శిరీన్ కూడా ఉంది. ఆమె కూడా విడుదలై బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. తన ఊరిని వెతుక్కుంటూ వెళ్లింది. అక్కడే ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోగా తన వాళ్లు, తన కుటుంబ సభ్యులు, చివరికి ఊరిలో గుర్తు పట్టేవాళ్లు కూడా లేకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది. జైలుకు వెళ్లినపుడు ఆమె తల్లిదండ్రులు, వారితోనే ఉన్న ఆమె ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లేవారు. కానీ ఆమెకు వారి జాడ తెలియకపోవ డంతో గ్రామస్తులను ఆరా తీసింది. విచారించగా ఆమె తండ్రి మృతి చెందిన అనంతరం తల్లి పిల్లలతో గ్రామాన్ని వదిలి వెళ్లిపోయిందని చెప్పారు. తల్లి, పిల్లలు ఎక్కడికెళ్లారో, ఏమయ్యారో తెలియకపోవడంతో దిక్కుతోచని స్థితిలో మరుసటి రోజే అక్కడినుంచి తిరుగు ప్రయాణమై జైలు తలుపు తట్టింది. ఊహించని ఘటనను ఎదుర్కొన్న జైలు అధికారులు ఆమెను నగరంలోని శక్తిధామం అనాథ శరణాలయంలో చేర్చారు.