breaking news
single entrance test
-
‘నీట్’లా ఇంజనీరింగ్కూ ఒకే ఎంట్రన్స్!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్లో ఇక రాష్ట్రాల పరిధిలో ఎంసెట్ల నిర్వహణ ఉండే అవకాశం కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ‘నీట్’ను నిర్వహిస్తున్న మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకూ పంపింది. మెజారిటీ రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దీంతో ఈ అంశంపై అవగాహనకు కేంద్రం సెమినార్లు నిర్వహిస్తోంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్న డిగ్రీ, పీజీ సీట్ల భర్తీకి కూడా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ప్రయోగం విజయవంతమైంది. దీంతో జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్షపై కేంద్రం దృష్టి పెట్టింది. గత కొన్నేళ్లుగా దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కేంద్రం జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష చేపడుతోంది. ఇదే మాదిరిగా రాష్ట్రాల ఇంజనీరింగ్ కాలేజీలనూ కలుపుకొని ఉమ్మడి ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్ చేపట్టాలని 2016లోనే ఆలోచన చేసింది. కానీ వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. కొనసాగుతున్న చర్చలు గత నెల 18న భువనేశ్వర్లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), యూజీసీ, ఐఐటీల డైరెక్టర్లు, గవర్నింగ్ బాడీ చైర్మన్లతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్షపై చర్చించారు. అయితే ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు, పొందుపరచాల్సిన నిబంధనలపై వివిధ వాదనలు వినిపించాయి. దీంతో అన్ని కోణాల్లోనూ పరిశీలించి, మార్పుచేర్పులతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఐఐటీ గవరి్నంగ్ బాడీ చైర్మన్లను కేంద్ర మంత్రి ఆదేశించారు. దీంతో వారు అన్ని రాష్ట్రాలతో భేటీ అవుతూ అభిప్రాయసేకరణ చేపడుతున్నారు. 2025–26 నాటికి ఈ ప్రయోగాన్ని అమల్లోకి తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విధానపరమైన నిర్ణయం తీసుకున్నాక ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉన్న కాలేజీలకు రెండేళ్ల సమయం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే ఐఐటీల నాణ్యతను ఏమాత్రం తగ్గించకుండా చూడాలని సమావేశంలో పాల్గొన్న విద్యావేత్తలు సూచించారు. నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలతోపాటు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)లో విలీనం చేసే యోచన ఉందని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్కుమార్ కూడా గతంలో అనేక సందర్భాల్లో తెలిపారు. నిబంధనలు పాటిస్తేనే అనుబంధ గుర్తింపు.. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ జాతీయ స్థాయిలోకి వెళ్తే పూర్తిగా వెబ్ ఆధారితంగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. యాజమాన్య కోటా కూడా కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలన్నీ ఏఐసీటీఈ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుంది. మౌలిక వసతులు, నాణ్యమైన ఫ్యాకల్టి, కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో బోధన ప్రణాళిక మొత్తం కేంద్ర పరిధిలోకి వెళ్తుంది. ఫలితంగా కొన్ని ప్రైవేటు కాలేజీలు అనేక మార్పులు చేసుకోక తప్పదని ఓ అధికారి పేర్కొన్నారు. ఇప్పటివరకు యూనివర్సిటీ అధికారులే తనిఖీలు చేసేవాళ్లు. ఇకపై జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి అనుమతిస్తేనే ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభిస్తుందని తెలుస్తోంది. ఈ విధానంతో యాజమాన్య కోటా సీట్ల బేరసారాలకు బ్రేక్ పడుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. -
'ఇంజనీరింగ్లో ఒకే ప్రవేశ పరీక్ష’కు మద్దతు
- అఖిల భారత సాంకేతిక విద్యాసంస్థల సమాఖ్య తీర్మానం - సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా కేవీకే రావు ఎన్నిక సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహణ, ఒకే సిలబస్కు మద్దతిస్తూ అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థల సమాఖ్య తీర్మానం చేసింది. సమాఖ్య రెండో కార్యవర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమాఖ్య చీఫ్ ప్యాట్రన్గా తమిళనాడుకు చెందిన ఆర్ ఎస్.మునిరత్నం, అధ్యక్షుడిగా పంజాబ్కు చెందిన అనుష్ కటారియా, ప్రధాన కార్యదర్శిగా తెలుగు రాష్ట్రాల సాంకేతిక విద్యా సంస్థల సంఘానికి చెందిన కేవీకే రావు, ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అసోసియేషన్కు చెందిన భూపాలం ఎన్నికయ్యారు. అనంతరం సమాఖ్య పలు తీర్మానాలు చేసింది. ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా ఒకే ప్రవేశపరీక్షను, ఒకే సిలబస్ను త్వరగా ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరారు. ప్రధాన కార్యదర్శి కేవీకే రావు మాట్లాడుతూ.. సాంకేతిక విద్యలో విద్యార్థుల నైపుణ్యాలను పెంచే విధంగా సాంకేతిక విద్యామండలి సంస్కరణలు ప్రవేశపెట్టాలని కోరారు. -
‘ఇంజనీరింగ్’కు జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష!
నిర్ణయం తీసుకున్న ఏఐసీటీఈ ∙గెజిట్ నోటిఫికేషన్ అనంతరం అమల్లోకి.. సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సులకు ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయం తీసుకుంది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఒకే ప్రవేశ పరీక్షను అమల్లోకి తేవాలని మంగళవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదిం చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. కొన్ని రాష్ట్రాలు జేఈఈ మెయిన్ ద్వారానే ప్రవేశాలు చేపడుతుండగా, కొన్ని రాష్ట్రాలు సొంతంగా పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ద్వారా ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇక జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థలు జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఐఐటీల్లో మాత్రం జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా ప్రవేశాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మెడికల్కు ‘నీట్’ద్వారా ప్రవేశాలు చేపడుతున్న తరహాలోనే దేశంలోని అన్ని కాలేజీల్లో జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగానే ప్రవేశాలు చేపట్టాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. దీనిపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. అది జారీ అయిన వెంటనే ఒకే ప్రవేశ పరీక్ష విధానం అమల్లోకి రానుంది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనుంది. దీంతో రాష్ట్రంలో ఇక ఇంజనీరింగ్ ప్రవేశాలకు భవిష్యత్తులో ఎంసెట్ ఉండదు. మరోవైపు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు అన్నింటిని నేషనల్ టెస్టింగ్ సర్వీసు (ఎన్టీఎస్) ద్వారా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. 2018లో జేఈఈ మెయిన్ పరీక్షను కూడా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కాకుండా ఎన్టీఎస్ ద్వారా నిర్వహించే అవకాశం ఉంది.