breaking news
Quote
-
‘జై జవాన్, జై కిసాన్’ నినాదం ఎలా వచ్చింది?
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రైతులు ‘జై జవాన్, జై కిసాన్’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ నినాదాన్ని ఎవరు తొలుత లేవనెత్తారు? ఏ సందర్భంలో ఇది జరిగింది? ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాన్ని 1965లో భారత మాజీ ప్రధాని, దివంగత లాల్ బహదూర్ శాస్త్రి వినిపించారు. శాస్త్రి చేసిన నాటి ఈ నినాదం ఎంతో స్ఫూర్తిదాయకంగానూ, ప్రభావవంతంగానూ నిలిచింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1964, మే 27న కన్నుమూశారు. దీంతో నెహ్రూ వారసులెవరనే ప్రశ్న నాడు కాంగ్రెస్ మదిలో మెదిలింది. ఆ సమయంలో మొరార్జీ దేశాయ్ ప్రధాని అభ్యర్థి రేసులో ముందంజలో ఉన్నారు. అయితే దేశాయ్ ప్రధానిగా ఉండేందుకు పార్టీలోని పలువురు నేతలు అంగీకరించలేదు. చరిత్రకారుడు రామచంద్ర గుహ ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ (2007)లో ఇలా రాశారు. ‘ప్రధాని అభ్యర్థిగా దేశాయ్ని ఎంపిక చేయడం సరికాదని కొద్దిరోజుల్లోనే పార్టీలో స్పష్టమైంది. అతని శైలి దూకుడుగా ఉంది. దేశాయ్ స్థానంలో లాల్ బహదూర్ శాస్త్రిని కాంగ్రెస్ తన ప్రధాని అభ్యర్థిగా ఎంపికచేసింది. శాస్త్రి మంచి నిర్వాహకుడు. హిందీ బెల్ట్ నుండి వచ్చారు. ప్రజలకు మరింత చేరువైన వ్యక్తి’ అని రాశారు. నెహ్రూ మరణానంతరం దేశానికి పలు సవాళ్లు ఎదురయ్యాయి. అదే సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన శాస్త్రి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో భారత్పై తిరుగుబాటుకు పాకిస్తాన్ ప్లాన్ చేసి, బరితెగించింది. సరిహద్దుల్లోని వంతెనలను పేల్చివేసింది. ప్రభుత్వ భవనాలపై బాంబులు వేసింది. అయితే భారత సైన్యం ఎదురుదాడికి పాక్ వెన్నుచూపింది. ఈ పరిణామం భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధానికి (1965) దారితీసింది. శాస్త్రి నాయకత్వంలో భారత సైన్యం తన శక్తియుక్తులను ప్రదర్శించింది. 1965, సెప్టెంబరు 23న ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇండో-పాక్ యుద్ధ సమయంలో శాస్త్రి 1965లో యూపీలోని అలహాబాద్ జిల్లాలోని ఉరువా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాన్ని వినిపించారు. వీరిద్దరూ దేశ శ్రేయస్సు, భద్రతకు మూల స్తంభాలని శాస్త్రి భావించారు. ఆయన తన హయాంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్ను మరింత పెంచారు. హరిత విప్లవానికి శాస్త్రి పునాది వేశారు. -
అనని సూక్తిని గాంధీకి ఆపాదించిన ట్రంప్
వాషింగ్టన్: విచ్ఛిన్నకరమైన ప్రచారం చేస్తూ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి మహాత్మాగాంధీ అనని వ్యాఖ్యలను ఆయనకు ఆపాదించే ప్రయత్నం చేశారు. 'మొదట వాళ్లు నిన్ను విస్మరిస్తారు. ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు. ఆపై నీతో పోరాడుతారు. అనంతరమే నువ్వు గెలుస్తావు' అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు అలబామాలో తన ర్యాలీ ఫొటోను పెట్టి.. ఇది మహాత్మా గాంధీ అన్నట్టు ఆపాదించారు. నిజానికి ఈ మాట గాంధీ చెప్పింది కాకపోయినప్పటికీ, చాలా సందర్భాల్లో ఆయనకు ఆపాదిస్తూ వస్తున్నారని అమెరికా మీడియా స్పష్టం చేసింది. 2011లో క్రిస్టియన్ సైన్స్ మానిటర్ మ్యాగజీన్ 'పొలిటికల్ మిస్ కోట్స్' పేరిట తప్పుగా ఆపాదించబడిన ప్రముఖమైన పది సూక్తులను వెల్లడించింది. ఇందులో గాంధీ అన్నట్టు ప్రచారంలో ఉన్న ఈ వ్యాఖ్యను కూడా ప్రస్తావించింది. 'గాంధీజీ తాత్వికత అయిన సత్యాగ్రహానికి సారాంశంగా ఈ సూక్తి పేరొందింది. కానీ నిజానికి ఈ మాట మహాత్ముడు అన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు' అని పేర్కొంది. ఇలాంటి సూక్తినే ఒకదానిని అమెరికా కార్మిక హక్కుల నాయకుడు నికోలస్ క్లీన్కు కూడా ఆపాదించారని ఆ మ్యాగజీన్ స్పష్టం చేసింది. గాంధీజీని ట్రంప్ వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. ట్రంప్ మద్దతుదారు, అలస్కా మాజీ గవర్నర్ సారా పాలిన్ కూడా గతంలో ఇదే సూక్తిని గాంధీజీకి తప్పుగా ఆపాదిస్తూ వాడారు. ఇటలీ ఫాసిస్టు నేత బెనిటో ముస్సోలిని సూక్తిని ట్రంప్ రీ ట్వీట్ చేయడం తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ట్రంప్ గాంధీ సూక్తులను ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. అయితే గాంధీజీ అనని మాటను ఆయనకు ఆపాదించడంపై ట్విట్టర్లో ట్రంప్పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ముస్సోలిని సూక్తులను ప్రస్తావించిన ట్రంప్ త్వరలోనే హిట్లర్ సూక్తులను కూడా వాడుకొని లబ్ధి పొందేలా కనిపిస్తున్నాడని ఆయన తీరుపై ధ్వజమెత్తుతున్నారు.