breaking news
Porridge
-
గంజితో గట్టి మేలు.. ఎలా వాడాలి?
న్యూఢిల్లీ: ఉరుకులు పరుగుల జీవితంలో నఖశిఖపర్యంతం మనిషికి ఎన్నో ఆరోగ్య సమస్యలు. అన్ని ఆరోగ్య సమస్యలు అవతలి వాళ్లకు చూడగానే కనిపించవు. కానీ జుట్టు సరిగాలేకపోయినా, జుట్టు ఊడిపోయినా ఎదుటి వాళ్లు ఇట్టే కనిపెడతారు. జుట్టు రాలిపోయే సమస్యకు ఇప్పుడు ఎంతో మంది వందల రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నో రకాల ఖరీదైన షాంపూలు ఉపయోగిస్తున్నారు.అయితే ప్రత్యేకంగా ఎలాంటి ఖర్చుపెట్టకుండానే జుట్టు రాలే సమస్యను గంజితో పరిష్కరించుకోవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. చైనా, జపాన్లలో శతాబ్దాలుగా గంజిని జుట్టు పోషణ కోసం విరివిగా ఉపయోగిస్తున్నా భారత్లో గంజి వినియోగం అంతంతే. ఈ నేపథ్యంలో గంజిని వృథాగా పారబోయకుండా ఒత్తయిన జుట్టు కోసం సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేందుకు జపాన్, చైనాలో గంజిని ఉపయోగిస్తారు.గంజి వాడకంతో జుట్టు ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు వెంట్రుకల కొనలు పగిలిపోవడంలాంటివి బాగా తగ్గుతాయి. గంజి వినియోగంతో జుట్టు మరింతగా మెరుస్తూ, పొడవు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గంజిలో బి–విటమిన్, ఇ–విటమిన్తోపాటు ఐనోసైటోల్, నియాసినమైడ్ వంటి కీలకమైన అమ్లాలు ఉంటాయి. ఇవన్నీ జుట్టు పోషణకు ఎంతో మేలుచేకూరుస్తాయి. పాడైన జుట్టును రిపేర్ చేయడంలో ఐనోసైటోల్, నియాసినమైడ్లు కీలకపాత్ర పోషిస్తాయి. శతాబ్దాలుగా వినియోగం గంజితోపాటు చాలా సేపు బియ్యాన్ని నానబెట్టడం ద్వారా వచ్చే నీరు కూడా జుట్టుకు ఎంతో మేలుచేస్తుంది. బియ్యాన్ని ఉడకబెట్టాక గిన్నెలోకి వొంపే గంజిలో అత్యావశ్యకమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కొంతమేర అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఈ గంజిని జుట్టుకు పట్టిస్తే కేశనాళికలు బలంగా మారతాయి. అమైనో యాసిడ్లు, ప్రోటీన్ల కారణంగా జుట్టు బలంగా తయారవుతుంది. జుట్టు పట్టులాగా మృదువుగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది. వెంట్రుక మందం సైతం పెరుగుతుంది.గంజిలో ఉండే ఐనోసైటోల్ అనే కార్బోహైడ్రేడ్ ఇందుకు చాలా దోహదంచేస్తుంది. ఐనోసైటోల్ కారణంగా కేశాలు మరింత దృఢంగా మారతాయి. కేశాల మరమ్మతు, పెరుగుదలకు ఐనోసైటోల్ బాగా పనికొస్తుంది. గంజిలోని సిసీŠట్న్, మిథియోనైన్లు జుట్టును బలంగాచేస్తాయి. దాంతో జుట్టు అంత త్వరగా కొనలు విరిగిపోవు. చిట్లిపోవడం వంటి సమస్యలు బాగా తగ్గుతాయి. ఆరోగ్యవంతమైన, అందమైన జుట్టుకు ఈ అమైనా యాసిడ్లు భరోసా ఇస్తాయి. ప్రాచీన జపాన్లోనూ మహిళలు గంజిని విరివిగా ఉపయోగించారని తెలుస్తోంది.చైనాలోని హువాంగ్లూ గ్రామంలో యావో మహిళల జుట్టు పొడవుగా, బలంగా, అందంగా ఉంటుంది. గంజితో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్లే తమ కేశాలు ఇలా ఆరోగ్యంగా ఉన్నాయని వాళ్లు చెప్పారు. గంజిలోని గొప్పదనాన్ని ఇప్పటికే కనిపెట్టిన కొన్ని బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తులను గంజి ఆధారంగా తయారుచేసి మార్కెట్లోకి తెస్తున్నాయి. హెయిర్ మాస్్కలు, కండీషనర్లు ఇలా కేశ సంబంధ ఉత్పత్తుల్లో ఇప్పుడు ప్రధాన సరుకు గంజే. గంజిని ఎలా వాడాలి? రోజూ వంటలోకి వండుకున్నట్లే బియ్యాన్ని ఏమాత్రం దుమ్ము, ధూళి, మట్టిలేకుండా చక్కగా జల్లెడ పట్టుకున్నాక నీళ్లుపోసి బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. చిక్కని గంజిని తర్వాత గిన్నెలోకి ఒంపుకోవాలి. ఈ గంజిని వెంటనే జుట్టుకు పట్టించకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద కనీసం 24 నుంచి 48 గంటలపాటు అలాగే పాత్రలోనే ఉంచాలి. పాత్రపై మూత బదులు వస్త్రంతో కప్పి కొనల వెంట రబ్బర్తో చుట్టాలి. ఇలా ఒకటి, రెండు రోజులు పులియబెట్టాక నేరుగా జుట్టుకు పట్టించండి. నెమ్మదిగా కుదుళ్ల వద్ద మసాజ్ చేయండి.దీంతో గంజి జుట్టుకు సమంగా అంటుకుంటుంది. రక్తప్రసరణ సైతం సరిగా అవుతుంది. తలస్నానం చేశాక కూడా జుట్టు ఆరిన తర్వాత ఇలా గంజి పట్టించవచ్చు. ఒక 20 లేదా 30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో జుట్టు కడుక్కుంటే సరిపోతుంది. వారానికి కనీసం రెండు సార్లు ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అతిగా వాడితే మాత్రం దురద వంటి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటప్పుడు వైద్యుల సలహాతో ఈ చిట్కాను కొనసాగించవచ్చు. -
జుట్టు మృదువుగా నిగనిగలాడలంటే గంజితో ఇలా చేయండి!
జుట్టు ఆరోగ్యం కోసం ఎన్నో క్రీమ్లు, కండిషనర్లు వాడి ఉంటారు. వాటన్నిటికంటే బట్టటకు పెట్టే గంజి బెటర్. ఇదేంటి గంజినా అనుకోకండి. ఎందుకుంటే బియ్యం వార్చిన గంజితో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే.. ఈ గంజిని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంటాయి. ఈ గంజినీరు జుట్టు కుదుళ్లను బలంగా పెరిగేలా చేస్తుంది. అలాగే మృదువుగా మెరిసేలా చేయడంలో గంజినీరుకి మించిది మరొకటి లేదని చెబుతున్నారు నిపుణులు. ఇది మంచి కండిషనింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా పొడి జుట్టువారికి ఈ గంజి నీటిని రోజూ తలపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు కూడా స్ట్రాంగ్గా మారుతుంది. ఈ గంజి జుట్టుకి సహజమైన షైనింగ్ని, మృదుత్వాన్ని అందిస్తుంది. ఈ గంజినీటికి మెంతికూర, అలోవెర జోడించి, పులియబెట్టి అప్లై చేస్తే జుట్ట చివర్ల చిట్లిపోవడం వంటి సమస్యలు ఉండవు. ఇది వెంట్రుకలు నెరసిపోవడాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే ఇనోసిటాల్ జుట్టుని మృదువుగా మార్చే గుణం ఉటుంది. ఫలితంగా జుట్టు మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
ఘోరం.. కళ్ల ముందే మరిగే జావలో పడిన వ్యక్తి
వైరల్: అంతా చూస్తుండగా కళ్ల ముందు ఘోరం జరిగింది. పొయ్యి మీద వేడి వేడి జావ మరుగుతుండగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయాడు. అది చూసి చుట్టుపక్కల వాళ్లు రక్షించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ మరిగే జావ నుంచి అతను బయటపడగలిగాడు. కానీ.. కడకు ఈ ఘటన విషాదంగా ముగిసింది. తమిళనాడు మధురైలో జులై 29న ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఇవాళ(మంగళవారం) బాధితుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ ఘటన.. ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళనాడులో ‘ఆడి వెల్లి’ జాతర సందర్భంగా అమ్మవారి గౌరవార్థం జావను వండి.. ప్రజలకు పంచుతారు. గత శుక్రవారం మధురై పలగనాథంలో ముత్తు మారియమ్మ ఆలయం సమీపంలో భక్తులు కొందరు ఇళ్ల ముందరే మీదే పెద్ద పెద్ద వంట పాత్రల్లో జావను మరిగిస్తున్నారు. ఆ సమయంలో ముత్తుకుమార్ అనే ఓ వ్యక్తి మైకంతో అక్కడికి వచ్చాడు(తాగి ఉన్నాడని స్థానికులు చెప్తున్నారు). తూలిపోతూనే ఆ గంజులో పడిపోయాడు. అతను పడిపోయే టైంలోనే చూసి కొందరు అరుస్తూ అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. జావ వేడిగా ఉన్నా.. ముత్తుకుమార్ మైకంలో ఉండిపోయిన ముత్తుకుమార్ కదలకుండా అలాగే ఉండిపోయాడు. చివరికి తమ వల్ల కాకపోవడంతో స్థానికులు జావ గంజునే బోర్లించారు. కాలిన గాయాలతో పైకి లేచిన ముత్తుకుమార్ను స్థానికులు రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 65 శాతం గాయాలతో చికిత్స పొందుతూ మంగళవారం అతను మృతి చెందాడు. video disclaimer: ఈ వీడియో ఘటనకు సంబంధించింది.. కొందరికి ఇబ్బందికరంగా అనిపించొచ్చు -
గంజి అన్నంతోనే గడిపాను...
న్యూఢిల్లీ: పోషక విలువల్లేని ఆహారం వల్లే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ (1984)లో పతకం కోల్పోయానని పరుగుల రాణి పీటీ ఉష చెప్పారు. అక్కడి క్రీడా గ్రామంలోని స్థానిక వంటకాలు రుచించక గంజి అన్నం, పచ్చడి తినాల్సివచ్చిందని... ఇది తన ప్రదర్శనపై, చివరకు పతకంపై ప్రభావం చూపిందని గతానుభవాన్ని దిగ్గజ అథ్లెట్ వివరించింది. అప్పట్లో భారత క్రీడాకారులకు అంతంత మాత్రం క్రీడాపరికరాలు, సదుపాయాలు అందుబాటులో ఉండేవని చెప్పారు. విదేశీ క్రీడాకారులు అన్ని హంగులతో, ఆధునిక కిట్లతో కనిపిస్తుంటే తమకు విచారంగా ఉండేదన్నారు. ‘ఏం చేస్తాం! ఒక్క రోజైన అలాంటి కిట్లతో బరిలోకి దిగితే అదే మహాభాగ్యమనిపించేది అప్పుడు. అక్కడి ఆహారం గురించి మాకెలాంటి సమాచారం లేదు. కేవలం స్థానిక పదార్థాల్నే (లాస్ ఏంజిల్స్) వండి వార్చేవారు. బేక్ చేసిన ఆలుగడ్డలు, సోయా సాస్తో సగం ఉడికించిన చికెన్ మాకు ఏమాత్రం రుచించలేదు. దీంతో నేను గంజి అన్నం, పచ్చడితో సరిపెట్టుకున్నా. అది అథ్లెట్లు తీసుకునే భోజనం కానేకాదు. అందులో ఎలాంటి పోషకాలు ఉండవు. కానీ నాకు తప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తిన్నా. అలాగే 400 మీ. హర్డిల్స్ బరిలోకి దిగాను. సెకనులో వందో వంతు తేడాతో కాంస్యాన్ని కోల్పోయాను’ అని ఉష ఆనాటి సంగతుల్ని వివరించారు. -
గంజి అమృతమే!
రంజాన్ మాసంలో ముస్లింలు నియమనిష్టలతో ఉపవాసం ఉంటారు. సాయంత్రం పండ్లు, అల్పాహారంతో దీక్ష విరమిస్తారు. పగలంతా ఎంతో నిష్టతో ఉపవాసం ఉండడం వల్ల శక్తికోసం రాత్రి గంజి సేవిస్తారు. బలవర్థక ఆహారంగా పేరొందిన గంజి వంటకం ఉపవాసదీక్ష చేస్తున్న వారి శరీరాన్ని చల్లబరుస్తుంది. పేద ముస్లింల పాలిట గంజి సంజీవనిగా పేరు గాంచింది. మదనపల్లె సిటీః రంజాన్ నెలలోనే తయారుచేసే గంజికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లోని మసీదుల వద్ద గంజి పంపిణీ చేస్తున్నారు. ఇఫ్తార్ సమయంలో పండ్లు, అల్పాహారం లేకపోయినా.. ఒక గిన్నె గంజి అయినా తాగేందుకు ఇష్టపడుతారు. రవ్వ, మసాలా దినుసులతో ప్రత్యేకంగా తయారు చేసే గంజిలో బూందీ కలుపుకుంటే రుచిగా ఉంటుంది. సాయంత్రం అసర్ సమాజ్ అయిన తరువాత మసీదుల వద్ద గంజి పంపిణీ చేస్తారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గంజి కోసం బారులు తీరుతారు. మసీదు పరిధిలోని ముస్లిం జనాభాను బట్టి రోజుకు రూ.5,000 నుంచి 15 వేల వరకు గంజి తయారీ కోసం ఖర్చు చేస్తారు. కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆ రోజుకు గంజి తయారీకి అయ్యే ఖర్చు భరిస్తారు. లేదంటే గంజి తయారీ పదార్థాలను ఉచితంగా పంపిణీ చేస్తారు. గంజి తయారీ ఇలా.. బియ్యపు రవ్వ, అల్లం, యాలాకులు, దాల్చినచెక్క, టమటా, కొత్తిమీర, పుదీనా వేసి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ముందుగా మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి, టమటాలను నూనెలో వేయిస్తారు. వంట పాత్రలో నీళ్లు పోసి బాగా మరిగిన నీటిలో బియ్యపు రవ్వను కలుపుతారు. ఇలా గంజిని తయారుచేసి, పూర్తయ్యాక కొద్ది సేపు వంట పాత్రలోకి ఉంచి పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం నుంచి గంజి తయారీని ప్రారంభిస్తే సాయంత్రానికి పూర్తవుతుంది. 30 ఏళ్లుగా గంజి పంపిణీ మదనపల్లె పట్టణం జామియా మసీదు వద్ద కమిటీ నిర్వాహకులు 30 ఏళ్లుగా రంజాన్ మాసంలో ఉపవాసదీక్షపరులకు ఉచితంగా గంజి పంపిణీ చేస్తున్నారు. సాయంత్రం కాగానే మసీదు వద్ద ఘుమఘుమలతో సిద్ధమవుతుంది. దీని తయారీకి ప్రత్యేకంగా వంట వారిని ఏర్పాటుచేశారు. దాతల సహకారంతో ప్రతిరోజూ దాదాపు 10 వేల మందికిపైగా గంజి అందజేస్తున్నారు. ఉపవాసదీక్షపరుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన గంజిని కుల, మతాలకు అతీతంగా ఇష్టపడతారు.