Permanent solution
-
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను తయారు చేశామన్నారు.ఈ పోర్టల్ను ఈనెల 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి భూ వివాదాల పరిష్కారానికి తొలి అడుగు వేయబోతున్నామని వెల్లడించారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు చేర్పులు చేసి భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేరళం పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి బుధవారం.. ఈ పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను రైతు కోణంలో రూపొందించామని సామాన్య ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 2 నుంచి ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయా జిల్లా కలెక్టర్లు పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.గతంలో మాదిరిగా రైతులు తమ భూ సేవల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లవలసిన పనిలేకుండా తన ఇంటి నుంచే భూ సేవలు పొందే విధంగా పోర్టల్ను రూపొందించామని అన్నారు. రైతులు తమ భూమి హద్దులు తేల్చాలని సర్వే అధికారుల చుట్టూ తిరిగేవారని.. ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే భూభారతి పోర్టల్ ద్వారా పొందవచ్చన్నారు. రైతు లాగిన్ అయిన వెంటనే తనకు ఉన్న భూమి వివరాలు కనిపిస్తాయి. ఎన్నిఎకరాలకు సర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు ఎంతచెల్లించాలో కనిపిస్తుంది.ఫీజు చెల్లించిన తర్వాత ఆ వివరాలు ఆ గ్రామంలో ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్ లాగిన్కు వెళుతుంది. ఆతర్వాత రెండు రోజల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తారు. తర్వాత ఏడు రోజుల్లోపు సర్వే తేదీని సదరు లైసెన్స్డ్ సర్వేయర్ ఖరారు చేయడమేగాక సర్వేకూడా రోవర్లతో పూర్తి చేస్తారు. దీనిని సిస్టమ్లో నమోదు చేశాక అది మండల సర్వేయర్ స్య్రూటినీకి వెళుతుంది.ఆపై మండల తహశీల్దార్ ఆమోదం పొందాక దరఖాస్తుదారైన రైతుకు ఎల్పిఎమ్, భూధార్ నెంబర్ల కేటాయింపు జరుగుతుంది. ఈ వివరాలు భూభారతి పోర్టల్లో కూడా నిక్షిప్తమవుతాయి. సర్వే పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్ ను జనరేట్ చేసి భూభారతి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేవరకు ప్రతి దశలో పౌరుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఎస్ ఎమ్ ఎస్ అలర్ట్స్ పంపిస్తారు. భూభారతి చట్టంలో పేర్కొన్నవిధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామని ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్ ( ఎల్పిఎమ్) యూనిక్ నెంబరు, అదేవిధంగా ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్ను కూడా ఇస్తామని వెల్లడించారు.ఈ ఐదు మండలాల్లో రైతులు దరఖాస్తు చేసుకున్నతర్వాత సర్వే నిర్వహించడానికి అవసరమైన సర్వేయర్లను అందుబాటులో ఉంచామని అలాగే గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే నిర్వహిస్తామని తెలిపారు. దీనివల్ల సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుందని, కచ్చితమైన సర్వే వివరాలు వస్తాయని తెలిపారు.భూ సమస్యలు రైతు జీవితంలో పెద్ద అడ్డంకిగా మారాయని వాటికి శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ఒక కీలకమైన ముందడుగు అని రైతు ఇంటి నుంచే అన్నిసేవలు పొందేలా పారదర్శక వ్యవస్ధను తీసుకువస్తున్నామని ఇది రెవెన్యూ వ్యవస్ధలో చారిత్రాత్మక మార్పునకు నాంది అవుతుందని మంత్రి పొంగులేటి అన్నారు. -
గుడ్న్యూస్.. ఈ ప్రొటీన్తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..!
Permanent Solution To The Problem Of Baldness: అద్దం ముంచు నిలబడి నున్నని బట్టతలను నిమురుకుంటూ.. ఫ్చ్.. దీనికి విరుగుడే లేదా (విగ్గుకాకుండా)? అని ఒక్కసారైనా అనుకోనివారుండరేమో..!అలాంటివారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్! మన శరీరంలో ఒక ప్రొటీన్ స్థాయిలను పెంచడం ద్వారా బట్టతల సమస్యకు శాశ్వతంగా గుడ్బై చెప్పొచ్చని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పుడిది సాధ్యమే అని చెబుతోంది కూడా. బట్టతలతో ఎన్నో సమస్యలు తలపై నిండుగా కనిపించే ఒత్తైన జుట్టు మగవాళ్లందరూ కోరుకుంటారు. కానీ నియంత్రణలేకుండా ఊడే జుట్టువారిలో ఇది తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తుంది. అందులోనూ వయసులో ఉన్నప్పుడే బట్టతల వస్తే జాబ్ ఇంటర్వ్యూలు, పెళ్లి సంబంధాల విషయాల్లో వీరికి ఇబ్బందులు మరీ ఎక్కువ. జుట్టురాలే సమస్యతోపాటు అనేక ఒత్తిడ్లవల్ల శరీరంలో కార్టిజాల్ హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్) పెరుగుదలకు కారణమౌతుంది. ఫలితంగా తలలోని మాడు భాగానికి, వెంట్రుకల కుదుళ్లకు చెప్పలేని నష్టాన్ని కలిగిస్తుంది. మగవాళ్లలో మాత్రమేకాకుండా, స్త్రీలలో కూడా ఒత్తిడి హార్మోన్ బట్టతలకు కారణమౌతుంది. ఆందోళన, కోపం, యాంగ్జైటీ వంటి స్ట్రెస్ సంబంధిత ప్రతిచర్యలు బట్టతలకి కారణమౌతాయని పరిశోధకులు చెబుతున్నదే. ఈ ప్రొటీన్తో బట్టతలకు శాశ్వత పరిష్కారం ఐతే హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నేచర్ మ్యాగజైన్లో తాజాగా ప్రచురించిన కథనం ప్రకారం.. ‘GAS6’ అనే ప్రొటీన్ జుట్టు పెరుగుదలను ప్రొత్సహించి, బట్టతలపై వెంట్రుకల పునరుత్పత్తికి సహాయపడుతుందని, బట్టతలకు శాశ్వత పరిష్కారం చూపగలుగుతుందని పేర్కొంది. జుట్టు ఊడిన ప్రదేశంలో కుదుళ్ల నుంచి కొత్త వెంట్రుకలు తిరిగి పెరగడానికి ఈ ప్రోటీన్ సహాయపడుతుందని చెబుతున్నారు. చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. ఆ హార్మోన్ వల్లనే జుట్టు రాలుతుంది.. ఎలుకల్లో అడ్రినల్ గ్రంథులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం ద్వారా మూడు రెట్లు ఎక్కువగా వెంట్రుకలు పెరిగినట్లు వీరి పరిశోధనల్లో తేలింది. మూత్రపిండాల పైన ఉండే అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్కు సమానమైన కార్టికోస్టెరాన్ అనే ఒత్తిడి హార్మోన్ను విడుదల చేస్తాయి. ఈ ఒత్తిడి హార్మోన్ ఎలుకల్లో పెరుగుదలను అణిచివేశాయని, ఈ హర్మోన్ను నియంత్రిస్తే హెయిర్ ఫోలిసిల్ స్టెమ్ సెల్ (హెచ్ఎఫ్సీ) యాక్టివేట్ అయ్యి కొత్త జుట్టు పెరగడానికి కారణమౌతుందని నివేదికలో తెల్పింది. దీంతో మొదటిసారిగా జుట్టు రాలడానికి గల కారణాలను శాస్త్రీయ ఆధారాలతో గుర్తించి, దానిని ఎలా తిప్పికొట్టాలో కూడా ఈ అధ్యయనాలు తెల్పాయి. మళ్లీ ఈ విధంగా జుట్టు పెరుగుతుంది బట్టతల వ్యక్తుల్లో స్థబ్దంగా విశ్రాంతి స్థితిలో ఉండే హెయిర్ ఫోలికల్ మూలకణాలను ప్రోత్సహించడానికి GAS6 ప్రొటీన్ ఉపయోగపడుతుంది. ఎలుకల్లో ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ మనుషుల్లో దీని పనితీరుపై మరిన్ని అధ్యయనాలు చేయాల్సిఉందని పరిశోధన బృంధం తెల్పింది. వీరి ప్రయోగాలు ఫలిస్తే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి బట్టతల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పవచ్చు. చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే.. -
‘బీసీ రిజర్వేషన్లపై శాశ్వత పరిష్కారం కావాలి’
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై శాశ్వత పరిష్కారం చూపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, సంఘం ప్రతినిధులు గుజ్జకృష్ణ, జైపాల్, రాజ్ కిరణ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తేనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు దాటొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపిందని, ఈ సందర్భంలో సుప్రీంకోర్టు నుంచి స్టే కోసం కాకుండా శాశ్వతంగా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. -
తాగునీటి గోసకు గోదావరి గుళిక
గజ్వేల్: గజ్వేల్ నగర పంచాయతీ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే గోదావరి జలాలను పథకాన్ని రూపొందిస్తున్నారు. రూ.70.52 కోట్లతో ఇప్పటికే అంచనాలు సిద్ధం చేశారు. ఎన్సీపీఈ (నేషనల్ కన్సల్టెన్సీ ఫర్ ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్) ఆధ్వర్యంలో తయారు చేసిన ఈ ప్రతిపాదనలను స్థానిక నగర పంచాయతీ అధికారులు ప్రజారోగ్య శాఖ సీఈ (చీఫ్ ఇంజినీర్) పరిశీలనకు పంపారు. కొద్దిరోజుల్లోనే ఈ ప్రతిపాదనలు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆమోదానికి వెళ్లనున్నాయి. సీఎం ఆదేశాలతో అంచనాలు సిద్ధం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు అధికారులు తొలుత సింగూర్ నుంచి పైప్లైన్ ద్వారా ఇక్కడికి నీటిని తీసుకురావాలని భావించారు. ఇందుకోసం రూ.150 నుంచి రూ. 200 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. అయితే సింగూర్ నుంచి పైప్లైన్ ద్వారా నీరు తేవడం వ్యయభారమే కాకుండా, ఈ పథకాన్ని నిరంతరంగా నడపటానికి కోట్ల రూపాయల కరెంట్ బిల్లులను భరించాల్సి వస్తుందని అధికారులు గుర్తించారు. దీంతో సింగూర్కు నీటికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంతంనుంచి జంట నగరవాసుల దాహార్తిని తీర్చడానికి పైప్లైన్ ద్వారా పరుగులు పెట్టడానికి సిద్ధమవుతున్న ‘గోదావరి సుజల స్రవంతి’ పథకాన్ని ట్యాప్ చేస్తే సమస్య పరిష్కారమవుతుందని ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లడం...ఫలితంగా సీఎం నుంచి ఆదేశాలు వెలువడటంతో పథకానికి అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. నిత్యం 40 లక్షల లీటర్ల నీటిని నగర పంచాయతీకి ఈ పైప్లైన్ ద్వారా తీసుకురానున్నారు. తొలుత షామీర్పేట ప్రాంతంలో గోదావరి సుజల స్రవంతి పైప్లైన్ను ట్యాప్ చేయాలని భావించారు. కానీ తిరిగి నగర పంచాయతీ పరిధిలోని లింగారెడ్డిపేట వద్ద ఉన్న పైప్లైన్ను ట్యాప్ చేస్తే సరిపోతుందనే నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం లింగారెడ్డిపేట పైప్లైన్ ట్యాపింగ్తోపాటు నగర పంచాయతీలోని నాలుగుచోట్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం, పైప్లైన్ విస్తరణ, భూములు సేకరణ తదితర పనుల కోసం రూ.70.52 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలను కొన్ని రోజుల కిందట ప్రజారోగ్య శాఖ సీఈ పరిశీలనకు పంపారు. పరిశీలన పూర్తికాగానే కేంద్రపట్టణాభివృద్ధి శాఖ ఆమోదానికి పంపి నిధులు రాబట్టనున్నారు. ఈ విషయాన్ని స్థానిక నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కమిషనర్ సంతోష్కుమార్లు ధృవీకరించారు.


