breaking news
The patient
-
మీ ఎనస్తీషియా డాక్టర్ గురించి తెలుసుకోండి...
అనస్తీషియా... ఆందోళన వద్దు! అనాదిగా మానవాళికి నొప్పి అంటే భయం. దాన్ని బలమైన శత్రువుగా పరిగణిస్తున్నారు. దశాబ్దాలుగా నొప్పిపై మానవుల శాస్త్రీయ పోరాటం సాగుతోంది. ఏదైనా ఆపరేషన్ పూర్తి విజయవంతం కావడానికి ఎనస్తీషియా వైద్యుల (మత్తు డాక్టర్ల) పాత్ర ఎంతో ముఖ్యం. ఆపరేషన్ చేస్తున్నప్పుడు రోగి అన్ని అవయవాల తీరు, గుండె, రక్తప్రసరణ, మెదడు, శ్వాస, మూత్రపిండాలు మొదలైన వాటిని పూర్తిగా నియంత్రించి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం నొప్పి కలగనివ్వకూడదు. ఆపరేషన్ అయ్యాక రోగికి సాధారణ స్థితికి వచ్చేవరకు జాగ్రత్తగా చూసుకోవడం ఎనస్తీషియా వైద్యుని ముఖ్య కర్తవ్యం. కొద్దిగా చరిత్రలోకి వెళితే నొప్పి అనేది భగవంతుని శిక్ష అనీ, దాన్ని తప్పించకూడదనే భావన ఉండేది. అలా నొప్పిని తగ్గించడం దానిని తొలగించడం పాపం అని క్రీస్తుపూర్వం నమ్మేవారు. క్రీ.శ. తొలి దశాబ్దంలో మాండ్రగోరా (కఊఈఖఅఎైఖఅ) అనే మొక్క రసంతో నొప్పి తగ్గించేవారు. 1721లో బెయిలీ (ఆఅఐఔఉ్గ) ఇంగ్లీష్ డిక్షనరీలో ఎనస్తీషియాను స్పర్శజ్ఞాన లోపం (అ ఛ్ఛీజ్ఛఛ్టి జీ ట్ఛట్చ్టజీౌ) గా వర్ణించారు. ఈజిప్షియన్లు మార్ఫిన్ (కౌటఞజిజ్ఛీ) అనే రసాయనాన్ని రోగికి తాగించి చిన్న శస్త్ర చికిత్సలు నిర్వహించేవారు. 1846, అక్టోబర్ 16న మెసచుసెట్స్ జనరల్ హాస్పటల్, బోస్టన్లో అతిరథ వైద్యులు తొలిసారిగా చరిత్రలో ఈథర్ అనే ఎనస్తీషియా మందును రోగికి ఉపయోగించి దవడలో కంతిని తొలగించారు. శస్త్రచికిత్స తరువాత రోగి తనకు ఏ మాత్రం నొప్పి కలగలేదని చెప్పడంతో వైద్య రంగంలోనే పెనుమార్పు వచ్చింది. జాన్ స్నో అనే నిపుణడిని ఫాదర్ ఆఫ్ అనస్థీషియా గా గుర్తించారు. ఆయన క్లోరోఫామ్ పై పరిశోధనలు చేసి వాటిని గ్రంథస్థం చేశారు. ఇంగ్లాండ్ (క్వీన్ విక్టోరియాలో) 1853 సం॥ ప్రసవ సమయంలో క్లోరోఫోమ్ను ఉపయోగించి నొప్పిలేకుండా సుఖప్రసవం అయ్యేలా చేశారు. అప్పట్నుంచి ఎనస్తీషియా మందుల శాస్త్రీయ పరిశోధనలతో ఎనస్తీషియా వైద్యుల శస్త్రచికిత్సల ప్రమాణాలు పెరుగుతూ వస్తున్నాయి. తొలిసారిగా గొంతులో గొట్టం ద్వారా ఎనస్తీషియా ఇవ్వడంతో పాటు కొన్ని మందులు కనిపెట్టి వాడకంలోకి తేవడం ద్వారా ఎనస్తీషియా శాస్త్రం పురోగమించింది. ఆధునిక వైద్యంలో... ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో శస్త్రచికిత్సల్లో హాని లేకుండా ఎనస్తీషియా ప్రక్రియ సాగుతోంది. కొన్ని కఠినమైన శస్త్రచికిత్సలలో సైతం ఎనస్తీషియా శాస్త్ర నిపుణులు ఎంతో ప్రగతి సాధించారు. ఎనస్తీషియా ఇచ్చి అన్ని జాగ్రత్తలతో తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు కూడా విజయవంతంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అవయవదానం, గుండె, మెదడుకు సంబంధించిన అతి సున్నితమైన భాగాల్లో కూడా ఎనస్తీషియా ఇచ్చి శస్త్రచికిత్స చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత కూడా... కేవలం శస్త్రచికిత్స జరుగుతున్నపుడు మాత్రమే కాకుండా ఆపరేషన్ తరువాత కూడా పూర్తి నొప్పి లేకుండా ఎనస్తీషియా వైద్యులు చూస్తారు. దాని కోసం కొన్ని మందులు, డ్రగ్ప్యాచెస్, నర్వ్ బ్లాక్ లాంటి మందులు వాడతారు. అవి పూర్తిగా సురక్షితం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో... అతి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రోగులు, రోడ్డు ప్రమాదాలలో తీవ్రంగా దెబ్బతిన్నవారికి, అత్యవసర చికిత్స పొందే సమయంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ల్లో ఎనస్తీషియా వైద్యులు బాగా కృషి చేస్తారు. వారికి మందుల మీద పూర్తి అవగాహన ఉంటుంది. వెంటిలేటర్ ఉపయోగించడంలో నైపుణ్యం ఉంటుంది. ప్రసవాలు కూడా హాయిగా... సాధారణంగా ప్రసవం చాలా నొప్పితో ఉంటుంది. ప్రసవవేదనను అనే మాట ఆవిర్భావానికి ఆ నొప్పే కారణం. అయితే అలాంటి నొప్పి ఏదీ లేకుండానే ఇప్పుడు చిరునవ్వుతో హాయిగా ప్రసవించి బిడ్డను స్వాగతించే పరిజ్ఞానం ఉంది. దీన్ని ఎపిడ్యూరల్ అనస్థీషియా అంటారు. దీనివల్ల తల్లికీ, బిడ్డకూ ఎలాంటి హానీ ఉండదు. ఎనస్తీషియా అపోహలు ఎనస్తీషియా వల్ల చాలా హాని ఉంటుందని కొంతమందిలో అపోహలు ఉన్నాయి. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. నడుముకి ఇచ్చే ఇంజక్షన్ వల్ల ఆ తర్వాతి కాలంలో నడుమునొప్పి వస్తుందనీ, ఆ తర్వాత ఆ తరహా అనస్థీషియా తీసుకున్న వారు ఏ పనీ చేయలేరన్నది కూడా కేవలం అపోహ మాత్రమే. ఇవీ సూచనలు... దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, గుండెవ్యాధులు, ఆస్తమా ఉన్నవారు తమ వివరాలను ఆపరేషన్కు ముందే వివరంగా డాక్టర్కు చెప్పాలి. ప్రస్తుతం వాడుతున్న మందుల వివరాలు ఎనస్తీషియా డాక్టర్కు తెలపాలి. పాత వైద్యపరీక్షల రిపోర్టులు తీసుకొని వెళ్లాలి. రొంప, దగ్గు ఉన్నపుడు పూర్తి ఎనస్తీషియా (ఎ్ఛ్ఛట్చ ్చ్చ్ఛట్టజ్ఛిటజ్చీ)లో ఇబ్బంది రావచ్చు. అప్పుడు ఎనస్తీషియా డాక్టర్ సలహా తీసుకోవాలి. మీ నోటిలో పళ్లు వదులుగా ఉన్నా, కట్టుడుపళ్లు ఉన్నా ఎనస్తీషియా వైద్యులుకు తెలియజేయాలి. మందులు పడకపోవడం, డ్రగ్ రియాక్షన్, డస్ట్ అలర్జీ ఉంటే చెప్పాలి. ఆపరేషన్ ముందు పొట్ట ఖాళీగా ఉండాలి. ద్రవ పదార్థాలను ఆపరేషన్కు 2 గంటల ముందు ఆపేయాలి. ఘన పదార్థములు 5 గంటల ముందే ఆపేయాలి. ప్రతిరోజూ ఎందరో రోగులకు ఎనస్తీషియా ఇస్తుంటారు. ఇదేమీ అపాయకరం కాదనే అవగాహన అందరిలో రావాలి. డాక్టర్ వేణుగోపాల్ ఎన్. అనస్తీషియాలజిస్ట్ ఫ్యాకల్టీ, జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్, రాజమండ్రి టాన్సిల్స్ అంటే తొలగించాల్సిందేనా! ఇఎన్టి కౌన్సెలింగ్ మా పాప వయసు 8 ఏళ్లు. పాపకు గొంతుభాగంలో నొప్పి కారణంగా డాక్టర్ను కలిశాం. టాన్సిల్స్ అన్నారు. చిన్నపిల్లల్లో తరచూ వినిపించే ఈ టాన్సిల్స్ గురించి వివరించండి. - చంద్రకళ, కోదాడ ప్రతి ఒక్కరి గొంతులో కొండనాలుకకు ఇరువైపులా టాన్సిల్స్ ఉంటాయి. ఇవి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల పెద్దవి అవుతాయి. అప్పుడు సమస్యలు తలెత్తుతాయి. గొంతు నొప్పి పెట్టడం, మింగడానికి ఇబ్బందిగా ఉండటం, తరచూ జ్వరం, ఎదుగుదల లేకపోవడం లాంటి సమస్య వస్తాయి. మీ పాపకు టాన్సిల్స్ సమస్య వచ్చిందనగానే వాటిని తొలగించాల్సిన అవసరం లేదు. అయితే అవి ఆరునెలలకు పైగా ఉన్నా, ఆర్నెల్లలో 4-5 సార్లు ఇబ్బందిగా మారినా శస్త్రచికిత్స చేయించుకోవాలి. మా బాబు వయసు 10 ఏళ్లు. వాడికి చెవి నొప్పి, చెవి నుంచి చీము కారడం జరుగుతోంది. అసలు చిన్నపిల్లల్లో ప్రధానమైన చెవి సమస్యలు ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి? - నివేదిత, యడ్లపాడు ఈ కింద పేర్కొన్నవి పిల్లల్లో కనిపించే సాధారణ చెవి సమస్యలు... పుట్టుకతో చెవులు వినిపించకపోవడం (వినికిడి శక్తి లేకపోవడం) ఏదైనా అలికిడి జరిగినా పిల్లలు వాటిని గుర్తించకపోవడం చెవిలో గువిలి (వాక్స్) ఉండటం చెవిపోటు చెవి నుంచి చీము కారడం చెవి నుంచి చీముకు ప్రధాన కారణం మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చి కర్ణభేరికి రంధ్రం పడటం. పిల్లలు తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు చెవిలోకి నీరు పోనివ్వకుండా చూసుకోవాలి. పుల్లలు, ఏవైనా గుచ్చుకునే (షార్ప్) వస్తువులు చెవిలో పెట్టుకోకూడదు. పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే ఈఎన్టీ వైద్య నిపుణుల సలహా మేరకు వారు సూచించిన మందులు వాడాలి. డాక్టర్ సత్యకిరణ్ అవ్వారు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, రోడ్ నెం. 12 బంజారాహిల్స్, హైదరాబాద్ -
పీహెచ్సీలకు ఫీవర్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. కోట్ల రూపాయల మందులు జిల్లాకు వస్తున్నా రోగి నోట్లోకి మాత్రం ఒక్క మాత్ర పోవడం గగనంగా మారింది. జిల్లాలో మందుల కొరత లేదని వాదించే అధికారులు రోగులు ఏది అడిగితే అది రాలేదని చెబుతుండటం గమనార్హం. గత రెండు నెలలుగా జిల్లాలో విషజ్వరాలు, మలేరియా, డెంగీ విజృంభిస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ పీహెచ్సీల్లో కనీస వైద్య సౌకర్యాలను కల్పించలేకపోతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా రోగులకు అందుతున్న సేవలపై ‘సాక్షి’ బృందం సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిశీలన జరిపింది. కొన్ని చోట్ల వైద్యుల నిర్లక్ష్యం, మరికొన్ని చోట్ల మౌలిక సదుపాయాల కొరత వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని అనేక ఆస్పత్రుల్లో సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించటం లేదని వెల్లడైంది. 11 దాటితే కానీ ఆస్పత్రికి రాని సిబ్బంది సాయంత్రం మూడు గంటలు కాకముందే జిల్లా కేంద్రానికి, నియోజకవర్గ కేంద్రాలకు పయనం అవుతున్నారు. అందని మందులు జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 11 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో పీహెచ్సీకి ఒక వైద్యాధికారి ఉండాలి. జిల్లాలో కేవలం నాలుగు పీహెచ్సీలకు మాత్రమే వైద్యాధికారులు లేరని, మం దుల కొరత లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. డీఎంహెచ్ఓ ద్వారా పీహెచ్సీలకు 123 రకాల మందులు, 68 సర్జికల్ ఐటమ్స్ పం పిణీ చేస్తున్నారు. పీహెచ్సీలలో మాత్రం ఈ మందులు అందుబాటులో ఉండటం లేదు. సర్వరోగ నివారిణి తరహాలో ఎవరికి ఏ జబ్బు చేసినా వాంతులు, విరేచనాలు, జ్వరం, జలు బు వీటిలో ఏదైనా.. వ్యాధి లక్షణంతో పనిలేకుండా వారికి అందుబాటులో ఉన్నవే పంపిణీ చేస్తున్నారని వివిధ ప్రాంతాల్లో రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సూదిమందు వేయమని ప్రాధేయపడినా అదీ సాధ్యం కాదని తిప్పి పంపుతున్నట్లు చెబుతున్నారు. ఏజెన్సీలో ఏదీ సమయపాలన ఏజెన్సీలోని పీహెచ్సీల్లో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటలకే పీహెచ్సీలు తెరవాల్సి ఉండగా 10 గంటలైనా తలుపులు తెరిచే వారే లేరు. కుక్కునూరు మండలంలోని రాజీవ్నగర్ ఆస్పత్రిలో 12 గంటలే పీహెచ్సీ తెరిచి ఉంటుంది. పీహెచ్సీలో ఒకే ఒక వైద్యుడు ఉండటంతో రాత్రివేళల్లో ల్యాబ్ టెక్నిషియన్ వైద్యుడి అవతారం ఎత్తుతున్నారు. ఇద్దరు వైద్యులు భద్రాచలం నుంచి నిత్యం ప్రయాణం చేయడంతో పేదలకు వైద్యం సరిగా అందడం లేదు. తల్లాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యునితో పాటు సిబ్బంది సమయపాలన పాటించకపోవటం వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంతో ముక్కులు మూసుకొని వెళ్లాల్సి వస్తోంది. నేలకొండపల్లి పీహెచ్సీలో కూడా ఉదయం 10 గంటల వరకు కూడా వైద్యులు అడ్రస్ లేరు. అశ్వాపురంలో శిథిలావస్థలో ఉన్న బెడ్స్పైనే రోగులకు వైద్యం చేస్తున్నారు. మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సకాలంలో రావడంలేదు. గదులు సరిపోవడం లేదు. ఇరుకు గదుల్లో వైద్యులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా పడకలు లేవు.. ఉన్న పడకలు వేయడానికి గదులు లేవు. మణుగూరు, గుండాల మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అంబులెన్స్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. గుండాల పీహెచ్సీలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. పినపాక వైద్యశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు డాక్టర్లు, ఇతర సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలలకు రోగుల సంఖ్య పెరిగినా అందుకు తగిన విధంగా వసతులు కల్పించకపోవడంతో అనేక మంది ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్ఎంపీలే దిక్కు.. భద్రాచలం ఏజెన్సీలోని గ్రామాల్లో ఆర్ఎంపీలే రోగులకు పెద్దదిక్కుగా మారుతున్నారు. చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, సిబ్బంది శిథిలమైన భవనాల కిందే విధులు నిర్వహిస్తున్నారు. ఈ వైద్యశాల పరిధిలో సుమారు 40కు పైగా గ్రామాలకు చెందిన ప్రజలు వైద్యసేవలు పొందుతున్నారు. ఈ వైద్యశాలకు ఇటీవల ప్రభుత్వం పక్కా భవనాన్ని నిర్మించినా దాన్ని ప్రారంభించలేదు. ఈ పీహెచ్సీలో రోగులకు బెడ్లు లేవు. వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ముగ్గురు డాక్టర్లకు గాను కేవలం ఒక్కరు మాత్రమే పని చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల పీహెచ్సీ సిబ్బంది స్థానికంగా ఉండటం లేదు. వీరంతా భద్రాచలం నుంచి ప్రతి రోజు విధులకు హాజరవుతుండటంతో రోగులకు సకాలంలో అందుబాటులో ఉండటం లేదు. ఆసుపత్రికి వస్తున్న రోగులు తిరిగి వెళ్తున్నారు. పాల్వంచ మండల పరిధిలోని ఉల్వనూరు గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆపరేషన్ థియేటర్ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని రోగులు వాపోతున్నారు. గతంలో 24 గంటలు వైద్య పరీక్షలు నిర్వహించే ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం 12 గంటలు మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం లేదు. జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర వైద్యసేవల నిమిత్తం వచ్చిన రోగులను ప్రాణాపాయస్థితి నుంచి రక్షించేందుకు ఆక్సిజన్ అందుబాటులో ఉంచాల్సి ఉంది. కానీ ఉన్న రెండు సిలిండర్లలో ఆక్సిజన్ లేదు. ఇల్లెందు వైద్యశాలలో ఇన్వర్టర్ బ్యాటరీలు పనిచేయటం లేదు. రాత్రివేళల్లో కరెంటు పోతే అంధకారంలోనే రోగులకు వైద్యం చేయాల్సి వస్తోంది.