breaking news
Patangulu
-
నవ్యక్రాంతి.. తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి
సాధారణంగా మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాము. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాము. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాము కనుకే ప్రతి సంవత్సరం తిథులతో సంబంధం లేకుండా పుష్యమాసంలో జనవరి నెలలో 13, 14, 15, 16 తేదీలలోనే ఈ పండుగ వస్తుంది. తెలుగువారి పెద్ద పండుగలలో ఒకటైన సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాము. కనుమ మర్నాడు ముక్కనుమగా కూడా పండుగ చేస్తాము. మన సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధి పరిచే ఎన్నో అంశాలతో కూడిన పండుగ సంక్రాంతి. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ ఇది. సంక్రాంతి నాడు కొత్త అల్లుళ్ళతో బంధుమిత్రులతో ఇల్లు, మనసు ఆనందంతో కళకళలాడుతుంది. కనుమ నాడు ఇంతటి పాడి పంట ఇంటికి రావటానికి కారణమైన గోవులను, వృషభాలను అలంకరించి, పూజించి, చక్కటి దాణా వేసి, ఆనందింప జేస్తారు. ప్రతి సంక్రమణం పవిత్రమైనదే. ప్రతి సంక్రమణంలోనూ పితృ తర్పణాలివ్వాలి. విశేషంగా మకర సంక్రమణ కాలంలో మకర సంక్రమణ స్నానం చెయ్యాలి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పండుగ రోజున తప్పక పితృ తర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తుతించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు గడలు, గుమ్మడి పండు మొదలైనవి దానమివ్వాలి. ఈ కాలంలో చేసే గోదానం వల్ల స్వర్గవాసం కలుగుతుందని చెప్తారు. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే ధనుర్మాసమంతా ఆడవారు తెల్లవారుజామునే లేచి ఇళ్ళ ముందు కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బెమ్మలు పెడతారు. సంక్రాంతినాడు ఇంటి ముందు కళ్ళాపి చల్లి, అందమైన పెద్ద రంగవల్లులను తీర్చిదిద్దుతారు. వాటిమీద గొబ్బెమ్మలు పెట్టి, గుమ్మిడి పూలతో, బంతి పూలతో అలంకరించి, చుట్టూరా రేగుపళ్ళు, చెరుకు ముక్కలు వేసి, మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా, చుట్టూరా ఉన్న గొబ్బెమ్మలను ఆమె చెలికత్తెలుగా భావన చేసి, పసుపు కుంకుమలతో పూజించి, హారతిస్తారు. సంక్రాంతి రోజున గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. డోలు, సన్నాయి వాయిస్తూ ఉంటే, వాటికి అనుగుణంగా గంగిరెద్దులు నర్తిస్తాయి. ‘అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు‘, అంటుంటే గంగిరెద్దులు మోకాళ్ళ మీద కూర్చుని లేవటం, ‘డూడూ డూడూ బసవన్నా‘ అంటుంటే, తలలూపుతూ విన్యాసాలు చెయ్యటం కన్నుల పండుగగా ఉంటుంది. అందరూ గంగిరెద్దును సాక్షాత్తుగా బసవన్నగా భావించి నూతన వస్త్రాలు కప్పుతారు. సన్నాయి వాద్యకారులకు డబ్బులిస్తారు, ధాన్యాన్నిస్తారు. వృషభం ధర్మ దేవతకు ప్రతీక. ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయపాత్రను కదలకుండా పెట్టుకుని, రెండు చేతులతో చిరుతలు పట్టుకుని వాయిస్తూ, నుదుటిన తిరునామం పెట్టుకుని, కాళ్ళకు కంచు గజ్జెలు కట్టుకుని, అవి ఘల్లు ఘల్లుమంటుండగా ‘హరిలొ రంగ హరీ‘ అంటూ గానం చేస్తూ, చిందులు వేస్తూ వస్తాడు. అలాగే చిందులేస్తూ, హరినామం గానం చేస్తూ, తంబూరా మీటుతూ సాతాని జియ్యరు కూడా వస్తాడు. ప్రజలు సంతోషంగా సాక్షాత్తుగా శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. వారిరువురికీ సంభావనలిచ్చి సత్కరిస్తారు. ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు‘ అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి ఇంటింటి ముందుకు బుడబుక్కలవాళ్లు వస్తారు. ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ‘హర హర మహాదేవ‘ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమ దేవర వస్తాడు. వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిచ్చి సంభావిస్తూ మన సంస్కృతిని సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీను. సంక్రాంతికి ఆంధ్రులు తమ ఇళ్ళల్లో బొమ్మలకొలువును ఏర్పాటు చేసి, బొమ్మలకు ప్రతీకగా పరమాత్మను ప్రార్ధిస్తారు. బొమ్మలకు హారతిస్తారు, పేరంటం చేస్తారు. పిల్లలకు పప్పు బెల్లాలు, నువ్వులుండలు ఇస్తారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో కోడిపందాలు, గొర్రెపొట్టేళ్ళ పందాలు, కొన్ని ప్రాంతాల్లో జల్లెకట్టు వంటివి ఆడి ఆనందిస్తారు. పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పిల్లలు, యువకులు అత్యంత ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేసి ఆనందిస్తారు. సాధారణంగా అందరూ సంక్రాంతి పండుగకు ముందు రోజు అరిశలు, చక్కిలాలు, నువ్వులుండలు, పాలకాయలు, జంతికలు వంటివి చేస్తారు. పండుగ రోజున పరమాన్నం, బొబ్బట్లు, పులిహోర లాంటివి చేస్తారు. అన్నింటినీ దైవానికి నివేదించి, బంధువులకు, ఇంటి చుట్టుపక్కల వారికి, ఇంట్లో పనిచేసే వారికి పంచిపెడతారు. మనకు పాడిపంటలనిచ్చే గోవులను, ఎద్దులను కనుమనాడు పూజిస్తారు. పుడమి తల్లిని పూజిస్తారు. ‘కనుమనాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది’ అంటారు కనుక కనుమ నాడు గారెలు, ఆవడలు తప్పకుండా భుజిస్తారు. ఈ విధంగా పుడమికీ, ప్రకృతికీ, మానవులకూ, గోవృషభాలకూ ఉన్న సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ మన మకర సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజిక పరంగా అత్యధిక శాతం మంది జరుపుకునే గొప్ప పండుగ ‘నవ్య సంక్రాంతి పండుగ‘. పెద్ద పండగ ఎలా అయింది? సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి మారటం వలన ప్రకృతిలో కూడా ప్రతి నెల స్పష్టమైన మార్పును సంతరించుకుంటుంది. ఈ మార్పు మానవ జీవితంపైన మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ మకర రాశిలో ప్రవేశించటాన్నే ఎందుకు పెద్ద పండుగ గా జరుపుకుంటున్నాము అంటే, దానికి అనేక కారణాలున్నాయి. అప్పటి వరకు ఉన్న చలి మకర సంక్రమణంతో తగ్గుముఖం పడుతుంది. వెలుగు ఎక్కువగా ఉండే దీర్ఘమైన పగళ్ళకూ, సుందరమైన, ఆహ్లాదకరమైన వసంత కాల ఆగమనానికి నాంది కాగల ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభ మవుతుంది. దక్షిణాయనంలో పగళ్ళు తక్కువ, రాత్రిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఉత్తరాయణంలో పగళ్ళు ఎక్కువ, రాత్రిళ్ళు తక్కువ ఉంటాయి. ప్రకృతిలో ఇది గొప్ప మార్పు. ఆనందకరమైన, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని కలిగించే మార్పు. మన ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి కాలం. అందువల్ల కూడా ఉత్తరాయణం అత్యంత పవిత్రమైన కాలం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. దక్షిణాయనం సాధనా కాలం, ఉపాసనా కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి సూర్యుని రథ గమనంలో మార్పు వల్ల ఎండ వేడిమి నెమ్మదిగా పెరగటం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం ప్రారంభమవగానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఉత్తరాయణంలోనే మనం ఉపనయనాలు, వివాహాది శుభ కార్యాలను జరిపిస్తాము. కనుకే ఉత్తరాయణం ప్రారంభంలో వచ్చే మకర సంక్రమణాన్ని ‘సంక్రాంతి పండుగ‘గా జరుపుకుంటున్నాము. పెద్దలకు తర్పణలు విడుచుకునే పర్వదినం ఇది. వెలుగుకు, జ్ఞానానికి సూచకమైన ‘మకర సంక్రాంతి’ మనకు పెద్ద పండుగ. ‘సం’ అంటే ‘సమ్యక్’ – మంచి, చక్కని. ‘క్రాంతి’ అంటే మార్పు. సమ్యక్ క్రాంతి – సంక్రాంతి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే – ‘చేరటం’ అని అర్థం. మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే శ్రీ సూర్య భగవానుడు ముందున్న రాశి నుండి తరువాత రాశి లోనికి ప్రవేశించటమే సంక్రాంతి. – డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత సంస్కృత ఆచార్యులు -
పద పదవే వయ్యారి గాలిపటమా!
సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాలుబోసిపోగా పరేడ్ గ్రౌండ్ పరిసరాలు మాత్రం సందర్శకులతో కిక్కిరిసి పోయాయి. నగరంలో సంక్రాంతి సందడంతా పరేడ్ గ్రౌండ్లోనేకనిపించింది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.ఈ ఉత్సాహం.. పండుగ వాతావరణాన్ని చూసేందుకు రెండు కళ్లుచాలవంటే అతిశయోక్తి కాదు. ఈ హడావుడితో మైదానం చుట్టూ రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం మురిసిపోయింది. ఆకాశం సప్తవర్ణ శోభితమైంది. పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నగర గగనానికి కొత్తరంగులు అద్దింది. అంతర్జాతీయ పతంగుల పండుగను నగర యువత ఎంజాయ్ చేస్తోంది. అసలే పండుగ.. ఆపై వరుస సెలవులు కావడంతో సోమవారం భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. రకరకాల ఆకారాలు, రంగురంగుల పతంగులను ఎగరేస్తూ.. రాత్రి వరకు ఉత్సాహంగా గడిపారు. ఈ పండుగకోసమే వచ్చిన దేశ, విదేశాలకు చెందిన పతంగులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. గాలిలో నృత్యం చేస్తున్న టైగర్, డ్రాగన్, చింపాంజీ, గరుడ వంటి రకరకాల పతంగులు చూసేందుకు ఉత్సాహం చూపించారు. గ్రౌండ్లో ఏర్పాటుచేసిన డీజే సౌండ్స్ సందర్శకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. రిమోట్ సహాయంతో రాత్రి ఆకాశంలో ఎగురవేసిన లైటింగ్ పతంగులు ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సప్తవర్ణాల పతంగులతో పరేడ్ గ్రౌండ్ పరిసరాలు కలర్పుల్గా మారాయి. అటు నెక్లెస్ రోడ్లోనూ కుర్రకారు ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. ఇదినాలుగోసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం ఇది నాలుగోసారి. ఈసారి.. ఇండోనేసియా, థాయ్లాండ్, మలేసియా, స్వీడన్, పోలాండ్, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్, కొరియా, కాంబోడియా, పిలిప్పీన్స్ దేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. మాది గుజరాత్. వ్యక్తిగతంగా నాకు ఇది 15వ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. 45 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ ఇందులో పాల్గొంటున్నారు. – పవన్ సొలంకి, తెలంగాణ టూరిజం కైట్స్ కన్సల్టెంట్ -
రారండోయ్.. కైటెగరేద్దాం..
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఇంటి ముందు రంగురంగుల రంగవళ్లులు, గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలు, కోడి, ఎడ్ల పందాలు, భోగి మంటలు, పిండి వంటలు. వీటన్నిటికంటే పిల్లలు, పెద్దలు ఎక్కువగా ఎంజాయ్ చేసేది మాత్రం రంగురంగుల పతంగుల విన్యాసాలతోనే. పతంగుల పేరు వినగానే మనకు గుర్తొచ్చేది భాగ్యనగరమే. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా పతంగుల పండగను మాత్రం హైదరాబాద్లో అంగరంగవైభవంగా నిర్వహిస్తారనడంలో సందే హం లేదు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పండగలకు ప్రాధాన్యత పెరిగింది.నాలుగేళ్లుగా టూరిజం, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఈ సారీ 13, 14, 15 తేదీల్లో పండగను వైభవంగా నిర్వహించేందుకు ఆ శాఖలు సిద్ధమయ్యాయి. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ నెల 13న మూడు గంటలకు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలు ప్రత్యేకంగా ఆయన్ని ఆహ్వానించాయి. కైట్, స్వీట్ ఫెస్టివల్కు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. నోరూరించే తెలంగాణ వంటకాలు.. హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ను ఈసారీ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు చెందిన 100 కైట్స్ప్లేయర్స్ పతంగుల పండగలో పాల్గొననున్నారు. రంగురంగుల పతంగులతో బైసన్పోలో, పరేడ్ గ్రౌండ్స్ హరివిల్లులా మారనున్నాయి. దీనికితోడు భోజనప్రియుల కోసం రాత్రి సమయంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్కోర్టులు ఆకర్షణగా నిలవనున్నాయి. అటుకుల ఉప్మా, అరటిపండు కేక్, ఉల్లివడియాలు, కట్టెపొంగలి, స్వీట్ కార్న్ రైప్, క్యారెట్ కేకు, కొత్తమీర చట్నీ, గుమ్మడి కాయ కూర, గొంగూర పచ్చడి, పప్పు, చింతచిరుగు పప్పుతో పాటు వందలాది రాష్ట్ర వంటకాలు నగర వాసులను నోరూరించనున్నాయి. తెలంగాణ వంటకాలపై భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక సంచికను తీసుకురానున్నది. సంచికను సంక్రాంతి రోజు ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో మినీ భారత్ సంస్కృతి, సంప్రదాయాలు పరేడ్ గ్రౌండ్లో కన్పించనున్నాయి. ఇందులో తెలంగాణ కల్చర్తోపాటు ఒడిస్సి, బిహు, బెంగాళీ, కథక్, అస్సామీ, కశ్మీరీతోపాటు అన్ని రాష్ట్రాల నృత్య ప్రదర్శనలు ఆకర్షణగా నిలవనున్నాయి. టూరిజం, సాంస్కృతిక శాఖ అధికారులు గురువారం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించారు. -
సిటీకి పండుగ శోభ
సిరులు కురిపించే సంక్రాంతి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొనేందుకు గ్రేటర్ సిటీజనులు సిద్ధమయ్యారు. తీరొక్క ముగ్గులు.. వాకిళ్లలో హరివిల్లును సృష్టించగా..రంగు రంగుల పతంగులు ఆకాశంలో ఇంద్రధనుస్సును తలపించాయి. పిల్లాపాపల కేరింతలు..బంధుమిత్రుల కోలాహలం మధ్యన శుక్రవారం పండగ సంబురాలు షురూ అయ్యాయి. చలిగాలుల తీవ్రతను భోగిమంటలతో సాగదోలిన నగరవాసులు... పలు పిండివంటలతో విందుభోజనాలు చేసేందుకు..ఆనందంగా మరో రెండు రోజులపాటు పండగ సంబరాలు జరుపుకొనేందుకు రెడీ అయ్యారు. మెజార్టీ సిటీజనులు పల్లెబాట పట్టగా..నగరంలో ఉన్నవారు కూడా పల్లెలకు తీసిపోకుండా పండగ జరిపేందుకు ఏర్పాట్లు చేసుకోవడం విశేషం. –సాక్షి, సిటీబ్యూరో