ఇక పల్లెల్లో ‘ఆన్లైన్’
ఖమ్మం అర్బన్, న్యూస్లైన్ : ఇంటర్నెట్ ఇప్పుడు పట్టణాలకే పరిమితం కాదు. పల్లెలకూ విస్తరిస్తోంది. ఆన్లైన్ పౌరసేవల కోసం గ్రామీణ జనం ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. ఉన్న ఊరిలోనే వాటిని పొందొచ్చు. గ్రామ పంచాయతీ నుంచి ఆన్లైన్ సేవలు అందుకోవచ్చు. రాజీవ్ గాంధీ పంచాయతీ స్వశక్తీకరణ పేరుతో బ్రాండ్బ్యాండ్ సేవలు జిల్లాలో ఉన్న771 గ్రామ పంచాయతీల్లో దశల వారీగా అందుబాటులో రానున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల 369 గ్రామ పంచాయతీలకు కంప్యూటర్, ప్రింటర్లు అందజేశారు. మండలాల ఈఓఆర్డీ కార్యాలయాలకు సైతం ఈ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పరికరాలు అక్కడికి చేరాయి.
ప్రజలు వివిధ సర్టిఫికెట్లు ఆన్లైన్ ద్వారా పంచాయతీ కార్యాలయాల నుంచి ఇక పొందొచ్చు. అంతేకాదు.. పంచాయతీ ఆదాయ, వ్యయాలు ఏరోజుకారోజు ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. ఆన్లైన్ నిర్వహణకు ఆపరేటర్లను ప్రభుత్వమే సమకూర్చుతుందని, ఇందుకు శిక్షణ ఇచ్చిందని రఘునాథపాలెం ఈఓఆర్డీ ప్రభాకర్ తెలిపారు. ఆపరేటర్లకు ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుందన్నారు.