మరో వివాదంలో మాజీ ఎంపీ రమ్య
మండ్య : మండ్య పర్యటనలో భాగంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ యువకుడిని రౌడీ అంటూ దూషించడంతో వివాదం నెలకొంది. వివరాలు...రమ్య గతంలో మండ్య ఎంపీగా ఉన్న సమయంలో వన్ ఇండియా వన్ ఎంపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సమాజం, ప్రజల సమస్యలు వాటికి పరిష్కార మార్గాలపై థీసిస్ రాసిన వారికి రూ. 2.5 లక్షల బహుమానాన్ని ప్రకటించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 117 మంది యువకులు అనేక సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను వివరిస్తూ రాసిన ధీసిస్ను ఆమెకు సమర్పించారు. కొంతకాలానికి ఆమె పదవి విరమణ కావడంతో యువకులు అందించిన ధీసిన్ను ఆమె ఆ తరువాత పట్టించుకోలేదు.
ఇదే సమయంలో ధీసిస్ సమర్పించిన చిక్కమరళి గ్రామానికి చెందిన పాండుదురై అనే యువకుడు రమ్యను కలవాడానికి పలుమార్లు యత్నించి విఫలమయ్యాడు. ఇదిలా ఉంటే సోమవారం రమ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పాండుదురై అక్కడికి చేరుకుని వన్ ఇండియా, వన్ఎంపీ కార్యక్రమంపై ఆమెను నిలదీశాడు. దీంతో ఆమె తాను ఇప్పుడు ఎంపీనిన కాదని, దీనిపై కలెక్టర్ లేదా ఆ ప్రాంత ఎంపీని అడగాలంటూ బదులిచ్చింది. దీంతో అసహనానికి గురైన ఆ యువకుడు బహుమతి ఇవ్వకపోయిన కనీసం అభినందించాలని డిమాండ్ చేశాడు.
దీంతో రమ్య ఆగ్రహంతో నీవు రౌడీలా మాట్లాడుతున్నావంటూ అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతలోపు ఇదంతా గమనించిన రమ్య మద్దతుదారులు యువకుడిపై ఇష్టారీతిన దాడికి దిగారు. ఇది గమనించిన స్థానికులు రమ్య మద్దతుదారుల నుంచి యువకుడిని రక్షించి యువకుడిని నిందించడంతో పాటు ఆమె అనుచరులు అతడిపై దాడికి పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రమ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు, పోలీసులు యువకుడిని, ప్రజలను శాంత పరచడంతో అక్కడి నుం,చి వెనుగిరిగారు.