breaking news
new sp
-
వైఎస్సార్ జిల్లా నూతన ఎస్పీగా అన్బురాజన్
సాక్షి, వైఎస్సార్ : వైఎస్సార్ జిల్లా నూతన ఎస్పీ గా అన్బురాజన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన అభిషేక్ మొహంతి సుదీర్ఘ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో అన్బురాజన్ ఎస్పీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత కేసులను పరిశీలించి వాటి పురోగతిపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. నగరంలోని ట్రాఫిక్పై దృష్టి సారిస్తానని, సమస్య ఏదైనా నిర్భయంగా తన దగ్గరకు రావచ్చని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో మరింత మెరుగైన టెక్నాలజీని ఉపయోగించి నేరాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్ఫష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణ, మట్కా, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడించారు. వైఎస్ వివేకానంద హత్య కేసుపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి త్వరలోనే వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
రౌడీయిజాన్ని అణచివేస్తా
► సమన్వయంతో పనిచేస్తా ► కొత్త ఎస్పీ ఎం.రవి ప్రకాశ్ స్పష్టీకరణ ఏలూరు అర్బన్: జిల్లాలో శాంతిభధ్రతల పరిరక్షణే తన తొలి ప్రాధాన్యమని ఎస్పీ ఎం.రవిప్రకాశ్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా పరిస్థితులపై అవగాహన ఉందని, రౌడీయిజాన్ని సహించేది లేదని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. మావోయిస్టులపై ప్రత్యేక దృష్టి తెలంగాణ రాష్ట్రం నుంచి జిల్లాలో కలిసిన ఏడు మండలాలను కలిపి ఏర్పాటు చేసిన పోలవరం సబ్ డివిజన్పై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. మావోయిస్టులను నియంత్రిస్తామని వివరించారు. విజిబుల్ పోలీసింగ్ పెంచి ప్రజలతో నిత్యం మమేకమవుతామని వెల్లడించారు. సముచిత గౌరవం కల్పిస్తాం జిల్లాలో ప్రజాప్రతినిధులు, పోలీసుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు, బేదాభిప్రాయాలపై స్పందిస్తూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలను తమ దృష్టికి తీసుకుస్తే పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామనిపేర్కొన్నారు. నిత్యం అందుబాటులో.. డయల్ యువర్ ఎస్పీ అంటూ వారానికి ఒకసారి ప్రజలతో మాట్లాడేందుకు పరిమితం కాకుండా నిత్యం వారికి అందుబాటులో ఉండి పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచుతామన్నారు. సమస్యలు ఏమైనా పరిష్కారం కాకుంటే ప్రజలు ఫోన్లో లేదా కార్యాలయంలో తనతో నేరుగా సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టిపెడతామని వివరించారు. ఎస్పీకి అభినందనలు ప్రస్తుత ఎస్పీ భాస్కర్భూషణ్ నుంచి బాధ్యతలు స్వీకరించిన రవిప్రకాశ్ను ఆయన కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ పి. భాస్కరరావు, ఏఆర్ డీఎస్పీ, బి. చంద్రశేఖర్, ఏఆర్ ఓఎస్డీ, బి.రామకృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ, ఆవుల శ్రీనివాసరావు, ఏఆర్ ఆర్ఐ, కె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
గీత దాటితే వేటే
► పోలీసులు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి ► అవినీతి ఆరోపణలు వస్తే సహించేది లేదు ► నేరం చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష పడేలా చర్యలు ► ‘ప్రజాదర్బార్’ వంటి మంచి కార్యక్రమాలు కొనసాగిస్తాం ► ప్రతి విభాగానికి సీనియర్ అధికారుల పర్యవేక్షణ ► జిల్లాలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి ► బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీ గోపినాథ్ జట్టి కర్నూలు: ‘ప్రజల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటాం. సాంకేతికతను వినియోగించుకుంటూ మెరుగైన సేవలందిస్తాం. అధికారులందరూ వారి పరిధి మేరకు విధులు నిర్వర్తించాలి. కేసుల దర్యాప్తు వేగవంతంగా, పారదర్శకంగా చేపట్టాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేద’ని జిల్లా నూతన ‘పోలీస్ బాస్’ గోపినాథ్ జట్టి హెచ్చరించారు. ఆయన సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం గుండా కర్నూలు బీ.క్యాంపులోని పోలీసు అతిథిగృహానికి చేరుకున్నారు. 12.33 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుని ఆకె రవికృష్ణ నుంచి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మినీ కాన్ఫరెన్స్ హాలులో అదనపు ఎస్పీ షేక్షావలితో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయనే విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాలను చదివానని, అందుకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటూ బేసిక్ పోలీసింగ్ను ప్రజల వద్దకు తీసుకెళ్తామన్నారు. అధికారులందరూ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలను సమన్వయపరుస్తూ, ఇతర శాఖల సహకారం కూడా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ప్రతి విభాగానికీ సీనియర్ అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. తద్వారా పోలీసు వ్యవస్థపై ప్రజల్లో గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజాదర్బార్ వంటి మంచి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. ఎలాంటి సమస్యలున్నా ప్రజలు పోలీసులను సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు. అన్యాయం, మోసానికి గురై స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి న్యాయం చేయాలన్న స్పృహను పెంపొందించుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎవరికైనా స్టేషన్లలో న్యాయం జరగలేదనుకుంటే నేరుగా తనను కలవవచ్చని సూచించారు. జిల్లాలోని, పోలీస్ కుటుంబాల్లోని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తనను కలవడానికి వచ్చిన వివిధ హోదాల్లోని అధికారులతో మాట్లాడారు. పోలీసు సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం డీఐజీ రమణకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ జీవన ప్రస్థానం... పేరు – గోపినాథ్ జట్టి (ఐపీఎస్) తండ్రి – పుల్లయ్య (రైతు కుటుంబం) తల్లి – వెంకమ్మ స్వగ్రామం – నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కరబల్లివోలు పుట్టిన తేదీ – 01–01–1980 భార్య – వై.సుష్మ (బీటెక్) కుమార్తెలు – జానవి, రిత్వి చదువు – వ్యవసాయ విద్యలో పీజీ, స్వగ్రామంలో 7వ తరగతి వరకు, 8 నుంచి ఇంటర్ వరకు నాయుడుపేటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు, డిగ్రీ ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ (తిరుపతి). ఐపీఎస్ బ్యాచ్ – 2008 (జాతీయ స్థాయిలో 144వ ర్యాంకు)