breaking news
New school year
-
టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ!
జూన్ నెల వచ్చేసింది. కొత్త విద్యాసంవత్సరం మొదలు. పాత సమస్యలే కొత్తగా పుట్టుకొస్తాయి. ‘నేను కాలేజ్కి వెళ్లను’ అనిపిస్తుంది టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ మంచి మాటలతో... ఒత్తిడి మూలాలకు మందు వేయవచ్చు వేసవి సెలవులు పూర్తవుతున్నాయి. అకడమిక్ క్యాలెండర్ మొదలవుతోంది. కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే క్లాసులు మొదలు పెట్టేశాయి. కొన్ని కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధమవుతున్నాయి. టెన్త్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ కొత్త కాలేజీలో అడుగుపెట్టాలి. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్లు గ్రాడ్యుయేషన్ కాలేజీల బాటపట్టాలి. అప్పటివరకు ఆత్మీయతలు పంచుకున్న స్నేహితులు మరోచోట చేరిపోయి ఉంటారు. కొత్త వాతావరణానికి అలవాటు పడాలి. కొత్త మనుషుల మధ్య మెలగాలి. కొత్త వాళ్లలో స్నేహితులను వెతుక్కోవాలి. కొత్త మిత్రులు అర్థం అవుతున్నట్లే ఉంటారు, అలాగని పూర్తిగా అర్థం కారు. గతంలో స్నేహితులు, శత్రువుల్లా కొట్టుకున్న తోటి విద్యార్థులు గుర్తు వస్తారు. అప్పటి శత్రువులు కూడా చాలా మంచివాళ్లనిపిస్తుంటుందిప్పుడు. అలాగని వెనక్కి వెళ్లలేరు, ముందుకు సాగాల్సిందే. ఇది చిన్న సంఘర్షణ కాదు. రెక్కలు విచ్చుకుంటున్న లేత మనసులకు అది విషమ పరీక్ష అనే చెప్పాలి. పిల్లలు రెండు రకాలు ‘‘కొత్త పుస్తకాలు, కొత్త డ్రస్లు, కొత్త కాలేజ్... పట్ల ఉత్సుకత, ఉత్సాహంతో ఉరకలు వేసే పిల్లలు ఒక రకం. వీళ్లలో టీనేజ్ స్ట్రెస్ వంటి ఇబ్బందులుండవు. కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి బెంబేలు పడే వాళ్ల విషయంలోనే తల్లిదండ్రులు జాగ్రత్తగా మెలగాలి. టెన్త్ పరీక్షలకు ముందు పిల్లలు విపరీతమైన ఆందోళనకు గురైతే అప్పటికి ధైర్యం చెప్పి పరీక్షలు రాయించి ఉంటారు. అయితే అలాంటి పిల్లలను కాలేజ్లో చేర్చే ముందే వాళ్లకు తగిన కౌన్సెలింగ్ ఇప్పించాలి. కొత్త వాతావరణంలో ఇమడలేకపోవడం అనేది అలాంటి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. పేరెంట్స్ తమకు నచ్చిన కాలేజ్ అని, మంచి కాలేజ్ అనే పేరుందని, అక్కడ చదివితే ఐఐటీలో సీటు వస్తుందని తమకు తామే నిర్ణయించేసి ఫీజులు కట్టేస్తారు. పిల్లలు ఆ కాలేజ్కి వెళ్లడానికి ఇష్టపడకపోతే ఫీజు వృథా అవుతుందేమో, బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతో పిల్లలను మరింత ఒత్తిడికి గురి చేస్తుంటారు’’ అని చెబుతున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్. మౌనం వీడరు ఇక్కడ విచిత్రం ఏమిటంటే... పేరెంట్స్ ఎంత సున్నితంగా అడిగినా పిల్లలు పూర్తిగా ఓపెన్ కారు. అలాగే పేరెంట్స్ ఎంతగా కౌన్సెలింగ్ ఇచ్చినా అవన్నీ నీతిసూత్రాలే అవుతుంటాయి. అందుకే పిల్లలు ‘ఎప్పుడు ఆపేస్తారా’ అన్నట్లు చికాగ్గా ముఖం పెడతారు. ఒక కాలేజ్ కుర్రాడు కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులకు ఠంచన్గా లాప్టాప్తో సిద్ధమయ్యేవాడు. పేరెంట్స్ కూడా క్లాసులను జాగ్రత్తగా వింటున్నాడనే అనుకున్నారు. పరీక్షలు రాసిన తర్వాత తెలిసింది అస్సలేమీ చదవలేదని, పాఠాలు వినలేదని. ఆ ఏడాది మొత్తం లాప్టాప్లో వెబ్సీరీస్ చూశాడా కుర్రాడు. కొంతమంది జూనియర్ కాలేజ్లో యంత్రాల్లా చదివి చదివి విసిగిపోయి ఉంటారు. డిగ్రీ కాలేజ్కి వెళ్లగానే వాళ్లకందిన స్వేచ్ఛను ఎలా ఆస్వాదించాలో తెలియక అనేక దురలవాట్లకు బానిసలవుతుంటారు. స్వేచ్ఛ కూడా ఒత్తిడి చేసినంత నష్టాన్ని కలిగిస్తోంది. ఆ ఒత్తిడిని ఒక్కసారిగా తీసి పక్కన పెట్టినప్పుడు వచ్చే స్వేచ్ఛతో... అన్నింటికీ ‘ఇట్స్ ఓకే’ అనే కొత్త భాష్యం చెప్పుకోవడం మొదలైంది. చదవడం లేదా, బ్యాక్లాగ్స్ ఉన్నాయా, క్లాసులు బంక్ కొడుతున్నారా, బ్యాక్ బెంచ్ స్టూడెంటా... అన్నింటికీ ఇట్స్ ఓకే ఫార్ములానే. దీంతోపాటు బ్యాక్లాగ్ లేని స్టూడెంట్స్ మీద కామెంట్స్ చేయడం కూడా. ఒక కప్పు కింద రెండు ప్రపంచాలు సమాజానికి ఆరోగ్యకరమైన ఒక కొత్త తరాన్ని ఇవ్వడం పేరెంట్స్ బాధ్యత. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కారణంగా ఈ తరం పిల్లలు పేరెంట్స్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. చాలామంది పేరెంట్స్ ఆ డిజిటల్ ప్రపంచంలోకి ఎంటర్ కాలేని స్థితిలోనే ఉంటారు. అలాగే పేరెంట్స్ ప్రపంచంలో జీవించడానికి పిల్లలు ఇష్టపడరు. రెండు భిన్నమైన ప్రపంచాలు ఒకే ఇంట్లో నివసిస్తున్నాయిప్పుడు. ఈ క్లిష్టమైన స్థితిలో పేరెంట్స్ పిల్లలతో మరింత స్నేహంగా మెలగాల్సిన అవసరం ఏర్పడింది. టీన్స్లోకి రాకముందు నుంచే వాళ్లతో స్నేహితులుగా మెలగాలి. పిల్లలు చెప్పే విషయాలను అనుమానించడం మాని అర్థం చేసుకోవాలి, అర్థవంతంగా విశ్లేషించడం మొదలుపెట్టాలి. ఒక తోటలో చిగురించిన మొలకను పెకలించి మరో చోట నాటితే మొదట వాడిపోతుంది. జాగ్రత్తగా చూసుకుంటే కొత్త వాతావరణానికి అలవాటు పడుతుంది. కొత్త చివుళ్లు వేస్తుంది. కొత్త మట్టిసారంలో మరింత ఏపుగా పెరుగుతుంది. ఈ దశలో నిర్లక్ష్యంగా ఉంటే మొక్క వాడిపోతుంది. పిల్లలు కూడా మొక్కల్లాంటి వాళ్లే. టీనేజ్ స్ట్రెస్ లక్షణాలిలా ఉంటాయి అస్థిమితంగానూ ఆత్రుతగానూ ఉండడం, త్వరగా అలసటకు లోనుకావడం, తరచుగా కడుపు నొప్పి, ఛాతీ నొప్పి అని చెప్పడం, కుటుంబ సభ్యులతో కలవకుండా దూరం పెంచుకోవడం, నిద్రలేమి లేదా విపరీతంగా నిద్రపోవడం, పనులను వాయిదా వేయడం, బాధ్యతల పట్ల నిర్లక్ష్యం... పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఉపేక్షించరాదు. మొండి నిద్రపోతారు! కొత్త కాలేజ్లో అలవాటు పడలేని పిల్లల్లో ఆకలి మందగించడం, తిన్నది జీర్ణం కాకపోవడం, వాంతులు, విరేచనాలు కూడా వస్తుంటాయి. నిజానికి ఆ లక్షణాలు దేహ అనారోగ్య లక్షణాలు కావు, మానసిక ఆందోళన ప్రభావంతో ఎదురయ్యే సమస్యలు. కాబట్టి మొదట పిల్లలను జాగ్రత్తగా గమనించాలి, అది నిఘా కాకూడదు. ఎనిమిదిన్నరకు కాలేజ్కి రెడీ కావాల్సిన పిల్లలు ఒక్కోసారి తొమ్మిది వరకు నిద్రలేవరు. ఎంత లేపినా సరే మొండిగా నిద్రపోతుంటారు. కాలేజ్ టైమ్ దాటిన తర్వాత వాళ్లే లేస్తారు. ఆ రోజుకు ఏమీ అడగకుండా వాళ్లనలా వదిలేయడమే మంచిది. కాలేజ్కి వెళ్లడానికి అయిష్టత వెనుక కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. – డా‘‘ సి. వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ , యు అండ్ మి – వాకా మంజులారెడ్డి -
సెప్టెంబర్లో కొత్త విద్యా సంవత్సరం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కొత్త విద్యా సంవత్సరాన్ని జూలైకి బదులు సెప్టెంబర్లో ప్రారంభించాలని, అప్పుడే విద్యా సంస్థలు తెరవాలని యూజీసీ నిపుణుల కమిటీ పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెల నుంచే కాలేజీలను, స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అకడమిక్ అంశాలు, ఆన్లైన్ విద్య తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు యూజీసీ రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. హరియాణా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆర్సీ కుహద్ నేతృత్వంలోని కమిటీ లాక్డౌన్ నేపథ్యంలో యూనివర్సిటీల్లో పరీక్షల నిర్వహణ, ప్రత్యామ్నాయ చర్యలపై అధ్యయనం చేసింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) వైస్ చాన్స్లర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మరో కమిటీ ఆన్లైన్ పరీక్షలపై అధ్యయనం చేసింది. శుక్రవారం ఆ కమిటీలు యూజీసీకి తమ నివేదికలను అందజేశాయి. అందులో కుహద్ నేతృత్వంలోని కమిటీ విద్యా సంవత్సరాన్ని జూలైకి బదులు సెప్టెంబర్లో ప్రారంభించాలని సిఫారసు చేసింది. ఇక నాగేశ్వర్రావు కమిటీ యూనివర్సిటీల్లో కావాల్సినంత మౌలిక సదుపాయాలు ఉంటే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించవచ్చని సూచించింది. చదవండి: 18,514మందికి కరోనా పరీక్షలు -
కొత్త తరగతిలోకి...
⇒నేటి నుంచి నూతన విద్యా సంవత్సరం ⇒ఇప్పటికే పాఠశాలలకు చేరిన పాఠ్యపుస్తకాలు ⇒ పలు స్కూళ్లలో వేధిస్తున్న సమస్యలు కాళోజీ సెంటర్ : ఆనవాయితీకి భిన్నంగా మూడు నెలల ముందుగానే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతోంది. పాఠశాల విద్యావ్యవస్థలోనే తొలిసారి వేసవి సెలవులకు ముందే సీబీఎస్ఈ విధానం తరహాలో నూతన విద్యా సంవత్సరం మంగళవారం ఆరంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. సాధారణంగా ఏటా జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. కానీ ఈసారి విద్యార్థులు మంగళవారమే పై తరగతులకు ప్రమోట్ కానున్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం, వరంగల్ రూరల్ జిల్లా విద్యాశాఖ అధికారులు ముందస్తు విద్యా సంవత్సరానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పాఠశాలలకు ఎక్కువ శాతం పాఠ్యపుస్తకాలు చేరగా మిగిలినవి త్వరలోనే అందుతాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 644 పాఠశాలలు జిల్లాలో అన్ని యాజమన్యాలవి కలిపి 644 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 455, ప్రాథమికోన్నత పాఠశాలలు 76, ఉన్నత పాఠశాలలు 133 ఉండగా, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు కూడా కొనసాగుతున్నాయి. వీటన్నింట్లో కూడా సోమవారం నుంచే నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎప్పుడూ ఏప్రిల్ 23 వరకు జరగాల్సిన 1నుంచి 9వ తరగతుల వార్షిక పరీక్షలను ఈనెల 16వరకే ముగించేశారు. అలాగే, జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులు మంగళవారం విద్యార్థులకు ఫలితాలు వెల్లడించనున్నారు. పాఠశాలలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు పాఠశాలల ప్రారంభం రోజున చేతిలో నూతన తరగతి పాఠ్యపుస్తకాలు ఉండాలన్న విద్యార్థులు, తల్లిదండ్రుల లక్ష్యం నెరవేరబోతోంది. ఈ మేరకు విద్యాశాఖ అదికారులు అవసరమైన మేరకు పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు చేర్చారు. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని 664 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్ని టైటిళ్లు కలిపి 3,05,900 పాఠ్యపుస్తకాలు అవసరం. ఇందులో 80శాతం మేర పాఠ్యపుస్తకాలు మండలాలకు చేరుకున్నాయి. ఎంఈఓ కార్యాలయాల నుంచి పాఠశాలలకు చేర్చే ప్రక్రియ కూడా చురుకుగా కొనసాగుతోంది. అలాగే, త్వరలోనే విద్యార్థులకు యూనిఫాం కూడా పంపిణీ చేయనున్నారు. సమస్యల స్వాగతం ఎప్పటిలాగా ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండలు మండిపోతుండగా.. పలు పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో సమస్యగా మారనుంది. అలాగే, మధ్యాహ్న భోజన నిర్వాహకులు సైతం ఇబ్బంది పడక తప్పదని చెప్పాలి. ఇంకా పలు పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం లేకపోగా.. ఉన్న వాటిలో ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కబోత నడుమే విద్యార్థులు పాఠాలు వినాల్సి వస్తుంది. ఇక ఉపాధ్యాయుల కొరత ఎలాగూ ఉంటుంది. ఇలా పలు సమస్యల నడుమే కొత్త విద్యాసంవత్సరం ఆరంభం కానుండగా.. అధికారులు స్పందించి సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.