breaking news
Nandigam Mandal
-
వరుడికి చేరిన ప్రైవేటు ఫొటోలు.. అవమానంతో యువతి ఆత్మహత్య
టెక్కలి రూరల్ (శ్రీకాకుళం): ప్రేమించానని మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకోమంటే కులాన్ని సాకుగా చూపి మొహం చాటేశాడు. పెద్దల బలవంతంతో ఆ యువతి వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడగా.. ఆమె ప్రైవేటు ఫొటోలను వరుడితోపాటు మరికొందరికి పంపించి అల్లరి పాల్జేశాడు. దీంతో అవమాన భారాన్ని దిగమింగుకోలేక ఆ యువతి ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెంటూరు గ్రామానికి చెందిన లీలావతి (25) తల్లిదండ్రులతో కలిసి టెక్కలిలో తన అక్క ఇంట్లో ఉంటోంది. లీలావతి అదే మండలంలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన పైల వెంకటేష్ అనే యువకుడిని ఐదేళ్ల క్రితం ప్రేమించింది. వివాహం చేసుకోవాలని కోరగా.. కులం పేరు చెప్పి వెంకటేష్ పెళ్లికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల తల్లిదండ్రులు వేరే యువకుడిని పెళ్లి చేసుకునేలా లీలావతిని ఒప్పించారు. ఆగస్టు 26న పెళ్లి కూడా నిశ్చయించారు. ఈ విషయం తెలిసిన వెంకటేష్ ఆ యువతికి సంబంధించి కొన్ని ప్రైవేటు ఫొటోలను వరుడితోపాటు మరికొందరికి పంపించి అల్లరి చేశాడు. ఈ విషయం తెలిసిన లీలావతి అవమాన భారం తట్టుకోలేక శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కొక్కేనికి ప్లాస్టిక్ వైరుతో ఉరి వేసుకుంది. -
పొట్ట విప్పి చూడ పాములొచ్చె!
పూండి: పాములు గుడ్లు పెడతాయి.. వాటి నుంచి పిల్లలు వస్తాయి.. మనలో చాలామందికి ఈ విషయం తెలిసిందే.. కానీ, పాముల్లో రెండు రకాలు ఉంటాయని, శశూత్పత్తి చేసేవి కొన్నయితే.. అండోత్పత్తి చేసేవి మరికొన్నని అధిక శాతం మందికి తెలియని విషయం. ఈ విషయం తెలియకే పాము కడుపు నుంచి 50 పిల్లలు బయటకు రావడం శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పీవీపురం గ్రామస్తులను విస్మయానికి, గగుర్పాటుకు గురిచేసింది. సోమవారం గ్రామంలోని బీసీ కాలనీలోని ఇళ్లలోకి ప్రవేశిస్తున్న ఒక పెద్ద పామును స్థానికులు గమనించారు. దాన్ని గునపంతో ఒళ్లంతా పొడిచి హతమార్చారు. గునపం పోట్లకు చీలిపోయిన పాము పొట్ట నుంచి ఒక్కసారి 50 పిల్లలు బయటకు వచ్చాయి. ఒక్కసారి అన్ని పాము పిల్లలను చూసి భయపడిన గ్రామస్తులు వాటిని కూడా చంపేశారు. కానీ.. పాము కడుపులోంచి పిల్లలు రావడమేమిటని ఆశ్చర్యానికి గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ‘న్యూస్లైన్’ ఈ విషయాన్ని తొగరాం ప్రభుత్వ జూనియర్ కళాశాల జంతు శాస్త్ర అధ్యాపకుడు పి.భాస్కరరావును సంప్రదించగా ఒక రకం పాములు పిల్లలను ప్రసవిస్తాయని ధ్రువీకరించారు. గ్రామస్తులు చంపేసిన పాము శరీరంపై డైమండ్ ఆకారంలో పెద్ద మచ్చలు ఉండటాన్ని బట్టి అది రక్తపింజర జాతి పాము అని తేల్చారు. ఈ జాతి పాములు గుడ్లే పెడతాయని.. అయితే, వాటిని కడుపులో ఉండగానే పొదిగి పిల్లలను కడుపులోని సొన పొర రక్షణలో ఉంచుతాయని.. అనంతరం జననేంద్రియం ద్వారా ఆ పిల్లలను ప్రసవిస్తాయని వివరించారు. ఇలాంటి జీవులను కార్డేటా విభాగానికి చెందిన ‘ఓవివీపెరస్’ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారని ఆయన చెప్పారు. రక్తపింజరలు ఒక కాన్పులో 50 పిల్లలను కనడం కూడా సాధారణమేనని చెప్పారు.