breaking news
Mujaphar Nagar
-
‘గురి’ కుదరని బిల్లు
విశ్లేషణ: చిన్న పుకారు, చిన్న సంఘటన అగ్గిని రేపుతుంది. ఇది పోలీసులకు తెలుసు. ప్రతిసారీ దాడికి ముందే కొంత సమీకరణ జరుగుతుంది. అవసరమైన సరంజామా ముందే పోగు చేసుకుంటారు. ఆయుధాలు ఒక్కొక్కరికీ అందజేసి ఉంచుతారు. కాబట్టి నేరం జరగబోతున్నదని ముందే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. కాని చర్య తీసుకోరు. ‘కొట్టాలని ఉంది కాని, దెబ్బ తగులుతుందేమోనని భయం’ అన్నట్టుగా ఉన్నది 2013, మత, కుల గురి పెట్టిన హింసల బిల్లు. ఇది 2011లోనే తయారైంది. పెనం మీద రొట్టెను అటు ఇటు తిప్పి మాడ్చినట్టు 2013లో మరొక రూపం ఇచ్చారు. దీనిని కేంద్ర ప్రభు త్వం ఆమోదించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉన్నది. ఇది బీజేపీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నది. ససేమిరా అంగీకరించనని బీజేపీ చెప్పేసింది కూడా. ఆ పార్టీ అంగీకరిస్తుందన్న ఆశతోనే మొదటి బిల్లును సవరించి, 2013 బిల్లు అని పేరు పెట్టి లోక్సభలో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు ఇప్పుడు. బీజేపీకి ఏమిటి అభ్యంతరం! 2011 బిల్లును ఒప్పుకోని బీజేపీని కొంత మెత్తపరచడానికి ఒకటి రెండు మార్పులు చేశామన్నారు. అయినా విపక్షం అంగీకరించేటట్లు లేదు. బీజేపీని దెబ్బ తీయడానికీ, ‘చూశారా! మేం ఎంత లౌకికవాదులమో!’ అని చెప్పుకో వటానికీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఈ బిల్లుతో విన్యాసాలు చేస్తున్నది. అంతగా బీజేపీ అభ్యంతరం పెట్టే అంశాలేమున్నాయి అందులో? ఈ బిల్లులో ప్రధానంగా పదమూడు రకాల నేరాలను పేర్కొన్నారు. కొన్ని మతానికి సంబం ధించిన హింసాత్మక ఘటనలు, కొన్ని కులానికి సంబంధించినవి, మరికొన్ని ‘గురిపెట్టిన హింస’కు సంబంధించినవి. అంటే ఒక మతానికి లేదా కులానికి లేదా సమూహానికి చెందిన వ్యక్తులను లక్ష్యం చేసుకొని దాడి చేయటం, ఇళ్లు తగలబెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయటం, పురుషులను చంపటం, పసిపిల్ల అని కూడా చూడకుండా ముక్కలు ముక్కలుగా నరికివేయటం, మనుషుల్ని చంపి మంటల్లో విసిరివేయటం, స్త్రీలను వారి కుటుంబ సభ్యులు చూస్తుండగా నగ్నం చేసి సామూహిక మానభంగానికి గురిచేసి చంపేయటం వంటి ఘోరకృ త్యాలు చేసి వికటాట్టహాసం చేస్తూ విజయోత్సవంలో కరాళనృత్యం చేయటం వంటి నేరాలు ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కిందకి వస్తాయి. వీటికి సంబంధించిన దర్యాప్తు నేర విచారణ లాంటివి సీఆర్పీసీ కింద జరుగుతాయి. అయినా కొత్తగా ఏవో నిబంధనలు ప్రవేశపెడుతున్నట్టు బీజేపీ గగ్గోలుపెడుతున్నది. కులానికి సంబంధించిన నేరా లు కూడా ఐపీసీ కిందకే వస్తాయి. అయితే న్యాయవిచారణ త్వరగా జరిపించ డానికి, జాప్యంలేకుండా ముద్దాయిలను అరెస్టుచేసి విచారణ జరిపి శిక్షలు వేయించటానికి, దీనికోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పరచటం వంటివి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద జరిపిస్తున్నారు. అవే నేరాలకు మళ్లీ ఈ బిల్లులో ప్రవేశపెట్టారు. అయితే ఒక కొత్త నేరాన్ని ప్రవేశ పెట్టారు. నిజానికి ఇదీ పాతదే. రూపం కొత్తది. ‘గురి పెట్టిన హింస’ అనేది ఒక మతానికి లేదా ఒక కులానికి, ఒక తెగకు లేదా ఒక సమూహానికి చెందిన వారిని గురిచేసి వారిపై హింసాకాండ జరపటం. అదే విధంగా ద్వేష ప్రభావం. ఇదీ పాతదే. పేర్లు మారిస్తే చాలదు జరగవలసింది ఏమిటంటే నేరాలు క్రోడీకరించి శిక్షలు సూచించటం కాదు. నేరం జరగకుండా చూడటం, నేరం జరిగిందని తెలిస్తే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నేరగాళ్లను అరెస్టు చేయటం, విచారణ ప్రక్రియను వేగవంతం చేయటం. అంతేకాని సమాజంలో జరుగుతున్న అవే నేరాలకు పేరు మార్చి శిక్షలు పెంచి ‘నేరాలను అరికట్టడానికి మేము ఏ చర్యలు తీసుకుంటున్నామో చూడండి’ అని చెప్పటం కాదు. నేరాన్ని ఆపలేకపోతే నేరం జరిగిన వెంటనే తీసుకోవలసిన చర్యలు తీసుకుంటే అవి మళ్లీ మళ్లీ జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి నేరాలు క్షణికోద్రేకంలో చేసినవి కావు. మత కలహాలు తలెత్తే అవకాశం ఉందని ముందే తెలిసిపోతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీలపై దాడి జరగబోతుందని ముందే తెలుస్తుంది. వాటిని సులువుగా అరికట్ట వచ్చు. మత లేదా కుల ఘర్షణ జరగబోతుందని తెలిసినప్పుడు పోలీసులు రంగంలోకి దిగటం లేదు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరుగుతున్న మత కలహాలు, కుల దాడులు చూస్తే ఇదే దృశ్యం పదే పదే కనబడున్నది. కొన్ని కొన్ని సందర్భాలలో పోలీసులే లేదా రాజకీయ నాయకులే రంగంలో ఉండి దాడులు జరిపిస్తారు. ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? ముజఫర్ నగర్లో ఇటీవల జరిగిన మారణహోమం చూస్తే అది ఎంత పకడ్బం దీగా, స్థానిక నాయకుల అండదండలతో జరిగిందో తెలుస్తుంది. పిల్లలని చూడక, స్త్రీలని చూడక, ముసలి వాళ్లని చూడక, గర్భిణులని చూడక వారిపై ఎంత అమానుషంగా హింసాకాండ సాగించారో ఊహకందదు. గర్భిణుల గర్భాన్ని చీల్చి అందులోని పిండాలను, పెరుగుతున్న శిశువులను కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి చంపి వేసిన సంగతి లాంటిది ఏ దేశంలోనూ, ఏ ఆటవిక సమాజాలలోను జరిగి ఉండదు! నిన్నటి వరకూ ఇరుగు పొరుగుగా జీవిస్తున్న వారు, ఉప్పు పప్పు పంచుకున్న వారు, ఒకే మంచంపై కూర్చుని హుక్కా పీల్చిన వారు ఆ తెల్లవారి అంత అకృత్యానికి పాల్పడుతున్నారంటే అది ఉద్రేకంతో చేసినవి కావు. మెజారిటీ మతం అని చెప్పుకుంటున్న వారు మైనారి టీల పట్ల ఇంత ద్వేషాన్ని కడుపులో పెట్టుకు తిరుగుతున్నారంటే నిర్ఘాం తపరుస్తుంది. ఒడిశాలో ఆదివాసీలపై జరిపిన మారణహోమం కూడా ఇలాం టిదే. ఒక క్రైస్తవ డాక్టరు భారతదేశానికి వచ్చి, ఇదే తన సొంత దేశంగా చేసు కొని, ఆదివాసీలకు వైద్య సేవలందిస్తున్నాడు. అతని సేవానిరతికి మానవతా దృక్పథానికి ఆకర్షితులైనవారు, వైద్య సేవలు పొందిన వారు క్రైస్తవ మతం వైపు ఆకర్షితులైతే అయుండవచ్చు. అందులో తప్పేమీ లేదు. అది నేరమూ కాదు. పాపమూ కాదు, అనైతికమూ కాదు. ఆదివాసీలనందరినీ క్రైస్తవ మతంలోకి మార్చివేస్తున్నాడన్న అభియోగంపై ఆ డాక్టర్ స్టెయిన్స్ని, అతని కొడుకులిద్దర్ని పెట్రోలు పోసి సజీవదహనం చేశారు. ఇది క్షణికోద్రేకంతో చేసిన పని అనగ లరా? ఒక జిల్లా అంతటా స్వైరవిహారం చేసి భీతావహం సృష్టించారు. ఇదీ యాదృచ్ఛికం కాదు. ఆదివాసీలు హిందువులు కాదు. వారు తెగలు. హిందూ మతంలో ఉన్న కులాలకూ, వారికీ సంబంధం లేదు. వారు క్రైస్తవ మతంలోకి వెళ్లినా హిందువులనుకుంటున్న వారికి నష్టంలేదు. అక్కడ ఉన్న ఒక మతా చార్యుని ఆదేశాల మేరకు ఈ నరమేథం జరిగింది. అయితే ముస్లింలు కూడా ప్రతీకార చర్యలకు తలపడుతున్నారు. వారికి గత్యంతరం కనబడటం లేదు. చట్టాలు లేకనా! ఎంతో దూరం కాదు. నిన్ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లక్షింపేటలో మాలలపై మెజారిటీ మతానికే చెందుతామనుకుంటున్న ఒక కులం వారు దాడి చేసి ఐదుగురిని పట్టపగలు నరికి చంపేశారు. అంతకు ముందు జరిగిన అనేక దారుణాలకు, దీనికీ తేడా ఏమీ ఉండదు. దాడి తీవ్రత, క్రూరత్వం ఒకటే. మరణాల సంఖ్య మారుతుంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్లలో దళితుల్ని ఏభై చొప్పున, అరవై చొప్పున ఊచకోత కోస్తుంటారు. మెజారిటీ మత వర్గం ముస్లింల పట్ల జరుపుతున్న హింసాకాండ, ఎస్సీ, ఎస్టీల పట్ల అదే వర్గం జరుపుతున్న మారణకాండ ఎందుకు మళ్లీ మళ్లీ జరుగుతోంది? చట్టాలు లేకనా? లేక అవసరమైన చర్యలు తీసుకోవటానికి నిరాకరించటమా? నేరానికి సంబంధించి మూడు దశలు ఉంటాయి: ఒకటి నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవటం. రెండు: నేరం జరగకుండా నిరోధించటం. మూడు: సహాయ పునరావాస చర్యలు చేపట్టడం. ఇందులో ఏ ఒక్కటీ సవ్యంగా జరగటం లేదు. ఇదిలా జరగడానికి ప్రధాన కారణం, దాడులు చేస్తున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న ‘హిందువులు’. దాడికి గురవుతున్న వారు ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు. వీరు ప్రతిచోటా తక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ దేశంలో ముస్లింలను, ఎస్సీ, ఎస్టీలను చాలా సులువుగా గుర్తించగలరు. పైగా ఒకే చోట ఉంటున్న వారికి ఆ ఇబ్బంది ఉండదు. వాళ్ల ఇళ్లూ, వాడలు సులువుగా గుర్తుపట్టవచ్చు. చిన్న పుకారు, చిన్న సంఘటన అగ్గిని రేపుతుంది. ఇది పోలీసులకు తెలుసు. ప్రతిసారీ దాడికి ముందే కొంత సమీకరణ జరుగుతుంది. అవసరమైన సరంజామా ముందే పోగు చేసుకుంటారు. ఆయుధాలు ఒక్కొక్కరికీ అందజేసి ఉంచుతారు. కాబట్టి నేరం జరగబోతున్నదని ముందే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. కాని చర్య తీసుకోరు. ఎందుకంటే హత్యాకాండకు సిద్ధమైన వాళ్లు, పాల్పడిన వారు మెజారిటీకీ చెందినవారు. అధికారంలో ఉన్న వారు వారే. పోలీసు విభాగంలో అధికారం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. నేర పరిశోధన చేయవలసిన వారు కూడా తల పక్కకు తిప్పుకుంటున్నారు కాబట్టి, వారి విధులను సక్రమంగా నిర్వర్తించటం లేదు కాబట్టి సాక్షాత్తు సుప్రీంకోర్టు తానే స్వయంగా దర్యాప్తును పర్యవేక్షణ చేస్తున్నది. ఈ పరిస్థితి మారనంత కాలం ఇదే పరిస్థితి పునరావృతమవుతుంది. ఎక్కడ జరుగుతుంది న్యాయం? కొత్త చట్టాలు చేయటం కాదు. ఈ బిల్లులో చూపిన అన్ని నేరాలకూ ఐపీసీ సమా ధానం చెబుతుంది. ఆ చట్టం ఉండి, ఆ చట్టం కింద నేరాలకు శిక్షలు వేసినా నేరాలు తగ్గటంలేదు. సంఘటన జరిగిన ఐదు, పది ఏళ్ల వరకూ కేసు అతీగతీ కనపడకపోతే, చివరకు ‘సాక్ష్యాలు చాలవు, లేదా నమ్మదగినవిగా లేవు’ అని కేసులు కొట్టేస్తే బాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇటువంటి పరి స్థితిని చక్కదిద్దటానికి కొత్త చట్టాలు రావాలి. కొత్త దృక్పథం ఏర్పడాలి. మతా నికి, కులానికి, జాతికి అతీతంగా నిష్పాక్షికంగా నేరపరిశోధన, న్యాయ విచారణ జరగాలి. అంబేద్కర్ అన్నట్టు ‘‘ప్రజాస్వామ్యం అనేది మనం తగిలించుకున్న ముసుగు, ప్రధానంగా ఈ దేశం అప్రజాస్వామికమే ఇంకా!’ -
ముజఫర్నగర్ విషయంలో మూగబోయిందెందుకు?
ఢిల్లీలో ‘నిర్భయ’పై దురాగతానికి పాల్పడిన దోషులకు శిక్ష పడిందని ఊరటచెందినంత సేపు పట్టలేదు.. అలాంటి కొన్ని వందల, వేలమంది బాధితురాళ్లు మన కళ్ల ముందు నిలవడానికి, నిర్భయ విషయంలో జాతి మొత్తం ఒకటిగా నిలిచింది. దోషులకు శిక్ష పడాలని ఉద్యమించింది. పూజలు చేసింది, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసింది, పోరాడింది. మరి మనుషులు రెండుగా విడిపోయిన సందర్భాల్లో...? ముజఫర్నగర్నే తీసుకోండి.. అత్యాచార కాండలను గురించి భారతీయులు ఎందుకు ఆ స్థాయిలో స్పందించడం లేదు? ఒక్క అమ్మాయిపై జరిగిన అత్యాచారంపై అంతగా స్పందించిన భారతావని, ముజఫర్నగర్ బాధితురాళ్ల విషయంలో ఎందుకు మూగబోయింది? అని ప్రశ్నిస్తున్నారు సమాజసేవకులు. ఇలాంటి కల్లోలం చెలరేగిన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ పట్టణ ంలో ప్రస్తుతం కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్లు, సంఘసేవకులు పర్యటిస్తున్నారు. దేశ రాజధానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణంలో కలహాల ముసుగులోజరిగిన అత్యాచారకాండలను వెలుగులోకి వచ్చే పనిలో పడ్డారు వీళ్లు. అల్లర్లు చెలరేగడానికి కారణం ఏమైనా, ఎవరైనా.. బాధితులు మాత్రం అమాయకమైన మహిళలు, అభం శుభం తెలియని వాళ్లు. ఈ అత్యాచారకాండను వేరే కోణం నుంచి కాక లింగ వివక్ష రూపంలో చూడాల్సి ఉంటుందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ‘‘కల్లోలాల్లో ప్రధానమైన బాధితురాలు మహిళ.. పిల్లలను కళ్ల ముందే హత్య చేస్తారు, అడ్డుపడటానికి ప్రయత్నించిన భర్తను చంపుతారు, ఇళ్లు తగలబెడతారు, ఆమె కళ్ల ముందే వినాశనాన్ని సృష్టించి, గుండె పగిలేలా రోదిస్తున్న ఆమెపై అంతిమంగా అత్యాచారాన్ని మొదలుపెడతారు. అత్యంత కిరాతకంగా ప్రవర్తించి, వీలైతే చంపి, లేకపోతే బతికున్న శవంగా మార్చి వదిలిపెడతారు. ముజఫర్ నగర్లో జరిగింది కూడా ఇదే. అలా సర్వం కోల్పోయి జీవచ్ఛవాల్లా మిగిలిన మహిళలు ఎంతో మంది మాకు కనిపించారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారి స్థితి ఎలాంటి మనిషినైనా చలింపజేస్తుంది కానీ, మౌఢ్యంలో కూరుకుపోయిన కొంతమందిని కదిలించలేకపోయింది. బాధితురాలు ఏ వర్గానికి చెందినది అనేది విషయం కాదు. ఆమెపై జరిగిన దురాగతానికి ఓదార్పును ఇచ్చేందుకు కూడా సమయం తీసుకోవడం లేదు సమాజం. ఈ చిన్న పట్టణంలోనే అత్యాచారానికి గురైన అనేక మంది మహిళలను కలిశాం. వారిలో చాలామంది తమపై జరిగిన అకృత్యం గురించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు... అనేకంటే చేయలేని స్థితిలో ఉన్నారు వాళ్లు. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. ఒకవేళ ఇప్పుడు ఫిర్యాదు చేసినా.. ఆధారాలు దొరికే అవకాశాలేమీ ఉండవని నిపుణులు అంటున్నారు. ఇక్కడ మహిళలపై జరిగిన పాశవిక కాండను కేవలం ప్రతీకారేచ్ఛతో జరిగిన సంఘటనలుగా తీసుకోవడానికి వీల్లేదు. చాలా అత్యాచార కాండల్లో దోషులు ఎదురింటి వారు పక్కింటి వారు అని మాకు అర్థమైంది. తమ పశువాంఛలను చాలా మంది పరిస్థితులను అడ్డుపెట్టుకుని తీర్చుకున్నారు. ఇలా అత్యాచారానికి గురైన మహిళల్లో చాలా మంది ఇప్పుడు ఇంటిలోంచి బయటకు రావడానికి కూడా ధైర్యం చేయడంలేదు. పోలీసులు ఇప్పటికీ పరిస్థితిని చక్కదిద్దే పనిలోనే ఉన్నారు. వారు బాధితుల వద్దకు చేరుకుని విచారణ జరిపేది ఎప్పుడు? చట్టం నాలుగు పాదాల మీద నడిచినప్పుడే దోషులకు శిక్ష పడటం గగనమైంది. మరి మతరూపం సంతరించుకున్న ఈ పరిస్థితుల్లో చట్టం వికలాంగురాలు అవుతుంది. అలాంటప్పుడు ఈ బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది?’’ అని ముజఫర్ నగర్లో పర్యటించిన మహిళా సంఘాల కార్యకర్తలు, ఇగ్నూ మహిళా ప్రొఫెసర్లు స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సమాధానం ఉందా మరి?