breaking news
modren method
-
సాగుకు చదువుల దన్ను
ఒకపక్క– వ్యవసాయాన్ని నామోషీగా భావించి, ఐదారువేల జీతానికే పల్లెలను వదిలి పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత.. మరోపక్క– ఉన్నత చదువులు చదివి, లక్షల్లో వేతనం వస్తున్నా.. అందులో లభించని తృప్తిని మట్టిని నమ్ముకుని పొందాలనే తపనతో ఉద్యోగాలొదిలి పల్లెబాట పడుతున్నారు మరికొందరు. పచ్చని పంట పొలాల్లో.. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతూ సంతృప్తి చెందుతున్న చదువుకున్న యువకుల ‘సాగు’ లాభాల పంట పండిస్తోంది. సాక్షి, జగిత్యాల: ఉద్యోగాలు వదిలి కొందరు, ఉన్నత చదువులు చదివి ఇంకొందరు వ్యవసాయంలోకి దిగుతున్నారు. దాని అనుబంధ రంగాల్లోనూ వస్తున్న కొత్త టెక్నాలజీని ఈ యువ రైతులు అందిపుచ్చుకుంటూ ముందంజలో ఉంటున్నారు. నూతన వ్యవసాయ పద్ధతులను ఇతర రైతులకు సైతం చెబుతూ, వారిని తమ మార్గంలోకి మళ్లేలా ప్రయత్నిస్తున్నారు. ఆయా రంగాల్లోని యువ రైతులు సంయుక్తంగా తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే చేరవేసేలా మార్కెటింగ్ కూడా చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ‘సోషల్’ సాగు అంతర్గాంకు చెందిన వామన్రెడ్డి బీటెక్ చదివాడు. వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో కూరగాయల సాగును చేపట్టాడు. వీటి సాగులో వినూత్న పద్ధతులు పాటిస్తూ.. అధిక దిగుబడులు సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒక చేయి సరిగ్గా పనిచేయకున్నా.. తానే అన్ని పనులూ చేసుకుంటాడు. కూరగాయలను స్వయంగా మార్కెట్లో విక్రయిస్తూ వినియోగదారుల మనుసు గెలుచుకుంటున్నాడు. రైతులు ఎక్కడ మోసపోయినా అక్కడ గళమెత్తడం కూడా వామన్రెడ్డి ప్రత్యేకత. రైతులను చైతన్యం చేసేందుకు ఫేస్బుక్, వాట్సాప్లను ఉపయోగిస్తున్నాడు. వారికి సస్యరక్షణ, ఆధునిక సాగు పద్ధతులపై సలహా సూచనలతో పాటు చైతన్యవంతుల్ని చేసేలా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాడు. బంగారు నాటుకోడి గుడ్డు హైదరాబాద్లో బీటెక్ చదివిన సుభాష్ది జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామం. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. మంచి జీతమే వస్తున్నా.. ఆ జీవితం తృప్తిగా లేకపోవడంతో సొంతూరు తిరిగొచ్చేశాడు. ప్రస్తుతం నాటుకోళ్లను పెంచుతూ ఉపాధి పొందుతున్నాడు. అందరూ కొత్తలో ఇదేం పనని ఆశ్చర్యపోయినా.. ఈ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. కోళ్ల నుంచి వచ్చిన గుడ్లను ప్రత్యేక పద్ధతుల్లో పిల్లలుగా మారుస్తున్నాడు. నాటుకోళ్లను అందరి మాదిరిగా షెడ్లలో కాకుండా, మామిడి, జామ తోటల్లో పెంచుతూ, డిమాండ్ను బట్టి కిలో రూ.250–రూ.300కి విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ‘పాడి’తో జోడీ లక్ష్మీపూర్కు చెందిన సురేశ్ హైదరాబాద్లో ఉంటూ బీటెక్ చదివాడు. కానీ ఎప్పటికైనా స్వయం ఉపాధి కల్పించుకుని తన కాళ్లపై తాను నిలబడాలనేది అతని లక్ష్యం. ఆ మక్కువతోనే స్వగ్రామంలో 30 ఆవులతో డెయిరీ ఫారాన్ని ప్రారంభించాడు. తొలుత నలుగురి భాగస్వామ్యంతో ఫారం నిర్వహించగా నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం సురేశ్ ఒక్కడే వినూత్న ఆలోచనలతో ఫారం నిర్వహిస్తూ ఏడాదిలోనే లాభాల బాట పట్టించాడు. ఇప్పుడు ఆవులతో పాటు గేదెల డెయిరీ కూడా నిర్వహించి నేరుగా వినియోగదారులకు పాలు విక్రయించేలా వ్యూహరచన చేస్తున్నాడు. ‘ఇంజనీరింగ్’ సేద్యం లక్ష్మీపూర్కు చెందిన స్వామిరెడ్డి ఇంజనీరింగ్ చదివాడు. తల్లిదండ్రులు ఏదో ఒక ఉద్యోగం చూసుకోవచ్చు కదా అని అంటుంటే.. తాను వ్యవసాయం చేస్తానంటూ సేద్యంలోకి దిగాడు. ఇప్పుడు నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అత్యధిక దిగుబడులు సాధిస్తుంటే ఆ తల్లిదండ్రులే మురిసిపోతున్నారు. పసుపు పంటకు డ్రిప్తో పాటు ప్రతీ పనికి ఆధునిక పరికరాలను ఉపయోగించడం స్వామిరెడ్డి ప్రత్యేకత. వ్యవసాయ పనులకు ట్రాక్టర్ను కొనుగోలు చేసి, డ్రైవర్ అవసరం లేకుండా తానే డ్రైవింగ్చేస్తూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. అలాగే, తాను ఆచరించే ఆధునిక సాగు పద్ధతులపై ఇతర రైతులకూ అవగాహన కల్పిస్తుంటాడు. -
ఆధునిక వ్యవసాయం..లాభదాయకం
- రైతులకు అందుబాటులో పరిశోధన ఫలితాలు - బెట్టను తట్టుకునే నూతన వంగడాల ఆవిష్కరణ - నంద్యాలలో ఆకట్టుకున్న కిసాన్ మేళా నంద్యాలరూరల్: ఆధునిక వ్యవసాయం లాభదాయకమని..రైతులు పాత పద్ధతులను విడనాడాలని ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎన్వీ నాయుడు, విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని డాక్టర్ వైఎస్సార్ సెంటనరీ హాల్లో ఏడీఆర్ డాక్టర్ గోపాల్రెడ్డి అధ్యక్షతన కిసాన్ మేళా నిర్వహించారు. అతిథులుగా డాక్టర్ ఎన్వీనాయుడు, డాక్టర్ రాజారెడ్డిలు మాట్లాడుతూ.. వ్యవసాయంలో మహిళలు, యువత పాత్ర పెరగాలన్నారు. నంద్యాలను సీడ్హబ్గా మార్చేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని వారు వివరించారు. తంగడంచ విత్తనోత్పత్తి కేంద్రంలో చిరు ధాన్యాలతో పాటు 21లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి బెట్టను తట్టుకొనే వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారన్నారు. నంద్యాల వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా నాలుగు రకాల కొత్త వంగడాలను ఆవిష్కరించామన్నారు. ఆర్ఏఆర్ఎస్ పురోగతి సాధించడంతో 2016–17కు ఉత్తమ జాతీయ పరిశోధనా కేంద్రం అవార్డు దక్కించుకుందన్నారు. కరువు ప్రాంతాల్లో పరిశోధనలు.. ఆర్ఏఆర్ఎస్లో నూతన పరిశోధనలకు అనువైన ఆధునిక వసతులతో పరిశోధన శాశ్వత భవనాలకు ప్రభుత్వం రూ.14కోట్లు మంజూరు చేసిందని డాక్టర్ ఎన్వీనాయుడు, డాక్టర్ రాజారెడ్డిలు తెలిపారు. కరువు ప్రాంతాల్లో కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి రైతులకు ఉపయోగపడే సూచనలు అందిస్తారన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తక్కువ వర్షపాతం ఉండటంతో పంటల సాగులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని తూర్పు ప్రాంతమైన నంద్యాలలో విత్తన ఉత్పత్తికి అనువైన వాతావరణం ఉందన్నారు. జేడీఏ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ.. ఆత్మ పథకం ద్వారా రైతులకు విజ్ఞాన యాత్ర నిర్వహిస్తామన్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కిసాన్ మేళాలో ఆకట్టుకున్న స్టాళ్లు.. కిసాన్ మేళా సందర్భంగా నంద్యాల మెడికేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ బుడ్డా శ్రీకాంత్రెడ్డి పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మినీ ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్ల ప్రదర్శనను రైతులు, పాలిటెక్నిక్ విద్యార్థులు తిలకించారు. ప్రైవేటు ఎరువులు, పురుగు మందుల కంపెనీలు కూడా స్టాళ్లు ఏర్పాటు చేసి రైతులకు సలహాలు, సూచనలు అందజేశాయి.