Minister Rajinder
-
కరువు జిల్లాపై.. కరుణ చూపేనా?
రాష్ర్ట బడ్జెట్పై పాలమూరువాసుల భారీ ఆశలు ► నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి రాజేందర్ ► ‘పాలమూరు-రంగారెడ్డి’కి ప్రాధాన్యం ఇస్తారన్న ఆశాభావం ► జిల్లా ప్రాజెక్టులకు రూ.820 కోట్ల ప్రతిపాదన ► 18 నెలలుగా ప్రాజెక్టులలో నామమాత్రపు పనులు ► నిధులు కోరిన మేరకు కేటాయించి ► పనులు చేపట్టకపోతే లక్ష్యం కష్టమే ► వలసల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలంటున్న ప్రజలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ కరువు కోరల్లో అల్లాడుతున్న పాలమూరు ప్రజలు రాజేంద్రుడిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తారని ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత పెద్ద జిల్లాగా, వెనుకబడిన ప్రాంతంగా ఉన్న పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ఈసారి బడ్జెట్లోనైనా పూర్తిస్థాయి కేటాయింపులు లభిస్తాయా అన్న అంశం చర్చనీయాంశమైంది. ప్రతి అంశంలోనూ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం.. బడ్జెట్ కేటాయింపుల్లోనూ అదేస్థాయిలో ఇస్తే తప్ప ఇక్కడి వ్యవసాయ రంగం, తద్వారా రైతులు కోలుకునే పరిస్థితి కనిపించే అవకాశం లేదు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రూపొదించిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ బడ్జెట్లో భారీ కేటాయింపులు చేస్తారని జిల్లా ప్రజలు కొండంత ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు రూ.30కోట్ల విలువైన 18 ప్యాకేజీ పనులకు సంబంధించి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. అందుకు అనుగుణంగానే పాలమూరును త్వరితగతిన పూర్తి చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించిన నిధుల ద్వారా భూసేకరణ పనులు చకచకా సాగుతుండగా, నిర్మాణ పనులకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగం పుంజుకుంది. ►జిల్లాలో గతేడాది సాగునీటి ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం 80వేల ఎకరాలకే సాగునీరందించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఐదున్నర లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించాలని లక్ష్యమని చెబుతున్నా ఆచరణలో ఎంతమేరకు వీలవుతున్నదని వేచి చూడాల్సిందే. ► జిల్లాలోని వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్య రంగాల్లో అనేక పనులు, ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉండగా అందుకు అనుగుణంగా నిధుల కేటాయింపులు లేకపోవడం, కేటాయించిన నిధులతో కొంతవరకే పనులు పూర్తవడం వంటి పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. జిల్లాలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర దుర్బిక్ష పరిస్థితి నెలకొని ఫిబ్రవరికి ముందే తాగునీటికి జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లాలో పశువులకు మేత అందుబాటులో లేక వాటిని కబేళాలకు తరలిస్తున్న దయనీయ పరిస్థితి నెలకొంది. ► జిల్లాలోని 64మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా ఇందుకు సంబంధించి ప్రభుత్వం సహాయాన్ని ఇంకా విడుదల చేయలేదు. జిల్లాలో రూ.500 కోట్ల వరకు కరువు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనాలు రూపొందించినా దీనికి సంబంధించి సాయం మాత్రం విడుదల కాలేదు. ► స్థానికంగా ఉపాధి పనులు లభించకపోవడంతో ప్రతి ఏడాది దాదాపు 4.70లక్షల కుటుంబాలు పొట్టచేత పట్టుకొని వలసబాట పడుతున్నాయి. మరోవైపు గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జిల్లాకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోవడం విశేషం. ► ఈ బడ్జెట్లో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు ఇచ్చే నిధుల కోటాను పెంచుతారన్న ఆశతో శాసనసభ్యులు సైతం ఆశతో ఉన్నారు. ప్రతి ఏడాది కేటాయించే రూ.కోటి నిధులు నియోజకవర్గ అభివృద్ధికి ఏ మూలకూ సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వం దృష్టికి తేవడంతో ఈ నిధులను రూ.2 కోట్లకు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
మంత్రి ఈటల వాహనం బోల్తా
కరీంనగర్ జిల్లాలో ఘటన టిప్పర్ను ఓవర్టేక్ చేయబోయి పల్టీలు ఈటల సహా పీఏలు, గన్మెన్లు, డ్రైవర్కు గాయాలు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలింపు మంత్రికి ఇబ్బంది లేదన్న వైద్యులు.. సీఎం కేసీఆర్ వాకబు కరీంనగర్: రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి కరీంనగర్కు ఆయన బుల్లెట్ప్రూఫ్ కారు (టొయోటా ఫార్చునర్ టీఎస్ 09పీఏ 1648)లో వెళ్తుండగా మార్గమధ్యంలో మానకొండూరు నియోజకవర్గంలోని ఈదులగట్టపల్లి సమీపంలో ఆయన వాహనం టిప్పర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పి నాలుగు పల్టీలుకొట్టి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఈటల కాలుకు గాయాలవగా పీఏలు ముకుందరెడ్డి, చంద్రమౌళి తలకు గాయాలయ్యాయి. డ్రైవర్ రఫీ, గన్మెన్ వెంకటేశ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి సహా క్షతగాత్రులను హుటాహుటిన కరీంనగర్లోని అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈటలకు ఎలాంటి ఇబ్బందిలేదని తేల్చారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్కు తరలించారు. 10 నిమిషాలు వాహనంలోనే... కరీంనగర్లో ఏర్పాటు చేసిన పెంటావాలెంట్ వాక్సిన్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి ఈటల బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం అద్దాలు తెరుచుకోకపోవడంతో ఈటల దాదాపు 10 నిమిషాలు కారులోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా సిబ్బంది కారు అద్దాలను పగలగొట్టి ఈటల సహా అందులోని వారిని బయటకు తెచ్చారు. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చినా అది వచ్చేలోపే కాన్వాయ్లోని మరో వాహనంలో ఈటలను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మంత్రి వాహనం వేగంగా వెళ్తోందని, ఆ సమయంలో ఈటల సీటు బెల్టు పెట్టుకోలేదని తెలిసింది. కాగా, ఈటలను ఎంపీ బి.వినోద్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్రెడ్డి, బొడిగె శోభ, కలెక్టర్ నీతూప్రసాద్ తదితరులు ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే సీఎం కేసీఆర్ ఈటలకు ఫోన్ చేశారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వాకబు చేశారు. సీఎం సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈటలకు కాలు విరిగిందన్న వార్తలు అవాస్తవమని అపోలో రీచ్ ఆసుపత్రి సూపరిండెంట్ నరేశ్ చెప్పారు. నాలుగోసారి ప్రమాదం... రాజకీయాల్లోకి వచ్చాక ఈటల నాలుగుసార్లు ప్రమాదానికి గురయ్యారు. 2004లో కమలాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో హైదరాబాద్లో ఆయన స్వల్ప రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అలాగే టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఉన్నప్పుడు వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ వద్ద ఈటల ప్రయాణించిన కారు డివైడర్ను ఢీకొట్టింది. గత నెల కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం మెట్పల్లి వద్ద ఆయన ప్రయాణించిన స్కార్పియో బుల్లెట్ప్రూఫ్ వాహనం చెట్టును ఢీకొంది. అయితే ప్రమాదానికి 5 నిమిషాల ముందు ఆయన వేరే వాహనంలోకి మారడంతో క్షేమంగా బయటపడ్డారు. ఆ వాహనం మరమ్మతులకు నోచుకోకపోవడంతో 10 రోజుల క్రితమే ప్రభుత్వం మరో కొత్త బుల్లెట్ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది.