breaking news
Largest business
-
22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి
Vardhman textiles Suchita Oswal Jain success story{ 22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు చేపట్టి విజయ పథంలో నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో తనకు తానే సాటి నిరూపించుకున్నారు.వర్ధమాన్ టెక్స్టైల్స్కు వైస్ ప్రెసిడెంట్ , జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచితా ఓస్వాల్ జైన్. భారతదేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ కంపెనీలలో ఒకటైన ఈ గ్రూప్ని సుచితా తండ్రి ఎస్పి ఓస్వాల్తో, తాత రత్తన్ చంద్ ఓస్వాల్ కలిసి స్థాపించారు.ఇప్పుడు ఎస్పి ఓస్వాల్ ఛైర్మన్గా ఉన్నారు. లూథియానాకు చెందిన ఓస్వాల్ కుటుంబంలోని సుచితా ఈ కుటుంబ వ్యాపారంలో మూడో జనరేషన్కుచెందిన వారు.ఏదో ఒకటి చేయాలనే కోరిక, ఏదో సాధించాలి అన్న పట్టుదలే రెండు దశాబ్దాల కృషితో కంపెనీని స్థాయికి చేర్చింది. వర్ధమాన్ టెక్స్టైల్స్ ప్రస్థానం 6000 స్పిండిల్స్తో ప్రారంభించింది.మరిపుడు సుచితా నేతృత్వంలో బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ టర్నోవర్తో భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ తయారీదారులలో ఒకటిగా అవతరించింది. 1965లో ప్రారంభమైనప్పటి నుండి, ఛైర్మన్ ఎస్పీ ఓస్వాల్ డైనమిక్ లీడర్షిప్లో టెక్స్టైల్ మేజర్గా అభివృద్ధి చెందింది. కానీ ఆ తరువాత 1990లో సుచితా కంపెనీలో చేరిన తరువాత బట్టల తయారీలో విభిన్నంగా మరింత అభివృద్ధి చెంది. 64 మగ్గాల నుండి, సంస్థ ఇప్పుడు 1544 మగ్గాలను నిర్వహిస్తోంది. సుచితా ఓస్వాల్ జైన్ ఆధ్వర్యంలోని కంపెనీ అనేక జాతీయ ,అంతర్జాతీయ క్లయింట్ల సాధించింది.పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ , తమిళనాడు వంటి 5 రాష్ట్రాలలో 20కి పైగా ఉత్పత్తి యూనిట్లు, 30 వేల మందికాగా పైగా ఉద్యోగులున్నారు. తండ్రి, పద్మభూషణ అవార్డ్ గ్రహీత ఎ స్పీ ఓస్వాల్ సమక్షంలో చిన్నతనంలోనే తయారీ కేంద్రాలను సందర్శించేది. తండ్రి మార్గదర్శకత్వంలోనే కంపెనీని నడిపించాలనీ, సమాజానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. లండన్ బిజినెస్ స్కూల్ INSEAD పారిస్ నుండి ఎంబీఏ చేసిన అనుభవంతోనె కంపెనీ శరవేగంగా ఆధునికతవైపు పరుగులు పెట్టించింది. హిమాచల్ ప్రదేశ్లోని బడ్డీలో కంపెనీ తొలి ఫాబ్రిక్ తయారీ కేంద్రాన్ని స్థాపించారు. ఆమె తరువాత డైయింగ్, ప్రాసెసింగ్, ప్రింటింగ్ యూనిట్లను జోడించింది. సుచితా ఫిక్సీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కూడా. ఇంటర్నేషనల్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ బోర్డు సభ్యురాలు. యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ మెంబర్.. 8వ వరల్డ్ ఉమెన్ లీడర్షిప్ కాంగ్రెస్ , 2021లో ఇండియా CSR లీడర్షిప్, ఔట్స్టాండింగ్ విమెన్ లీడర్ అవార్డు లభించింది. అంతేకాదు ఆమె ఇద్దరు కుమార్తెలు కంపెనీ పగ్గాలు చేపట్టి తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. తన సక్సెస్కు కారణం తన తల్లిదండ్రులే అంటారు సుచిత. వారి ప్రోత్సాహమే తన కుటుంబ వ్యాపారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో సహాయ పడిందంటారు. న్యూ డిజిటల్ టెక్నాలజీ, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఆర్థిక స్వాతంత్ర్యం వీటి పుణ్యమా అని మహిళలకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీరేం అనుకున్నారో అది సాధించడానికి నిబద్దతో కదలండి. ఎవరు బాస్ కావాలి అనేది గ్లాస్ సీలింగ్ ఏమీలేదు.విమర్శల్ని గాలికి వదిలి. రెక్కలు విప్పి ఎగరండి అంతే అని సందేశమిస్తారు సుచితా కంపెనీని మరింత అభివృద్ధి చేయడంతోపాటు,మరిన్ని దేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నాం, తద్వారా భారతీయ కార్మికులు,వ్యవస్థాపకుల అద్భుతమైన సామర్థ్యం, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటా చెప్పాలి..భారతీయ కంపెనీలు అంతర్జాతీయ రంగంలో నిజంగా బాగా రాణించగలవు అంటారామె. GAP, Uniqlo, Marks & Spencer, Target, H&M, Kohl's, Calvin Klein మొదలైన అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా కంపెనీ తన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. గతేడాది కంపెనీ టర్నోవర్ రూ.12,003 కోట్లు. -
డ్రగ్స్ తర్వాత ఇదే అతిపెద్ద వ్యాపారం
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న మానవ అక్రమ రవాణా - రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను నియంత్రిస్తున్నాం - 2014 నుంచి ఇప్పటివరకు 1,397 మందిని రక్షించాం - మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవంలో డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా సాగుతున్న వ్యాపారాల్లో డ్రగ్స్ తర్వాత స్థానంలో మానవ అక్రమ రవాణా ఉందని డీజీపీ అనురాగ్ శర్మ ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా నేతృత్వంలో పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల హక్కులు, వేధింపుల నియంత్రణకు కృషిచేస్తున్న మహితా, ప్లాన్ ఇండియా సంస్థల ప్రతినిధులు, ప్రాసిక్యూషన్ విభాగం అధికారులు కలసి పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు నుంచి సీఐడీ ఆధ్వర్యంలో వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్నామని, ఇప్పటివరకు 953 అక్రమ రవాణా కేసులు నమోదు చేశామని, 1,397మంది మహిళలు, యువతులను రక్షించామని తెలిపారు. వ్యభిచార కూపాల నుంచి బయటపడ్డ వారికి సరైన ఆధారం కల్పించి, ఆదాయ మార్గాలు చూపిస్తే మళ్లీ వ్యభిచార వృత్తిలోకి వెళ్లకుండా ఉంటారని, దీనిపై పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు నిరంతరం కృషి చేయాలని సూచించారు. సీఐడీ నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ ద్వారా వేలాది మంది బాలకార్మికులను తల్లిదండ్రుల చెంతకు పంపించామని, బాలలతో పనిచేయిస్తున్నవారిపై పీడీ యాక్ట్ పెంట్టేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణాను నియంత్రించేందుకు మరింత కృషి చేస్తామన్నారు. కాగా, ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణాదిన మానవ అక్రమ రవాణా సమస్య తక్కువగా ఉందని డీజీపీ వెల్లడించారు. మరింత సామర్థ్యం పెంచుకోవాలి... మానవ అక్రమ రవాణా నిరోధానికి పోలీసులు, న్యాయవాదులు మరింత సామర్థ్యాన్ని పెంచుకోవాలని సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఐజీ సౌమ్యామిశ్రా అభిప్రాయపడ్డారు. వ్యభిచార కూపాలు, బాలకార్మిక వ్యవస్థ, అవయవాల అక్రమ రవాణా, బలవంతపు భిక్షాటన.. ఇలా అనేక రకాలుగా కొందరు వ్యక్తులు మహిళలు, చిన్నారులను వేధిస్తున్నారని, వీరికి కఠినమైన శిక్షలు పడాలంటే పోలీసులు, న్యాయవాదులు సంయుక్తంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహితా స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ శేఖర్రెడ్డి, ప్లాన్ ఇండియా స్వచ్చంద సంస్థ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ అనితా కుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ నిపుణుడు సుధామురళీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్రావు, యునిసెఫ్ ప్రతినిధి డేవిడ్ రాజ్, సీఐడీ అధికారులు పాల్గొన్నారు. బాధితులుగా చూడాలి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ వ్యభిచార గృహాల నుంచి మహిళలను బాధితులుగా గుర్తించి కాపాడాలని, వారిని నిందితులుగా చూడవద్దని పోలీస్ అధికారులకు సూచించారు. వారు ఈసడింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉందని గుర్తుచేశారు.