breaking news
kandhamal district
-
ఓ మట్టిమనిషి.. వ్యవస్థను మార్చాడు!
-
ఓ మట్టిమనిషి.. వ్యవస్థను మార్చాడు! ఇది చదవండి..
కంధమాల్ : ఎవరికి వారే కేంద్ర బిందువులుగా ఉండే వ్యవస్థలో మార్పు.. మొదట ఒక్కరి ప్రయత్నంతోనే ఆరంభమవుతుంది. వ్యవస్థ కూడా ఆ మంచికి చేదోడుగా నిలిస్తే అదొక సమిష్టివిజయం అవుతుంది. అలా ఓ మట్టిమనిషి ఒంటరిగా తలపెట్టిన లక్ష్యం, సాధించిన విజయం గురించి ప్రపంచం చర్చించుకుంటోంది. ఆ మట్టిమనిషి పేరు జలంధర్ నాయక్. వయసు 45. ఊరు.. ఒడిశా కధమాల్ జిల్లా ఫుల్బనీ తాలూకాలోని కుగ్రామం గుమ్సాహి. ఒంటిచేత్తో కొండను తొలిచి గ్రామానికి రోడ్డు వేసిన బిహారీ దశరథ్ మాంఝీ తరహాలో.. జలంధర్ను ‘ఒడిశా మౌంటెయిన్ మ్యాన్’గా కీర్తిస్తున్నారు స్థానికులు. రెండేళ్లుగా వెలుగులోకిరాని కథ : కంధమాల్ జిల్లాలోని గుమ్సాహి గ్రామానికి కనీసం నడవడానికి అనుకూలమైన రోడ్డు కూడా లేదు. ఇక విద్యుత్, మంచినీటి సరఫరా ముచ్చట మాట్లాడకుంటేనే మేలు! భరింపశక్యం కాని పరిస్థితుల్లో మిగతావారంతా ఊరు విడిచి వెళ్లిపోయారు. కూరగాయలు అమ్ముకుంటూ అతికష్టం మీద జీవనం సాగించే జలంధర్ నాయక్ కుటుంబమొక్కడే మిగిలిందక్కడ! నాయక్ దంపతులకు ముగ్గురు కొడుకులు. పేదరికంలోనూ పిల్లల్ని చదివించాలనే పట్టుదలవారిది. రాతిదిబ్బల గుండా పిల్లలు ప్రతిరోజూ గుమ్సాహి నుంచి ఫుల్బనీలోని పాఠశాలకు నడిచివెళ్లే క్రమంలో ఎన్నోదెబ్బలు తగిలేవి. కొన్నేళ్లకు పిల్లలు ముగ్గురికీ ఫుల్బనే ప్రభుత్వ హాస్టల్లో సీట్లు దొరికాయి. రోజూవారీ కష్టాలు తప్పినా, సెలవుల్లో ఇంటికి వెళ్లిరావడం నరకప్రాయంగా ఉండేది. గుమ్సాహి గ్రామానికి రోడ్డు కోసం నాయక్ కలవని నాయకుడంటూ లేడు. కానీ ఫలితం శూన్యం. దీంతో రెండేళ్ల కిందట.. ఒకరోజు నాయక్ తనకు తానే రోడ్డు నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. భార్య కట్టిన సద్దిమూటను చేతబట్టుకుని, పలుగు-పారను భుజాన వేసుకుని అడివిలోకి నడిచాడు.. లోకల్ పేపర్లో చిన్న వార్త.. : 2018, జనవరి 9న కంధమాల్లో ఒక స్థానిక వార్తా పత్రికలో జలంధర్ గురించిన వార్త ప్రచురితమైంది. గడిచిన రెండేళ్లుగా రోజుకు 8 గంటలు కష్టపడుతూ.. అడవిలోని రాళ్లు, రప్పలను పక్కకు తొలగిస్తూ చక్కటి రోడ్డును నిర్మిస్తున్నాడని వార్త సారాంశం. గుమ్సాహి నుంచి ఫుల్బనీకి మొత్తం దూరం 15 కిలోమీటర్లు. రెండేళ్లలో జలంధర్ ఒక్కడే 8 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాడు. మిగిలిన 7 కిలోమీటర్ల రోడ్డును వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలన్నది అతడి లక్ష్యం. కంధమాల్ జిల్లా కలెక్టర్ డి. బృందా.. ఆ వార్తను చదివి ఆలోచనలో పడ్డారు. హుటాహుటిన అధికారులను పంపించి జలంధర్ నాయక్ను కలెక్టరేట్కు పిలిపించారు. ఆఫీసులో కాసేపు మాట్లాడి, ఆయన నిర్మించిన రోడ్డును చూసేందుకు బయలుదేరారు. సమిష్టి విజయం : పెద్ద వాహనాలు కూడా సులువుగా ప్రయాణించగలిగినంత పెద్ద రోడ్డును చూసి కలెక్టర్ బృందా ఆశ్చర్యపోయారు. మిగిలిన 7 కిలోమీటర్ల రోడ్డును ప్రభుత్వమే నిర్మిస్తుందని జలంధర్కు మాటిచ్చారు. అంతేకాదు.. 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మించినందుకు అతనికి పూర్తివేతనాన్ని ఉపాధి హామీ పథకం కింద చెల్లించేందుకు ఏర్పాట్లుచేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యేవరకు పనులు పర్యవేక్షించే బాధ్యతను జలంధర్కే కట్టబెట్టారు. గుమ్సాహి గ్రామానికి రోడ్డుతోపాటు విద్యుత్, మంచినీటి సరఫరా పనులుకూడా ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో జరుగనున్న కధమాల్ ఉత్సవాల్లో జలంధర్ను ఘనంగా సత్కరించనున్నారు. వేర్వేరు ఊళ్లలో బతుకుతున్న గుమ్సాహి వాసులంతా స్వగ్రామబాట పట్టడం అప్పుడే మొదలైంది. ‘ఇంకొన్ని రోజుల్లోనే మా బిడ్డలు సునాయాసంగా ఇంటికొచ్చివెళ్లే పరిస్థితి వస్తుంది. ఆలస్యంగానైనా మమ్మల్ని గుర్తించిన అధికారులకు ధన్యవాదాలు’’ అంటున్నాడు వ్యవస్థను మార్చిన మట్టి మనిషి జలంధర్ నాయక్. కంధమాల్ కలెక్టర్ బృందా, పక్కన జలంధర్ దంపతులు 22 ఏళ్లు శ్రమించి కొండను తొలిచి రోడ్డు నిర్మించిన జీతన్ మాంఝీ(ఫైల్ ఫొటో) -
అత్యాచారాలు..అఘాయిత్యాలు
కొందమాల్ జిల్లాలో ఆదివాసీ బాలికల పరిస్థితి దయనీయంగా ఉంది.. కౌమార దశలో శారీరక మార్పుల గురించి ఆదివాసీ బాలిలకు అవ గాహన లేకపోవడాన్ని కామాంధులు అవకాశంగా తీసుకుంటున్నారు.. ఏం జరిగిందో తెలుసుకునేలోగా బాలికలు గర్భం దాలుస్తున్నారు.. ఆడుకునే వయసులోనే తల్లులు కావడంతో వారు పలు ఇబ్బందులు పడుతున్నారు.. ఆదివాసీ బాలికలు, యువతులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నవారిలో ధనమదాంధులు, అధికారులు ఉన్నారు. బరంపురం : కొందమాల్ జిల్లాలోని పలు కన్యాశ్రమాల్లో పద్నాలుగేళ్ల బాలికలు గర్భవతులు కావడం రాష్ట్రంలో కలకలం రేపింది. బాధితుల్లో కొందరు యువతులపై లైంగిక దాడి జరిగింది. కానీ ఏం జరిగిందో, ఎవరు లైంగిక దాడికి పాల్పడ్డారో చెప్పలేని స్థితిలో బాలికలు ఉన్నారు. లైంగిక దాడి ఫలితంగా తాము గర్భం దాల్చిన విషయం కూడా తెలియకపోవడంతో బాలికలు అడవిలో కట్టెలు కొట్టుకునేందుకు వెళుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే గర్భవతులైన బాలికలు మృతి చెందుతున్నారు. అండగా ఉండని పాలకులు ఆదివాసీల అమాయకత్వమే బాలికల పాలిట శాపమైంది. లైంగిక దాడికి గురైన బాలికల్లో ఎక్కువ మంది చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల బాధిత గిరిజనులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి చిత్రహింసల పాల్జేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దాడులకు పాల్పడే కామాంధులకు, రాజకీయ నాయకులకు అటవీ, పోలీసు అధికారులు మద్దతుగా నిలుస్తున్నారని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లూ... ఆదివాసీ గ్రామాల్లో యువతులు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిలో సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారని తెలియడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల కిందట దరింగబడి బ్లాక్పరిధిలోని సిమన్బడి ఆదివాసీ గ్రామంలో ముగ్గురు యువతులపై సీఆర్పీఎఫ్ జవాన్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కొందమాల్ జిల్లా రైకియా బ్లాక్ పరిధిలోని దాసింగబడి గ్రామ ఆదివాసీ బాలికపై సీఆర్పీఎఫ్ జవాన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన ఆదివాసీలు జవానును హత్య చేసినట్లు తెలిసింది. ఆదివాసీలపై జరుగుతున్న దాడులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ఈ ఘటనను అధికారులు కప్పిపుచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. అవగాహన పెరగాలి దేశంలో శిశు మరణాల్లో కొందమాల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జాతీయ శిశు సంక్షేమ శాఖ ఒక నివేదికలో పేర్కొంది. కౌమార దశలో వచ్చే శారీరక మార్పులపై బాలికలకు అవగాహన ఉండకపోవడం కారణమని అధికారులు పేర్కొన్నారు. దీంతో వారికి అవగాహన కల్పించాల్సి ఉంది. కౌమార దశలో వచ్చే శారీరక మార్పులపై వివరించేందుకు గిరిజన గూడలకు ఆరోగ్య కల్యాణి సమితి, అంగన్వాడీ కార్యకర్తలు వెళుతున్నారని జిల్లా ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. గిరిజన గూడలకు వారు వెళ్లినపుడు ఆదివాసీ మహిళలు పనులకు వెళ్లిపోతున్నారని తెలిపారు. ఆదివాసీ బాలికల రక్షణకు చర్యలు ఆదివాసీల సంక్షేమానికి, రక్షణకు ప్రభుత్వం పలు చట్టాలు రూపొందించింది. బిజూ కొందమాల్ జిల్లా పథకం పేరుతో ప్రత్యేక పథకాన్ని కొందమాల్ జిల్లాలో అమలు చేస్తోంది. ఆదివాసీ బాలికల కోసం ప్రత్యేక కన్యాశ్రమాలు ఏర్పాటు చేశాం. ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నా కొన్ని చోట్ల ఆదివాసీ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్న మాట వాస్తవం. దీనిపై క్యాబినెట్లో చర్చించి కొందమాల్ జిల్లాలో బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. -ఉషారాణి, రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరూ పట్టించుకోవడం లేదు దరింగబడి సమితి సిమన్బడి ఆదివాసీ గ్రామ ంలో మౌలిక సౌకర్యాలు లేవు. తాగేందుకు నీరు, రహదారులు, విద్యుత్ సౌకర్యం లేదు. ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఆదివాసీ బాలికలపై లైంగికదాడులను అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. -సైరమా మల్లిక్, సిమన్బడి గ్రామం ఆందోళన చేసినా స్పందించడం లేదు కొందమాల్ జిల్లాలో యుక్తవయసకు వచ్చిన ఆదివాసీ బాలిక లు లైంగికదాడులకు గురవుతున్నారు. బాధిత బాలికలకు రక్షణ కల్పి ంచాలని, దోషులను శిక్షణించాలని కోరుతూ దక్షణాంచల్ ఆరీ ్డసీ, కలెక్టర్ కార్యాలయాల వద్ద పలుమార్లు ఆందోళన చేశాం. యుక్తవయసులో వచ్చే మార్పులపై ఆదివాసీ బాలికలకు వివరించేందుకు అవ గాహన శిబిరాలు ఏర్పా టు చేయాలని కోరాం. కానీ పాలకులు, అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వ వైఫల్యమే ఈ పరిస్థితికి కారణం. - ప్రమీలాదేవి త్రిపాఠి, అధ్యక్షురాలు, మహిళా కల్యాణ సమితి