ISI terrorist
-
మరో దాడి జరిగితే యుద్ధమే..!
ముంబై పీడకలకు పదేళ్లు. దేశ ఆర్థిక రాజధానిని తూటాల వర్షంతో చిన్నాభిన్నం చేసిన ఉగ్ర విధ్వంసం జరిగి దశాబ్దం గడిచింది. దేశ భద్రతకు సవాలుగా నిలిచిన పాకిస్తాన్ ఉగ్ర కుట్ర జరిగి పదేళ్లయింది. నేటికి సరిగ్గా పదేళ్ల కిత్రం ముంబైపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన 12 మంది లష్కరే రాక్షసుల బారిన పడి 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్లో ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఆధునిక శిక్షణ పొందిన ఆ ఉగ్రవాదులను మట్టుపెట్టే క్రమంలో సందీప్ ఉన్నికృష్ణన్, హేమంత్ కర్కరే, విజయ్ సలాస్కర్, అశోక్ కామ్టే తదితర సాహస అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనకు పదేళ్లయిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు.. ముంబై/వాషింగ్టన్: 26/11 అంతటి తీవ్ర దాడులు భారత్పై మరోసారి జరిగితే భారత్, పాక్ల మధ్య ప్రాంతీయ యుద్ధం సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 2008 నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. ఈ దాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడనీ, దాడికి కారకులను శిక్షిస్తామని ఇచ్చిన మాటను పాక్ నిలబెట్టుకోలేదని వారు పేర్కొన్నారు. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) మాజీ అధికారి బ్రూస్ రీడెల్ మాట్లాడుతూ ‘26/11 దాడి సూత్రధారులకు శిక్ష పడటాన్ని బాధిత కుటుంబాలు ఇంకా చూడాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ వైఖరి చూస్తుంటే ఇది దాదాపుగా అసాధ్యమనిపిస్తోంది. ఇంతటి తీవ్రమైన దాడి మరోసారి జరిగితే ఇక యుద్ధం అనివార్యం కావొచ్చు’ అని అభిప్రాయ పడ్డారు. దాడుల సమయంలో అమెరికాలో పాక్ రాయబారిగా పనిచేసిన హుస్సేన్ హక్కానీ మాట్లాడుతూ ‘ఇంకో దాడి జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అయితే 26/11 దాడుల సూత్రధారులను శిక్షిస్తామన్న తమ హామీని పాక్ నిలబెట్టుకోవాలి. కానీ వారందరినీ పాక్ వదిలేసింది. అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంటే భారత్పై ఉగ్రదాడికి పాల్పడిన వారిని తాము ఉపేక్షిస్తామని పాక్ పరోక్షంగా చెబుతోంది’ అని అన్నారు. దాడుల సమయంలో అమెరికా జాతీయ భద్రతా మండలి దక్షిణాసియా విభాగ డైరెక్టర్గా ఉన్న అనీశ్ గోయెల్ మాట్లాడుతూ ‘భారత్–పాక్ల యుద్ధాన్ని నివారించడమే నాడు మా ప్రధాన లక్ష్యం. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్కు ఫోన్ చేసి సంయమనం పాటించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఓ దశలో పాక్పై భారత్ యుద్ధానికి దిగుతుందని కూడా నాడు అనిపించింది’ అని చెప్పారు. పోలీసులు ఉగ్రవాదుల్ని పారిపోనిచ్చారు ఫొటో జర్నలిస్ట్ సెబాస్టియన్ ముంబై మారణహోమం సందర్భంగా ఉగ్రవాదులను నిలువరించే అవకాశమున్నప్పటికీ భయపడ్డ మహారాష్ట్ర పోలీసులు వారిని పారిపోనిచ్చారని కసబ్ ఫొటోను షూట్చేసిన జర్నలిస్ట్ సెబాస్టియన్ డిసౌజా అలియాస్ సబీ(67) తెలిపారు. ముంబై దాడులకు నేటితో పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2008, నవంబర్ 26న నేను ఆఫీసులో పనిచేసుకుంటుండగా పక్కనే ఉన్న సీఎస్టీలో కాల్పుల శబ్దం వినిపించింది. వెంటనే నా కెమెరా, లెన్సులు తీసుకుని కిందకు పరిగెత్తాను. రైల్వేస్టేషన్లోకి దూరి ఓ బోగీలో దాక్కున్నా. కానీ అక్కడి నుంచి ఫొటో తీయడానికి యత్నించగా కుదరలేదు. దీంతో మరో బోగీలోకి వెళ్లి ప్లాట్ఫామ్పై ఉన్న ఉగ్రవాదుల ఫొటోలు తీశాను’ అని చెప్పారు. క్రూరంగా నవ్వుతూ కాల్పులు సీఎస్టీ అనౌన్సర్ విష్ణు ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) రైల్వేస్టేషన్ లో క్రూరంగా నవ్వుతూ అమాయకులపై గుళ్ల వర్షం కురిపించిన ఉగ్రవాది కసబ్ ముఖం తనకు ఇంకా గుర్తుందని ఆరోజు అనౌన్సర్గా విధులు నిర్వర్తిస్తున్న విష్ణు జెందె(47) గుర్తుచేసుకున్నారు. ‘నవంబర్ 26న రాత్రి 9.15 గంటల సమయంలో రైల్వేస్టేషన్లో పెద్ద శబ్దం వినిపించగానే ఏదో పేలుడు జరిగిందనుకున్నా. కానీ ఇద్దరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని వస్తుండటాన్ని చూడగానే ఇది ఉగ్రదాడి అని అర్థమైపోయింది. ప్రయాణికులందరూ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లిపోవాలనీ, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని ప్రజల్ని అప్రమత్తం చేశా. ఉగ్రవాదులకు దూరంగా ఉన్న ప్లాట్ఫామ్ 1 దగ్గరి నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పా. ఘటనాస్థలికి చేరుకోవాల్సిందిగా రైల్వే పోలీసులను కోరాను. మరోవైపు సహచరుడితో కలిసి ప్లాట్ఫామ్పైకి చేరుకున్న కసబ్ క్రూరంగా నవ్వుతూ, దూషిస్తూ ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు’ అంటూ నాటి అనుభవాలను విష్ణు గుర్తుచేసుకున్నారు. రెండుసార్లు ఫెయిల్ ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డ పాక్ పౌరుడు కసబ్కు లష్కరే తోయిబా కరాచీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తాజాగా వెల్లడైంది. ప్రము ఖ చరిత్రకారుడు సరోజ్ కుమార్ రత్ కసబ్ విచారణాధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ రాసిన ‘ఫ్రజైల్ ఫ్రంటియర్స్: ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ముంబై టెర్రర్ అటాక్స్’ పుస్తకంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ‘కసబ్కు తొలుత నావికుడిగా, చేపలుపట్టేలా ఐఎస్ఐ అధికారులు, లష్కరే తోయిబా కమాండర్లు రెండేళ్లు శిక్షణ ఇచ్చారు. అయితే ఉగ్రదాడి కోసమే ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పలేదు. ఇది ఎవరికైనా తెలిస్తే భారత్పై దాడిచేసే మార్గాలు మూసుకుపోతాయన్న భయంతో టాప్ కమాండర్లు హఫీజ్ సయీద్, జకీవుర్ రెమ్మాన్ లఖ్వీ గోప్యత పాటించారు. ముంబైపై 2008, నవంబర్ 26న దాడికి ముందు లష్కరే చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2008, సెప్టెంబర్లో ఉగ్రవాదులను తీసుకెళుతున్న బోటు సముద్రంలో ఓ రాయిని ఢీకొని మునిగిపోయింది. దీంతో లష్కరే వర్గాలు కొనప్రాణాలతో ఉన్న తమ ఉగ్రవాదుల్ని కాపాడాయి. ఇక రెండోసారి నవంబర్ 7న ఉగ్రవాదుల బృందం మరోసారి భారత్కు బయలుదేరింది. ఈ సందర్భంగా భారత్కు చెందిన ఓ బోటు కెప్టెన్ను లొంగిపోవాల్సిందిగా ఉగ్రవాదులు కోరగా, అతను నిరాకరించి పడవను వేగంగా తీసుకెళ్లిపోయాడు. ‘ఆపరేషన్ కసబ్’ ఇలా.. ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది కసబ్ను ఉరితీసేందుకు ఏర్పాట్లు చాలా రహస్యంగా సాగాయని ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘కసబ్ను ఉరితీయడం కోసం ఆర్థర్రోడ్ జైలులోని అండా సెల్ నుంచి పుణెలోని ఎర్రవాడ కేంద్ర కారాగారానికి తరలించడానికి నవంబర్ 20న రాత్రి ఏర్పాట్లు పూర్తిచేశాం. రాత్రిపూట కసబ్ను పోలీస్ వ్యానులో ఎక్కించాం. మహారాష్ట్ర పోలీసులకు చెందిన ఫోర్స్ వన్ కమాండో బృందం ఈ వాహనానికి రక్షణగా బయలుదేరింది. ఎక్కువ కార్లు ఒకేసారి వెళితే అనుమానం రావొచ్చన్న ఆలోచనతో రాష్ట్ర రిజర్వు పోలీస్ బలగాలు కొంతదూరం నుంచి ఈ వాహనాలను వెంబడించాయి. ఈ ఆపరేషన్ ముగిసేవరకూ ఇందులో పాల్గొన్న అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. అర్ధరాత్రి కసబ్ను ఎర్రవాడ జైలు అధికారులకు అప్పగించగానే..‘పార్సిల్ రీచ్డ్ ఫాక్స్’ అంటూ పోలీస్ ఉన్నతాధికారి సంకేత భాషలో మిగతావారికి సమాచారం చేరవేశారు. ఉరితీత నోటీసులను వారంరోజుల కసబ్కు అందజేశాం. చివరికి నవంబర్ 21న తెల్లవారుజామున 3 గంటలకు కసబ్ను ఉరితీశారు. ఆ తర్వాత కసబ్ ఉరి వార్త ప్రపంచమంతా తెలిసిపోయింది’ అని అప్పటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. -
ఉగ్రవాది భత్కల్ను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
కోర్టు హాల్ నుంచి పేపర్ విసరడంతో కలకలం.. నాగోలు: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు, ఐఎస్ఐ ఉగ్రవాది యాసిన్ భత్కల్తో పాటు మరికొంత మంది నిందితులను కేసు విచారణ నిమిత్తం సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. చర్లపల్లి జైలు అధికారులు భారీ బందోబస్తు మధ్య వీరిని కోర్టుకు తీసుకొచ్చి జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ సమయంలో భత్కల్ కోర్టు హాల్ కిటికీలోంచి బయటికి తాను రాసిన పేపర్ను విసిరాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్కడే ఉన్న పోలీసు అధికారులు వెంటనే అప్రమత్తమై ఆ కాగితాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం భత్కల్తో పాటు మిగతా నిందితులను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, ఎన్ఐఏ అధికారులు కావాలనే తనను వేధిస్తున్నారని, తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని కోర్టులో భత్కల్ పిటిషన్ వేసినట్లు తెలిసింది. కాగా, పేపర్ విషయంపై ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్రెడ్డిని వివరణ కోరగా తాము ఎలాంటి పేపర్ను స్వాధీనం చేసుకోలేదన్నారు. -
ఎన్కౌంటర్పై హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
-
ఐదుగురిని కాల్చి చంపిన పోలీసులు
-
ఎవరీ వికారుద్దీన్
-
ఐఎస్ఐ ఉగ్రవాదికి ఐదేళ్ల జైలు
పాక్ శిక్షణతోనే పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కోర్టులో సాకిర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశంలోని అమెరికా, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాల పేల్చివేతకు కుట్ర పన్నిన ఐఎస్ఐ ఏజెంట్, శ్రీలంక జాతీయుడైన ఉగ్రవాది మహమ్మద్ సాకిర్ హుస్సేన్కు చెన్నైలోని ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. చెన్నైలోని అమెరికా కాన్సులేట్, బెంగళూరులోని ఇజ్రాయిల్ కాన్సులేట్లను పేల్చి వేసేందుకు పేలుడు పదార్ధాలను తరలించడం, నకిలీ కరెన్సీని చలామణిలోకి తెచ్చారనే ఆరోపణలపై ఇతనితోపాటు మరో ఇద్దరిపై గత నెలలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అభియోగాలు మోపింది. కేసును విచారించిన కోర్టు సాకిర్కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఐజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. తనకు శిక్షణనిచ్చింది పాకిస్తాన్ ఐఎస్ఐ విభాగమని, దాని ప్రేరణతోనే ఉగ్రవాదిగా మారినట్లు జాకీర్ కోర్టులో బహిరంగంగా ఒప్పుకున్నాడని, ఇది దేశ చరిత్రలోనే తొలిసారని ఆయన వెల్లడించారు. శ్రీలంకకు చెందిన ఆర్మీ అధికారి అబిద్సిద్దిఖీతోపాటు నితిన్ అని పేరు మార్చుకున్న మరో అధికారి.. సాకిర్కు ఉగ్రవాద కార్యకలాపాలపై శిక్షణ నిచ్చారని ఆయన వివరించారు. -
12 ప్రాంతాల పై గురి!
జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రెండురోజుల క్రితం అరెస్ట్ చేసిన తీవ్రవాది అరుణ సెల్వరాజ్ సాదాసీదా నేరస్తుడుకాదని తేలిపోయింది. తమిళనాడుతోపాటు పొరుగు రాష్ట్రాల్లో సైతం దారుణ విధ్వంసాలకు కుట్రలు పన్నినట్లు తేటతెల్లమైంది. ఒక్క చెన్నై నగరంలోనే 12 ప్రాంతాలను ఎంచుకున్నట్లు వెల్లడైంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: విధ్వంసాలకు చెన్నై నగరంలోని 12 ప్రాంతాలను ఎంచుకున్నట్టు తీవ్రవాది అరుణ్సెల్వరాజ్ వెల్లడించడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. విచారణలో అనేక విషయాలు వెలుగుచూశాయి. ఇందులో ప్రధానంగా.. శ్రీలంకలో ఒక స్టార్ హోటల్ యజమానిగా అరుణ్ సెల్వరాజ్ 2009 వరకు ఆడంబర జీవితాన్ని అనుభవించాడు. ఆ తరువాత వ్యాపారంలో నష్టం రావడంతో రోడ్డున పడ్డాడు. తన పాత, కొత్త జీవితం తలుచుకుని దుఃఖించేవాడు. దీనిని అవకాశంగా తీసుకున్న ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఒక ఆటో డ్రైవర్ తన సహచరుడిని పరిచయం చేశాడు. అరుణ్ చేతిలో అతను సహాయంగా రూ.10వేలు పెట్టాడు. దీనికి ఆనందపరవశుడైన అరుణ్ను క్రమేణా తీవ్రవాద ఉచ్చులోకి దింపారు. తాము చెప్పిన పనులుచేస్తే మళ్లీ కోట్ల రూపాయాలు కళ్లచూడవచ్చని నూరిపోశారు. డబ్బుకు దాసోహమైన అరుణ్ కేవలం 28 ఏళ్ల వయస్సులోనే తీవ్రవాదిగా మారిపోయాడు. శ్రీలంక, భారత్లో స్వేచ్ఛగా సంచరించేలా పాకిస్తాన్ అతనికి పాస్పోర్టు సమకూర్చింది. 2009లో విద్యార్థి వీసాపై చెన్నై చేరుకుని సాలిగ్రామంలో నివాసం ఉంటూ ఈవెంట్ మేనేజర్గా అవతారం ఎత్తాడు. ఆకాశంలో ఎగిరే బెలూన్లో పెళ్లి నిర్వహించి ప్రముఖునిగా మారిపోయాడు. ఈపేరు ప్రతిష్టలను అడ్డంపెట్టుకుని హార్బర్లలో, షిప్పులలో పెళ్లికి ప్రత్యేక అనుమతులు సంపాదించాడు. అదేసమయంలో హార్బర్ నలుమూలలా ఫొటోలుతీసి పాకిస్తాన్కు పంపేవాడు. ముంబయి తాజ్హోటల్ దాడులవలే అవకాశాలను తెలుపుతూ సముద్రతీరాలను అధ్యయనంచేసి ఫొటోలు పంపాడు. ఐఎస్ఐ ఆదేశాల మేరకు విమానం నడిపే శిక్షణకు దరఖాస్తు చేసుకున్నాడు. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలను విమాన హైజాక్తో బిల్లాడెన్ కూల్చివేసేందుకు అరుణ్ను ఉపయోగించుకోవాలని ఐఎస్ఐ భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విమాన శిక్షణకు అరుణ్ సమర్పించిన సర్టిఫికెట్లన్నీ నకిలీవిగా తేలడంతో వారి అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. పాకిస్తాన్లో కుట్ర, శ్రీలంకలో వ్యూహరచన, తమిళనాడులో అమలుగా ఇతని కార్యకలాపాలు సాగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. 12 ప్రాంతాలపై దృష్టి నాలుగేళ్లుగా చెన్నైలో ఉంటూ నగరంలోని 12 ప్రాంతాలలో విధ్వంసాలు సృష్టించేందుకు అనుకూలమని అరుణ్ పాకిస్తాన్కు సమాచారం చేరవేసినట్లు పోలీసులు కనుగొన్నారు. మెరీనా తీరంలోని సముద్రతీర గస్తీదళ కేంద్రం, కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం, పోలీస్ డీజీపీ కార్యాలయం, కోయంబేడులోని బస్స్టేషన్, మార్కెట్, సెంట్రల్ స్టేషన్, సెంట్రల్ ఎదురుగా ఉన్న జీహెచ్, తరమణిలోని టైడల్పార్క్, పరంగిమలైలోని ఆఫీసర్స్ శిక్షణ కేంద్రం, వండలూరులోని జాతీయ ప్రత్యేక భద్రతా దళం కేంద్రాల ఫొటోలను అరుణ్ సేకరించినట్లు సమాచారం. అరుణ్ నుంచి స్వాధీనం చేసుకున్న లాప్టాప్లో అనేక మెయిళ్లు బయటపడ్డాయి. నగరంలో రద్దీ కూడళ్లు, వాటికి దారితీసే మార్గాలతో సహా పాకిస్తాన్కు చేరవేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం కొత్తగా సిద్ధం చేస్తున్న హరిహంత్ అనే సబ్మెరీన్ వివరాలను సైతం ఐఎస్ఐ ఆదేశాల మేరకు సేకరిస్తున్నాడు. ఇప్పటి వరకు వెల్లడైన వివరాలను బట్టి అరుణ్ సెల్వరాజ్ సాధారణ తీవ్రవాది కాదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీకి తీసుకుంటే మరిన్ని నిజాలు, కుట్రలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.