breaking news
Indigenous movement
-
మారణహోమానికి ఆనవాలు.. పాతికేళ్లపైనే ఒంటరిగా బతికి..
నాగరికత నేర్చిన మనిషి.. స్వార్థంతో దండకారణ్యంపై దాడులకు దిగాడు. నాశనం చేసే క్రమంలో మారణహోమానికి పాల్పడ్డాడు. అందుకు సజీవ సాక్ష్యంగా మిగిలింది ఆ ఒక్కడు. తన వాళ్లను బలిగొన్నందుకు మనుషుల మీద ద్వేషంతో రగిలిపోయాడు. దాదాపు పాతికేళ్లకు పైనే ఎవరినీ దగ్గరకు రానీయకుండా ‘ఒంటరి’ జీవనం గడిపి.. చివరకు అడవితల్లి ఒడిలో దిక్కుమొక్కులేకుండా ప్రాణం విడిచాడు. ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన.. అదే సమయంలో ఆలోచింపజేసిన ది మ్యాన్ ఆఫ్ ది హోల్ ఇక లేడు. బ్రెజిల్ పశ్చిమ ప్రాంతం రోండోనియా రాష్ట్రం అమెజాన్ అడవుల గుండా దాదాపు పాతికేళ్లకు పైనే(వీడియో, ఫొటో రికార్డింగ్ల ఆధారంగా) ఈ ఒంటరి మనిషి జీవనం కొనసాగింది. పేరు, ఏ తెగకు చెందిన వ్యక్తి అనే విషయాలపై ఎవరికీ స్పష్టత లేదు. కానీ, 1996లో తొలిసారిగా ది ఇండియన్ ఫౌండేషన్ బృందం అతన్ని గుర్తించి అనుసరించటం మొదలుపెట్టింది. మార్చి 19, 2011న ఓ వీడియోను తీయగా.. చాలా ఆలస్యంగా 2018లో ఆ వీడియోను బయటి ప్రపంచానికి విడుదల చేశారు. చెట్టును నరుకుతూ కనిపిస్తున్న ఆ వ్యక్తి.. అర్థనగ్నంగా ఉన్నాడు. ముఖం స్పష్టంగా కనిపించటం లేదు. దూరం నుంచి అతన్ని వీడియో తీసినట్లు తెలుస్తుంది. చాలా కాలం అతన్ని వెంబడించాక.. చివరకు అతని ముఖం కెమెరాకు చిక్కింది. కానీ.. దగ్గరికి వెళ్తే.. దాడి ఎవరైనా అతన్ని చూసినా.. దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తే.. దాడి చేసేవాడు. బాణాలు, ఈటెలు విసరడం లేదంటే.. అడవి గుండా ఉచ్చులు పన్ని వాటిలో పడేలా చేసేవాడు. అయితే.. చంపేవాడు మాత్రం కాదు. తనకు దూరంగా ఉండాలని హెచ్చరించడమే అతని ఉద్దేశంగా ఉండేది. 1970 నుంచి ఆ ప్రాంతంలో మనుషుల దాడులకు బలైన ఆదివాసీ తెగలకు చెందిన వ్యక్తనే అభిప్రాయం మాత్రం ఇన్నాళ్లూ నడుస్తూ వచ్చింది. ఆ అభిప్రాయం ఏర్పడడానికి ప్రధాన కారణం.. అతని జీవన శైలి. గొతులు తవ్వి వాటిలో దాక్కోవడం, వాటి ద్వారానే జంతువులను వేటాడి ఆకలి తీర్చుకోవడం చేస్తూ వచ్చాడు కాబట్టి. అంతేకాదు.. అక్కడొక గుడిసె వేసుకుని కొన్నాళ్లపాటు జీవించాడతను. 2018లో ప్రభుత్వం అతన్ని చిత్రీకరించిన తర్వాత.. అది గమనించి అక్కడి నుంచి మకాం మార్చాడతను. విషాదం ఉండొచ్చు..! పేరు, ఏం భాష మాట్లాడతాడో తెలియని ఈ ఆదివాసీకి.. మ్యాన్ ఆఫ్ ది హోల్ అనే పేరు మాత్రం ముద్రపడిపోయింది. కానీ, మనుషులంటే ద్వేషం కలగడానికి ప్రధాన కారణం.. వాళ్లు అతని తెగను బలిగొనడమే!. బ్రెజిల్లో అమెజాన్ సరిహద్దు గుండా అటవీ ప్రాంతాల్లో పలు 30కిపైగా ఆదివాసీ తెగలకు చెందిన ప్రజలు జీవిస్తూ ఉండేవారు. అయితే 2003లో పాస్ట్రోల్ ల్యాండ్ కమీషన్ యాక్ట్(2003) వచ్చాక భూ ఆక్రమణలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో భూస్వాములు.. ఆయా తెగలపై దాడులు చేసి వాళ్ల ప్రాణాలను బలిగొన్నారు. బహుశా అలాంటి ఓ తెగకు చెందిన వ్యక్తే ఇతను అయి ఉంటాడని ఇండియన్ ఫౌండేషన్ బృందం ఒక అంచానికి వచ్చింది. 1996లో అతని తెగ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉంటుందనేది మరో అంచనా. ఆహార సాయం కూడా వద్దనే.. తనారు ప్రాంతంలో 1970 నుంచి ఈ దండకారణ్యంలో భూ ఆక్రమణలతో మారణ హోమం కొనసాగింది. అమెజాన్ అడవులనే నమ్ముకుని బతికిన ఆదివాసీ జాతులెన్నో తుడిచిపెట్టుకుపోయాయి. అలాంటి ఓ తెగకు చెందిన వ్యక్తే ఇతను కావొచ్చని అధికారులు అంటున్నారు. ఆహార సాయం అందించినా కూడా.. ఎవరినీ నమ్మేవాడు కాదతను. వాటిని చీధరించుకుని దూరంగా వెళ్లిపోవడం అందుకు మరింత బలం చేకూర్చిందని చెప్తున్నారు సర్వైవల్ రీసెర్చ్ అండ్ అడ్వొకసీ డైరెక్టర్ ఫియానా వాట్సన్. 80వ దశకంలో ఆదివాసీలకు సాయం పేరిట చక్కెర, ఇతర దినుసుల్లో ఎలుకల మందు కలిపి ఘోరంగా హత్యలు చేసుకుంటూ వెళ్లారని ఆనాటి మారణహోమాన్ని గుర్తు చేస్తున్నారామె. An isolated Indigenous man known as the “man of the hole” has died in the Amazon; he is thought to be the last of his tribe He resisted all attempts to contact him over decades, during which his family was killed. He shot arrows at anyone who came closehttps://t.co/7dK2NiQt7z pic.twitter.com/lTFuWKyDEO — philip lewis (@Phil_Lewis_) August 28, 2022 అమెజాన్ పట్ల నిర్లక్ష్యం, ఆదివాసీల పట్ల చిన్నచూపుతో అధ్యక్షుడు బోల్సోనారో.. ప్రకృతిని నాశనం చేస్తూ పోతున్నాడు. కానీ, ఆ అడవినే నమ్ముకున్న తెగలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వినాశనాన్ని అడ్డుకుని తీరతామంటూ శపథాలు చేస్తున్నాయి. అలా పోరాటంలోనే ఒంటరి అయిన మ్యాన్ ఆఫ్ ది హోల్ కన్నుమూసి.. కూలిపోయిన స్థితిలో ఓ పాకలో ఆగస్టు 23న కనిపించాడు. అతని మరణానికి గల కారణాలు తెలియరావాల్సి ఉన్నప్పటికీ.. నాగరికత నేర్చిన మనిషి తన మారణహోమం మాత్రం ఎట్టకేలకు పూర్తి అయ్యిందని ఫియానా బాధతో చెప్తోంది. ఇదీ చదవండి: మేకప్ లేకుండా అందాలపోటీలో ఆమె.. చరిత్రలో తొలిసారి -
చక్కని చేనేతకు సురయ్యా చేయూత
ఆమె పేరు సురయ్యా హసన్ బోస్...వారిది స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబం.ఇంట్లో అందరూ ఖాదీప్రియులే... గాంధేయవాదులే హస్తకళలకు వేదిక వేసిన నేత ఆమె తండ్రి. అదే స్ఫూర్తి... అదే చైతన్యంతో ముందుకు నడిచారామె. ఢిల్లీ, లండన్లలో హస్తకళలు, చేనేతలలో అధ్యయనం చేశారు. సంప్రదాయరీతుల మనుగడకే జీవితాన్ని అంకితం చేశారు. ఆ సేవ కొనియాడదగినది అని గుర్తించిన యుధ్వీర్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మక ‘యుధ్వీర్ అవార్డు’ను ప్రకటించింది. సురయ్యా ఈ రోజు ఆ అవార్డును అందుకుంటున్న సందర్భంగా... ముప్పై ఏళ్లుగా ఆమె చేస్తున్న కృషి... వివరాల సుమాహారం!! స్వదేశీ ఉద్యమం నాడు పట్టిన చరఖా... స్వదేశీ ఉద్యమంలో మా కుటుంబం మొత్తం పాల్గొన్నది. నాకు ఊహ తెలిసే నాటికి మా ఇంట్లో అందరూ చరఖాతో నూలు వడుకుతుండేవారు. ఖాదీనే ధరించేవారు. అందరూ స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నారు. మా చిన్నాన్న అబిద్ హుస్సేన్ సఫ్రానీ సుభాష్ చంద్రబోస్తో పనిచేశారు. వారి స్ఫూర్తితో నేను ఇప్పటికీ చరఖాను వదల్లేదు. - సురయ్యా హసన్ బోస్, చేనేత పరిశ్రమ నిర్వాహకురాలు హైదరాబాద్లో ఉస్మానియా కాలనీ రోడ్, దర్గా హుస్సేన్ షా వలి... సురయ్యా హసన్ బోస్ ఇల్లు. విశాలమైన ప్రాంగణంలో ఓ వైపు సఫ్రానీ- అరబిందోబోస్ ఇంగ్లిష్ మీడియం స్కూలు, అనేకరకాల చెట్లు, పూల మొక్కలు, పంజరంలో రామచిలుక, తెల్లపావురాలు, స్వేచ్ఛగా తిరుగుతున్న నాటుకోళ్లు. వాటిని దాటి ముందుకెళ్తే సురయ్యా నడుపుతున్న చేనేత కేంద్రం, మరో వైపు తన చిన్నాన్న పిల్లలతో కలిసి నివసిస్తున్న ఇల్లు, ఒక పక్కగా ఆఫీసు. వేటికవి విడిగా చిన్న చిన్న కట్టడాలు. ఇది సురయ్యా ప్రపంచం. ఎనభై ఆరేళ్ల వయసులో కూడా ఉదయం ఐదు గంటలకు నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పదింటి వరకు ఆమె ఈ ప్రాంగణం అంతా తిరుగుతూనే ఉంటారు. ఆమెను కదిలిస్తే ఎన్నెన్నో జ్ఞాపకాలు... ‘‘మా నాన్న సయ్యద్ బద్రుల్ హుస్సేన్ గొప్ప దార్శనికుడు. నేను నాలుగైదేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయన పోయారు. స్వదేశీ ఉద్యమంలో ఆయన కీలకభాగస్వామి. ఆ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్లో విదేశీ వస్తువులను, వస్త్రాలను తగలబెట్టింది ఆబిడ్సలోని మా ఇంటి ముందే. హైదరాబాద్లో తొలి పుస్తకాల దుకాణం ‘హైదరాబాద్ బుక్ డిపో’ ఆయన స్థాపించినదే. ఖాదీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కరీంనగర్లో చేనేతకారులతో ఖాదీ కుటీర పరిశ్రమలు, హైదరాబాద్లో హస్తకళల పరిశ్రమను స్థాపించారు. నేను నాన్నను చూసింది ఈ సేవలోనే. అందుకే నాకు ఇవంటే అంత మమకారం. కోఠీ ఉమెన్స్ కాలేజ్లో ఇంటర్ కాగానే నాన్న స్థాపించిన హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీలో ఉద్యోగంలో చేరాను. అప్పటికే అది ప్రభుత్వ అధీనంలో నడుస్తోంది. పాడి- పంట- ఓ మగ్గం!: పదెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆవులు, గేదెలతోపాటు కోళ్ల పరిశ్రమ చూసుకున్నాను. 30 ఏళ్ల కిందట ఒక్క మగ్గంతో చేనేత కేంద్రాన్ని స్థాపించాను. చేనేతను కాపాడాలంటే... వారసత్వంగా ఆ పని చేసే కుటుంబాలకే పరిమితం కాకుండా నేర్చుకోవాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరికీ విస్తరించాలి. భర్తను కోల్పోయి, బతుకుతెరువు లేక ఇబ్బంది పడుతున్న వారిని సమీకరించి నేత పని నేర్పించాను. నేను నేర్చుకున్న పర్షియా నేత కళ హిమ్రూ, కచ్ చేనేత మష్రూ, కాశ్మీర్ చేనేతశైలి జమావరీలలో శిక్షణ ఇచ్చాను’’ అన్నారు సురయ్యా. హైదరాబాద్కు హిమ్రూ! హిమ్రూ అంటే పర్షియన్ బ్రొకేడ్ (పూలు, లతల డిజైన్ను జరీతో నేయడం). హిమ్రూ నేతకారులు నిజాం నవాబుల కాలంలో ఔరంగాబాద్ పరిసరాల్లో జీవించేవారు. ఈ కళను హైదరాబాద్కు తెచ్చారు సురయ్యా. ‘‘మన చేనేత విధానంలో హిమ్రూని మిళితం చేసి డిజైన్లు రూపొందించాను. ఇలాంటి ప్రక్రియ దేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా లేదు. నేను హిమ్రూ, పైథానీ, జమావరి, ఇకత్ వంటి నేత ప్రక్రియలను నేర్చుకోవడంతో ఈ ప్రయోగాలు సాధ్యమయ్యాయి. ఇప్పుడు పది మగ్గాలతో ఇరవైమంది నేతకారులతో నడుస్తోంది ఈ కేంద్రం. దీనికి సమాంతరంగా గద్వాల్, నారాయణ్పేట, ఉప్పాడ, పోచంపల్లి వంటి ప్రతి చోటా ఇద్దరు ముగ్గురు నిపుణులైన చేనేతకారులు ఈ కేంద్రానికి పనిచేస్తున్నారు. వారికి కొత్త డిజైన్లు ఇచ్చి, ఆ డిజైన్లో అవసరమైన చేనేత విధానాలను ఎలా మిళితం చేయాలో నేర్పిస్తాను’’ అని వివరించారామె. వరంగల్ నేతకారుల తివాచీలకు కలంకారీ అద్దకం చేయించడం వంటి ప్రయోగాలు చేశారామె. ఏటికొప్పాక కొయ్య బొమ్మలు చేసేవారు, ఒరిస్సా నుంచి బ్రాస్ బొమ్మల తయారీదారులు కూడా ఈ కేంద్రానికి పనిచేస్తున్నారు. చదువు- సంస్కారం! చేనేత కేంద్రానికి అనుబంధంగా పాఠశాల స్థాపన గురించి ‘‘చిన్నాన్నకు, మా వారు అరబిందో బోస్కు పిల్లల చదువంటే చాలా ఇష్టం. చదువుతోనే చైతన్యం వస్తుందని, ఇంగ్లిష్ భాష వస్తే పరిధి విస్తరిస్తుందనేవారు. వారిపేరుతో ఇంగ్లిష్ మీడియం స్కూలు స్థాపించాను. దీనిని మా పెద్ద చిన్నాన్న ఖుర్షీద్ హసన్ కూతురు మేరీ చింతారా నడుపుతోంది. నా చేనేత కేంద్రంలో పనిచేసే కుటుంబాల పిల్లలు ఇందులోనే చదువుకుంటారు. ఆ తల్లిదండ్రులకు పిల్లలకు మంచిచెడు, పద్ధతులు చెప్పే తీరిక ఉండదు. పిల్లలకు చదువుతోపాటు సంస్కారం కూడా ఇక్కడే నేర్పాలి. టెన్త పరీక్షలో మా పిల్లలందరూ ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. కొందరు ఉన్నత విద్య కోసం విదేశాలకు కూడా వెళ్లారు. నాకు పిల్లల్లేరు, మా స్కూల్లో చదువుతున్న 550 మంది నా పిల్లలే’’ అంటారామె. గుర్తించారనడానికి ఓ సంకేతం! యుధ్వీర్ స్మారక అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగానే కాదు గర్వంగా కూడా ఉందంటారు సురయ్యా. ‘‘ఇది చేనేతకు నేను చేసిన శ్రమకు గుర్తింపు. నాకు తోచినట్లు, నాకు నచ్చినట్లు చేస్తూ వచ్చాను. సమాజం గుర్తించింది అనడానికి ఇది ఓ సంకేతం అంతే. మా వారు అరబిందో బోస్... సుభాష్ చంద్రబోస్ పెద్దన్నయ్య కొడుకు. ఆయన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ ప్రెసిడెంట్గా దేశంలో ఎక్కడ కార్మికుల హక్కులకు భంగం వాటిల్లినా అక్కడ ఉండేవారు. ఆయన సేవలు ఉత్తరాదిలోనే ఎక్కువగా ఉండేవి. నా పరిశ్రమ దక్షిణాదిలో విస్తరించింది. ఆయన బెంగాలీగా ఉత్తరాది రుణం తీర్చుకున్నారు, నేను హైదరాబాదీగా దక్షిణాదిలో పనిచేస్తున్నాను’’ అంటారు. చెట్టు మీది కాయ - సముద్రంలో ఉప్పు! తోటమాలికి మామిడి చెట్టును పెంచి కాయను కోయడమే తెలుస్తుంది. సముద్రతీరంలో ఉప్పు పండించే వారికి ఉప్పు రాశులు పోయడమే తెలుసు. పొలం సాగు చేసే రైతు... మిరపనారు పోసి ఎర్రటి మిరపకాయల దిగుబడి సాధించడంలో నేర్పరి. ఈ మూడింటినీ తూకంగా కలిపి నోరూరించే ఆవకాయ చేసేది అమ్మ. సురయ్యాబోస్ చేయి కూడా అలాంటిదే. కాశ్మీరీ జమావరీ, పర్షియా హిమ్రూ, దక్షిణాది ఇకత్ను కలుపుతూ మన సంప్రదాయ రీతులను కాపాడుతున్నారు. - వాకా మంజులారెడ్డి, ఫొటోలు: ఎస్ఎస్ ఠాకూర్